మనదేశంలో చారిత్రాత్మక కోటలు చాలానే ఉన్నాయి. కానీ దెయ్యాల కోటగా ప్రాచుర్యం పొందిన నిర్మాణాల్లో భంగర్ కోటది మాత్రం ప్రత్యేక స్థానం. ఈకోటలో అద్భుతమైన వాస్తు శిల్పం సందర్శకుల మనసులను కట్టి పడేస్తుంది.
ఎన్నో వింత కథల రహాస్యాలు ఈ కోటలో దాగి ఉన్నాయి. దెయ్యాల కోటగా పేరొందిన చారిత్రాత్మక సంపద విశేషాలను తెలుసుకుందాం రండి.
భయానిక రాచరికపు సంపద.. భంగర్ కోట
ఎన్నో చారిత్రాత్మక కట్టడాల నివాసంగా ఉన్న ఎడారి రాష్ట్రం రాజస్థాన్. ఇక్కడి అల్వార్ జిల్లాలోని ఆరావళి శ్రేణులలోని ఒక గ్రామంలో ఉన్న భంగర్ కోట అనేక ఆసక్తికరమైన కథలకు ప్రసిద్ధి చెందింది. ఈ కోట రాజస్థాన్తో పాటు భారతదేశంలోని అత్యంత భయానక ప్రదేశాలలో కూడా చేర్చబడింది. పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ కోట దెయ్యాల కోటగా పిలవబడుతుంది. అయితే ఈ కోట చరిత్ర గురించి తెలిసిన వారు చాలా తక్కువ. మీరు కూడా దెయ్యాల కోటగా పిలవబడే భంగర్ కోట చరిత్రను తెలుసుకోవాలంటే,ఈ పురాతన నిర్మాణంపై గురిపెట్టాల్సిందే.
17వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ కోట పురాతనమైన, మధ్యయుగ కాలానికి ఒక నమూనాగా పరిగణించబడుతుంది. ఈ హాంటెడ్ కోట అమెర్ రాజు తన తమ్ముడి కోసం నిర్మించాడని చెబుతారు. భంగర్ కోట అన్ని వైపుల నుండి పర్వతాలతో చుట్టుముట్టబడి ఉంది, కాబట్టి ఇందులో చాలా రహాస్యాలు దాగి ఉన్నాయి. ఈ కోటలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత ఎవరూ ఉండకూడదని చెబుతారు.
భంగర్ కోట కథ
ఈ కోట కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ కోట కట్టడానికి ముందు ఇక్కడికి పక్కనే నివసించే సన్యాసి అనుమతి తీసుకున్నట్లు స్తానికులు చెబుతున్నారు. అయితే, రాజు కోట కట్టేటప్పుడు ఆ కోట నీడ సన్యాసి ఇంటిపై పడకూడదని సన్యాసి ఒక షరతు పెట్టాడు. కానీ అలా జరగకపోవడంతో కోట నీడ సన్యాసి ఇంటిపై పడింది. దాంతో ఆ సన్యాసి శపించాడని ఇక్కడ కథలుగా చెబుతుంటారు.
ఆ తర్వాత భంగర్ కోట పూర్తిగా శిథిలమై దెయ్యాల కోటగా మారిందట. అందుకనే అద్భుతమైన నిర్మాణ శైలిగల ఈ కోట ప్రాంగణంలో అడుగుపెట్టేందుకు సందర్శకులు సైతం వెనుకాడతారని వినికిడి. అయితే, స్థానికులు మినహా దూర ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులు మాత్రం ఈ కథనాన్ని కొట్టి పారేస్తున్నారు.
భంగర్ కోట సంఘటనలు
ఇలా భారతదేశంలోని అత్యంత భయంకరమైన ప్రదేశం భంగర్ కోట అని చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు. పగటిపూట కూడా ఎవరు ఒంటరిగా ఇక్కడికి వెళ్లడానికి సాహసించరని చాలా మంది స్థానికులు ప్రచారం చేస్తున్నారు. అయితే, కొంతమంది సాయంత్రం ఇక్కడ సందర్శించడానికి వెళ్ళారని, కానీ తిరిగి రాలేదని ప్రచారంలో ఉంది.
అదే సమయంలో, ఈ కోట నుండి మహిళలు అరుపులు, ఏడుపులు, వింత వింత శబ్దాలు వినిపించాయని కొందరు నమ్ముతారు. లోపలికి వెళ్లిన వారిని నీడ వెంటాడుతున్నట్లు అనిపిస్తుందని మరికొందరు నమ్ముతున్నారు. అయితే, ఇవన్నీ ఊహగానాలే అని కొట్టి పడేసేవాళ్లు లేకపోలేదు.
ఎలా చేరుకోవాలి
భంగర్ కోట ఢిల్లీ నుండి 283 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు చేరుకునేందుకు రైలు, రోడ్డు, విమాన సౌకర్యాలు నిత్యం అందుబాటులో ఉంటాయి. ముందుగా అల్వార్ రైల్వే స్టేషన్కు చేరుకుని, అల్వార్ రైల్వే స్టేషన్ నుండి టాక్సీ లేదా క్యాబ్ ద్వారా సులభంగా వెళ్ళవచ్చు.