బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతోందని, ఇది బంగాళాఖాతంలో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో ఈ అల్పపీడనం కారణంగా మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. అలాగే, దక్షిణ కోస్తాతోపాటు రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఏపీలోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
బుధవారం నాటికి తుపానుగా..
ఈ అల్పపీడం బుధవారం నాటికి తుపానుగా మారి, 17వ తేదీన చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారుల అంచనా. దీంతో ఇప్పటికే, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడపతోపాటు అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే, నెల్లూరు జిల్లాలోని కావలిలో 15 సెం.మీ, అద్దంకి (బాపట్ల) 14 సెం.మీ, కందుకూరు (నెల్లూరు) 12 సెం.మీ, యానాం 9 సెం.మీ, ఆత్మకూరు (నెల్లూరు) 8 సెం.మీ, కోస్తాలో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాయలసీమ ప్రాంతం వైఎస్ఆర్ కడప జిల్లా కోడూరులో 10 సెంటీమీటర్లు, సూళ్లూరుపేటలో 7 సెంటీమీటర్లు, గూడూరులో (తిరుపతిలో) 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

55 కి.మీ వేగంతో గాలులు..
నేడు (అక్టోబర్ 15) పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) పేర్కొంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. అలాగే, తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ కూర్మనాధ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని తెలిపారు.

విద్యా సంస్థలకు సెలవు..
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ. కోటి అత్యవసర నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే, అక్కడి ప్రజలను సులక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోనున్నారు.
ఈ భారీ వర్షాల దృష్ట్యా నెల్లూరు జిల్లాలో రెండో రోజు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే ఈ జిల్లాలో 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే, రహదారులు భవనాలు, మున్సిపల్, పంచాయితీరాజ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. తుపాను నేపథ్యంలో దూర ప్రాంతాలకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ప్రజలను కోరింది.



Click it and Unblock the Notifications













