ఏపీలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో ఇటీవలే శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక్కడికి నిత్యం భక్తులు బారులు తీరుతుంటారు. ఇప్పడు ఆలయంలో కార్తీక మాసోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీశైలం క్షేత్రంలో నవంబర్ 2వ తేదినుంచి డిసెంబర్ 1వ తేది వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు నేటి ఉదయం మాసోత్సవాలకు సంబంధించిన వివరాలను ఆలయ ఈవో చంద్రశేఖర్రెడ్డి మీడియాకు వివరించారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగే గర్భాలయ అభిషేకాలను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు తెలియజేశారు.
ఆ దర్శనానికి మాత్రమే అనుమతి..
శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రంలోని స్వామివారిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక, పండుగలు, ఉత్సవాల సమయంలో ఈ ఆలయం మరింత రద్దీగా ఉంటుంది. కార్తీక మాసోత్సవాల వేల ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలో పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శని, ఆది, సోమవారం కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్వామివారి స్పర్శ దర్శనం అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందని ఆలయ ఈవో పేర్కొన్నారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. గర్భాలయ అభిషేకాలను మాత్రం పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

కార్తీక పౌర్ణమి వేళ...
ఆలయ రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన, పూజలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో కొనసాగింపు ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో కార్తీక దీపారాధన చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెల (నవంబర్) 15 వ తేదిన కార్తీక పౌర్ణమి కావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం కార్యక్రమం ఉంటుందని ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
అమ్మవారి ఉత్సవాలు..
ఇదిలా ఉండగా, ఇటీవల శ్రీశైల ఆలయంలో దసరా దేవీనవరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యాలు గురికాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.నవరాత్రుల సందర్బంగా ప్రతీరోజు ఒక్కో రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ పుణ్యకేత్రంలో అక్టోబర్ 3వ తేది నుంచి 12వ తేది వరకు దసరా మహోత్సవాలను దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహించింది.
ఈ నవరాత్రి ఉత్సవాలలో స్వామి, అమ్మవార్లకు విశేష అర్చనలు, రుద్రయాగం, చండీయాగం, జపపారాయణలు, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామి, అమ్మవార్లకు వివిధ వాహన సేవలు వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని ఎంతో అందంగా పుష్పాలతో అలంకరించారు. అమ్మవారి దర్శన కోసం ప్రత్యేక క్యూలైన్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, గ్రామోత్సవాన్ని వీక్షించేందుకు ప్రధాన ఆలయానికి ముందుభాగాన ఎల్ఈడీ స్క్రీన్లను కూడా పెట్టారు. ఇదిలా ఉండగా, శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఉదృతంగా ఉంది. దీంతో అధికారులు జలాశయం 4 గేట్లు ఎత్తారు.



Click it and Unblock the Notifications













