కళియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు నిత్యం తరలి వెళ్తుంటారు. అయితే, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఓ ముఖ్య గమనిక..బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజులుగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షాకు తిరుమల ఘాట్ రోడ్డులోని కొండ చరియలు నేటి ఉదయం విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని హరిణి దగ్గర కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, ఆ సమయంలో అక్కడ ఎటువంటి వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే, వెంటనే అప్రమత్తమైన ఆలయ అధికారులు సహాయచర్యలు చేపట్టారు. ఘాట్రోడ్డుపై పడి ఉన్న బండరాళ్లను జేసీబీల సాయంతో తొలగించారు.
పలు దర్శనాలు రద్దు..
నేడు (బుధవారం) అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వీటితోపాటు తిరుమలకు ఘాట్ రోడ్డులో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే టీటీడీ కొండపై పలు ప్రాంతాలకు భక్తుల్ని అనుమతించడం లేదని వివరించారు. తిరుమల ఘాట్ రోడ్లలో విరిగిపడిన కొండచరియలను తొలగించేందుకు జేసీబీలు, ట్రక్కులు, అంబులెన్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు. అయితే, ఈ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టేవరకు భక్తులు తిరుమల ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఎంతో ఉత్తమం అని టీటీడీ ఆలయ అధికారులు పేర్కొన్నారు. తిరుమలతో పాటుగా శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి కూడా భక్తులను అనుమతించడం లేదు.

రన్వేపైకి నీరు..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల ఘాట్రోడ్డులోని కొండ చరియలు విరిగిపడే అవకాశముందని టీటీడీ ముందుగానే భావించింది. అయితే, ఆ క్రమంలోనే అన్ని విభాగాలను టీటీడీ అప్రమత్తం చేసింది. ఇదిలా ఉండగా, తిరుమల కొండల నుంచి వస్తున్న నీటితో సమీపంలోని కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. పట్టణంలోని రాజీవ్గాంధీ కాలనీ, ఆటోనగర్, కొరమీనుగుంటలో వరద నీరు వచ్చి చేరుతోంది. వీటితోపాటు తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం దగ్గర కూడా సీత కాల్వ కాజ్వేపై వరద అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు రేణిగుంట రన్వేపైకి నీరు చేరాయి. దీంతో ఇండిగో విమానానికి ల్యాండింగ్ సమస్య వచ్చింది. వెంటనే ఫ్లైట్ను చెన్నైకి దారి మళ్లించారు. ఇక, ఈ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి రేణిగుంటకు రావాల్సి ఉంది.

నిన్న ఒక్కరోజే హుండీకీ భారీ ఆదాయం..
తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకునేందుకు భక్తులు క్యూలైన్లలో భారీగా వేచి చూస్తున్నారు. దసరా సెలవులు ముగిసిన ఇక్కడ భక్తుల రద్దీ మాత్రం తగ్గలేదు. నిన్న (మంగళవారం) సర్వదర్శనం టోకెన్లు లేని శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 18 గంటలు పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. మంగళవారం శ్రీవారిని 73,891 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,423 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్క మంగళవారం రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.53 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు.



Click it and Unblock the Notifications













