ఆంధ్రప్రదేశ్లో సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇంకా ఇక్కడి పరిసర ప్రాంతాల గురించి తెలుసుకునేందుకు వివిధ జాతరలు కూడా నిర్వహిస్తుంటారు. అందులో ముఖ్యంగా తిరుపతిలోని గంగమ్మ జాతర ఎంతో ప్రసిద్ధిచెందింది. ఈ జాతర ఏటా ఒకసారి నిర్వహిస్తుంటారు. ఇక, ఈఏడాది గంగమ్మ జాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతర పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, వారి జీవన విధానాలకు అద్దం పడుతుంది. 900ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గంగమ్మజాతర విశేషాలేంటో తెలుసుకుందాం.
తిరుపతిలో ప్రతి సంవత్సరం జరిగే గంగమ్మ జాతర ఇవాళ (మే 15) ప్రారంభమైంది. తొమ్మిదివందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ జాతను ఏటా ఏడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సారి ఈ జాతరను మే 15 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. కైకాల వంశస్థులు జాతరను చాటింపుతో ప్రారంభించడంతో ఈ ఆనవాయితీ మొదలవుతుంది. నేటి నుంచి ఏడు రోజుల పాటు ఈ జాతరను ఇక్కడివారు ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
ఇక, నేటి నుంచి రోజుకో వేషంలో గ్రామదేవతకు భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. గంగమ్మ జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. నిన్న (మే14) అర్థరాత్రి చాటింపుతో తిరుపతి గ్రామ దేవతగా పిలుచుకొనే చిన్నగంగమ్మ జాతర గ్రాండ్గా మొదలయ్యింది. నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. మే 22వ తేదీన తెల్లవారు జామున అమ్మవారి విశ్వరూప దర్శనం, చెంప నరికే కార్యక్రమంతో ఈ జాతర ముగుస్తోంది. . శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి కాదు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తున్నారు.

ఏడు రోజులు ఏడు వేషాలు..
ఇవాళ బైరాగివేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. మే 16వ తేదిన భక్తులు బండ వేషం ధరించి మొక్కులు చెల్లించుకుంటారు. మే 17న తోటి వేషం, 18న దొర వేషం, 19న మాతంగి వేషం, 20న సున్నపు కుండలు, 21న గంగమ్మకు చప్పరం కార్యక్రమం వంటివి నిర్వహిస్తారు. ఇక ఈ నెల 22 వ తేదీన విశ్వరూప దర్శనం తర్వాత చెంప నరికే కార్యక్రమంతో ఈ గంగమ్మ జాతర ముగుస్తుంది.
ఈ జాతరలో భాగంగా ఓ రోజు పురుషులు మహిళల వేషం వేసుకుని డ్యాన్స్ చేస్తూ, అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ గంగమ్మ తల్లిని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి స్వయానా సోదరి అని చెబుతుంటారు. అందుకే ఏటా జాతర సమయంలో టీటీడీ నుంచి గంగమ్మకు సారెను కూడా అందిస్తుంటారు. అందుకే ఈ ఏడురోజుల జాతరలో భాగంగా జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు-కుంకుమ, శేష వస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళ, తాళాలతో తీసుకొచ్చి, పుట్టింటికి సారెగా అందజేస్తారు. ఇప్పటికీ ఈ ఆచారం ఇలాగే కొనసాగుతోంది.
మరో ప్రత్యేకత..
తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతరకు మరో ప్రత్యేకత ఉంది. ఈ జాతర జరిగినన్ని రోజులు గ్రామస్తులు ఊరి విడిచి వెళ్లరు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా రాత్రుళ్లు బస చేయకుండా వెళ్లిపోవడం ఇక్కడి ఆచారం. ఇదే ఆచారం ఎప్పటినుంచో కొనసాగుతోంది.



Click it and Unblock the Notifications













