ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో దాగి ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక్కో ప్రదేశంలో ఒక్కో ఆలయం ఎంతో పేరుగాంచింది. విజయవాడ పేరు చెప్పగానే అందరికీ కనకదుర్గమ్మ ఆలయం గుర్తుకొస్తుంది. ఈ ఆలయంలో కొలువైన అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారని భక్తుల నమ్మకం. ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా అమ్మవారి దర్శన భాగ్యం పొంది మరీ ఇక్కడినుంచి వెళతారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారు ఎంతో ప్రసిద్ధిచెందినవారు. నిత్యం ఇక్కడికి భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు తరలి వస్తుంటారు. ఇక్కడ దసరా ఉత్సవాలు ఎంతో అంగంగా వైభవంగా జరుగుతాయి. ఇక, పండుగలు, పూజ కార్యక్రమాల సందర్బంలో ఇక్కడ భక్తులు వేలసంఖ్యలో తరలి వస్తుంటారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారి ఆషాడ మహోత్సవాలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఆగస్టు 19 తేదీ నుంచి శాకాంబరి దేవి ఉత్సవాలు...
ఈ ఆలయంలో ప్రతి ఏడాది ఆషాడ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో నేటి (శనివారం) నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి తొలి సారెను ఆలయ వైదిక కమిటీ సభ్యులు సమర్పించడం జరిగింది. వీటితోపాటు ఆగస్టు 19 తేదీ నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై శాకాంబరి దేవి ఉత్సవాలు జరుగుతాయి. ఆషాడ మాహోత్సవాలు ఆగస్టు 4వ తేదివరకు జరుగుతాయి. వీటిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ముందుగా మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారికి కమిటీ సభ్యులు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, చలిమిడి, గోరింటాకుతో సారెను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇవాళ ఆషాడ మాసం తొలిరోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఆషాడ మాసోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
ఎంతో ప్రాముఖ్యత...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు, భవానీ దీక్షలు, శ్రావణమాసంలో నిర్వహించే ఉత్సవాల తర్వాత ఆషాడమాసోత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందనే చెప్పుకోవాలి. ఆషాడమాసోత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఆషాడమాసంలో ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు. అలాగే దుర్గమ్మను కూడా తమ ఇంటి ఆడపడుచుగా భావించి చీరె,సారె, పూజ సామగ్రి సమర్పించడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. ఇక, ఈఏడాది నేటి నుంచి వచ్చే నెల నాలుగోతేది వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల రోజులు ఆలయ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. భక్త బృందాల సారెలు సమర్పిస్తారు, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలతో సహా దుర్గమ్మకి బోనాలు కూడా సమర్పించడం ఎప్పటినుంచో ఆనవాయితీ వస్తోంది.
ఇతర రాష్ట్రాల నుంచి...
ఆషాడమాసోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆషాడ మాసోత్సవాలు, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలతో పాటూ ప్రతి శుక్రవారం, శనివారం ఆలయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆలయంలోని దుర్గమాల్లేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల వారే కాకుండా తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు.



Click it and Unblock the Notifications













