తిరుపతిలో త్వరలోనే డబుల్ డెక్కర్ ఈ-బస్సులు..
తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు తిరుపతికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో టీఎంసీ కొత్త నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో త్వరలోనే డబుల్ డెక్కర్ ఈ-బస్సులు రోడ్లపైకి రానున్నాయి. దీని వల్ల తిరుపతి ప్రజలతో పాటు ప్రతీ రోజు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుంది.
దక్షిణ భారతదేశంలోనే రెండో సిటిగా తిరుపతి..
దక్షిణ భారతదేశంలోనే డబల్ డెక్కర్ ఈ బస్సులు అందిస్తున్న రెండో సిటీగా తిరుపతి నిలవనుంది. మొదటి సిటిగా హైదరాబాద్ ఉంది. ఇప్పడు ప్రముఖ అధ్యాత్మిక నగరమైన తిరుపతిలో డబుల్ డెక్కర్ ఈ-బస్సులు సేవలు అందించనున్నాయి. దీంతో ఈ బస్సుల సేవలు పొందుతున్న సిటీగా తిరుపతి రికార్డు నెలకొల్పనుంది. తిరుపతి నగరంలో అతి తక్కువ కాలంలోనే 20కి పైగా మాస్టర్ ప్లాన్ రోడ్లను ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల రూపురేఖలను మార్చిన టిఎంసీ ఇప్పుడు అంతర్గత ప్రజారవాణా కోసం సొంతంగా ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

నాలుగు వేర్వేరు రూట్లలో..
ఈ డబుల్ డెక్కర్ బస్సులు నాలుగు వేర్వేరు రూట్లలో నడుస్తాయి. ముందుగా దేవాలయాలు, చౌరస్తాలతో సహా నగరంలో తప్పక సందర్శించవలసిన అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలలో ఈ డబుల్ డెక్కర్ బస్సుల సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నెల చివరిలోగా ఒక ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు తిరుపతి రోడ్లపైకి రానుంది. ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టాలని టీఎంసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 550 కోట్ల రూపాయలతో శ్రీనివాస సేతు ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు కోసం తిరుపతి స్మార్ట్ సిటి కార్పొరేషన్ లిమిటేడే 550 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టింది. ఈ స్మార్సిటి కార్పొరేషన్ లిమిటెడ్ కూడా టిఎంసీ ఏర్పాటు చేసినదే.
ఎక్స్ప్రెస్ వే ను ప్రారంభించిన సిఎం..
ఈ ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వే ను ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అయితే దీని వల్ల అత్యుత్తమ అంతర్గత రహదారి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి భక్తులతో పాటు ప్రజలను ఎలాంటి ఇబ్బందీ లేకుండా తమ గమ్యస్థానాలను చేర్చడానికి ప్రపంచ స్థాయి ప్రజా రవాణా వ్యవస్థను నెలకొప్పడంపై టీఎంసీ ఇప్పుడు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ డబల్ డెక్కర్ బస్సులకు సుమారు 3 గంటలు పాటు ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది.

ఇవి 250 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. 30అడుగుల పొడవు, 16అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు కలిగిన ఈ బస్సులోని రెండు అంతస్తుల్లో 65మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది. క్లోజ్డ్ విండోస్, సెంట్రల్ ఏసీ, సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీలో విండోస్ను తొలగించే సౌకర్యాలు, స్టాపింగ్ పాయింట్లను తెలిపే డిజిటల్ బోర్డు, అల్లారం, వెనుక, ముందు వెడల్పాటి ఆటోమెటిక్ డోర్లు, ఎయిర్బ్యాగ్, వైఫై, అనౌన్స్మెంట్ మైక్ వంటి సదుపాయాలున్నాయి. మొత్తం మీద తిరుపతి రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు తీయనున్నాయి.
డిప్యూటీ మేయర్ మాటల్లో...
తిరుపతి నగరంలో నాలుగు లక్షల జనాభా ఉందని, ప్రతిరోజూ లక్ష మందికి పైగా యాత్రికులు ఇక్కడకు వస్తుంటారని డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. అందుకే నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభిస్తున్నామని, దీని వల్ల సౌకర్యవంతమైన, సులభమైన ప్రయాణాలు అందరికీ అందుబాటు ధరలోకి వస్తాయని చెప్పారు. ప్రజా రవాణా కోసం ఇలాంటి బస్సులను ప్రవేశపెట్టిన మొదటి నగరంగా తిరుపతిని మార్చినందుకు టీఎంసీ గర్విస్తోందని ఆయన అన్నారు.



Click it and Unblock the Notifications













