పాపికొండలు పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది బోటు ప్రయాణం. చుట్టు అందమైన కొండలు మధ్యలో బోటు ప్రయాణం... వివిధ పక్షులు, మొక్కలు జంతువులతో కూడిన జీవ వైవిధ్య ప్రదేశం ఇక్కడి సొంతం. కానీ, ఆ బోటు ప్రయాణాలకే బ్రేక్ పడింది. పాపికొండల విహారయాత్రను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో భారీ వర్షాల క్రమంలో ప్రభుత్వం పాపికొండల టూర్ ను తాత్కాలికంగా ఆపివేసింది. ఎగువ నుంచి గోదావరికి వరద పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడిమధ్యలో ఉన్న పాపికొండలు విహారయాత్రలకు చాలామంది పర్యాటకులు వస్తుంటారు. ఈ విహార యాత్రలో అతి కీలకమైనది బోటు ప్రయాణం. ఈ ప్రయాణం కోసమే చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. రెండు తెలుగురాష్ట్రాల అధిక సంఖ్యలో పాపికొండల విహారయాత్రకు వస్తుంటారు. గోదావరి నదిపై లాంచీలో ప్రయాణం ఓ అద్భుతమనే చెప్పాలి. ఎటువైపు చూసిన కనిపించే పచ్చని కొండలు, పక్షులు కిలకిలరావాలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణంతో ఈ విహారయాత్ర పర్యాటకులకు ఎంతో ఆహ్లదభరితంగా ఉంటుంది.
మొత్తం ఆహ్లాదకరంగా సాగుతుంది. ఏపీలోని రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ అద్భుతమైన ప్రదేశం ఉంది. ఇక, తెలంగాణలోని భధ్రాచలం పట్టణం నుంచి కూడా సుమారు అంతే దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం జాతీయ వనంగా కూడా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతం మొత్తం 1,012.86 km (391.07 sq mi) విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది.

నాలుగురోజులపాటు యాత్రలు నిలిపివేత...
రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో తుపాను హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు గోదావరి నదిలో నీటి ఉధృతి కూడా పెరిగింది. పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అధికారులు తెలిపారు. నాలుగు రోజుల పాటు పాపికొండల విహార యాత్రను నిలిపివేస్తున్నామని, ఆ తరువాత పరిస్థితులను బట్టీ యాత్రపై ఆదేశాలిస్తామని అధికారులు అన్నారు. అనుమతి లేకుండా ఎవరైనా యాత్రకు వెళ్తే, చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ఇలాంటి సమయాల్లో చాలాసందర్భాల్లో పాపికొండల విహారయాత్రల్లో విషాదాలు చోటుచేసుకున్నాయి.

పలు విషాదాలు..
2018లో పాపికొండల విహార యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత 2019 సెప్టెంబరు నెలలో కచ్చలూరు బోటు ప్రమాదం గురించి అందరికీ తెలిసినదే. ఆ ప్రమాదం తర్వాత పాపికొండల విహార యాత్రను ప్రభుత్వం నిషేధించింది. తిరిగి 2021 నవంబర్ 7వ తేదీన పాపికొండల విహారయాత్రను పునః ప్రారంభించింది. దీంతో పాపికొండలు విహారయాత్రపై అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగానే వరదలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.
ఇక, తాజాగా ఐఎండీ ఇచ్చిన తుపాను హెచ్చరికల క్రమంలో పాపికొండల విహార యాత్రకు బ్రేక్ వేశారు. ఈ బోటు ప్రయాణంలో ఇక్కడి అనేక ప్రదేశాలను చూస్తారు. రాజమండ్రి నుంచి దేవీపట్నం మండలంలోని పోచమ్మ గుడి వరకు రోడ్డు ప్రయాణం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ లాంచీలో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు, పేరంటాళ్లపల్లి ఈశ్వరాలయం వరకు సాగుతుంది. ఇక, ఈ ప్రయాణంలో బొంగులో చికెన్ ఎంతో ఫేమస్. బోటు ప్రయాణాన్ని చేసేవారు తప్కుండా బొంగులో చికెన్ను టేస్ట్ చేయాల్సిందే.



Click it and Unblock the Notifications












