తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ 9వ తేదీన ఉగాది సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ప్రతి సంవత్సరం ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఈ ఆలయ ఆనవాయితీ. అందుకే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పాటిస్తుంటారు.
ఆ రోజున ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. శుద్ధి కార్యక్రమం తర్వాతే భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పువేస్తారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు.

శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతి ఉత్సవాలు...
శుద్ధి పూర్తయిన తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అంటే ఏప్రిల్ 2వ తేదిన 11 గంటల తర్వాత భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. ఇక, వచ్చేనెల 4 నుంచి 8వరకు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 521వ వర్థంతి ఉత్సవాలు జరగనున్నాయి. అన్నమయ్య జన్మస్థలం తిరుమలలోనే ఉంది.
తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో అన్నమాచార్యులవారి 521వ వర్థంతి ఉత్సవాలను తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఉదయం ఆరుగంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవంతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
వచ్చేనెల 4 నుంచి 8 వరకు అన్నమాచార్యులవారి వర్థంతి కార్యక్రమాలు...
ఇక, వచ్చేనెల ఐదవ తేదీన తిరుమలలో సాయంత్రం ఆరు గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక, ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా శ్రీవారి ఆలయంలో వచ్చే నెల 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానాన్ని కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ శుద్ధి కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తోంది. శుద్ధికార్యక్రమం అనంతరమే భక్తులకు స్వామి వారి దర్శనం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు వచ్చేనెల 4 నుంచి 8 వరకు జరగబోయే తాళ్లపాక అన్నమాచార్యులవారి వర్థంతి కార్యక్రమాలు వీక్షిచాలనుకునేవారు కూడా అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకకు వెళ్లాల్సిందే. కాబట్టి భక్తులు ఈ విషయాలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోగలరు.



Click it and Unblock the Notifications













