తిరుమల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా నేడు (అక్టోబర్ 3న) బ్రహ్మోత్సవ అంకురార్పణం కార్యక్రమం చేపట్టనున్నారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం ఎంతో ముఖ్యమైంది. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్ధిస్తూ ఈ అంకురార్పణం కార్యక్రమం నిర్వహిస్తారు.
ఈ అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందులో ముందుగా పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోయాలి. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని సాయంత్రం వేళలో నిర్వహిస్తారు. ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయనని ఇక్కడివారి నమ్మకం. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేది నుండి అంటే రేపటి నుంచి ఈ నెల 12వ తేదివ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా నేటి (అక్టోబరు 03) రాత్రి 7 గంట నుండి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం కార్యక్రమం జరుగనుంది.

ధ్వజారోహణం..
ఈ అంకురార్పణ ఘట్టం ఆనంతరం రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.ఈ ఘట్టంతో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు నాంది పడినట్లు అవుతుంది. బ్రహ్మోత్సవాలతో తిరుమల శ్రీవారి ఆలయం విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. ఇక ఆలయంలో బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ విభాగం కార్యాలయం నుండి తీసుకొస్తారు.
తొమ్మిదిరోజులు..
బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రం అంకుర్పారణ జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు మొత్తం తొమ్మిదిరోజుల పాటు జరగనున్నాయి. అక్టోబర్ 4వ తేది నుంచి 12వతేది వరకు వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య వాహన సేవలు ఉంటాయి. అక్టోబర్ 4వ తేది మినహా అన్నీరోజులు ఇదే పద్ధతి కొనసాగిస్తారు.

బ్రహ్మోత్సవాల జాబితా
అక్టోబర్ 4 : శుక్రవారం సాయంత్రం 5:45 నుంచి సాయంత్రం 6 వరకు ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. రాత్రి 9 నుంచి రాత్రి 11 వరకు పెద్ద శేష వాహనం నిర్వహిస్తారు.
అక్టోబర్ 5 : శనివారం ఉదయం 8 నుంచి ఉదయం 10వరకు చిన్నశేష వాహన సేవ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం జరిపిస్తారు. అనంతరం రాత్రి 7 నుంచి రాత్రి 9 వరకు హంస వాహన సేవ కార్యక్రమం ఉంటుంది.
అక్టోబర్ 6 : ఇక, ఆదివారం ఉదయం 8 నుంచి ఉదయం 10 వరకు సింహ వాహన సేవ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం జరిపిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపుపందిరిలో శ్రీవారు విహరిస్తారు.
అక్టోబర్ 7 : ఇక, సోమవారం ఉదయం 8 నుంచి ఉదయం 10వరకు కల్పవృక్షం సేవ ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 వరకు స్నపనం, రాత్రి 7 నుంచి 9 వరకు సర్వ భూపాల సేవ కార్యక్రమం ఉంటుంది.
అక్టోబర్ 8 : మంగళవారం ఉదయం 8 నుంచి 10వరకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 వరకు గరుడ వాహన సేవ ఉంటుంది.
అక్టోబర్ 9: బుధవారం ఉదయం 8 నుంచి 10 వరకు హనుమంత వాహనం, ఆ తర్వాత తిరిగి సాయంత్రం 4 నుంచి 5 వరకు స్వర్ణ రథం, రాత్రి 7 నుంచి రాత్రి 9 వరకు గజవాహన సేవ జరిపిస్తారు.
అక్టోబర్ 10 : గురువారం ఉదయం 8 నుంచి 10 వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 నుంచి 9వరకు చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది.
అక్టోబర్ 11 : శుక్రవారం ఉదయం 7నుంచి రథోత్సవం జరగగా, రాత్రి 7 నుంచి 9 వరకు అశ్వ వాహన సేవ ఉంటుంది.
అక్టోబర్ 12 : ఇక, చివరిరోజు చక్నస్నానం ఉంటుంది. ఉదయం 6 నుంచి 9 వరకు ఈ క్రతువు జరుగుతుంది. ఇక అదే రోజు రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ధ్వజావరోహణం కూడా నిర్వహిస్తారు. ఈ వేడుకతో తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.



Click it and Unblock the Notifications













