ప్రతి సంవత్సరం విశాఖపట్నంలోని సింహాచలం క్షేత్రంలో ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున సింహగిరి ప్రదక్షిణ ప్రారంభించి పౌర్ణమి రోజు భక్తులు అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆనవాయితీ నేపథ్యంలో శనివారం(జూలై 20) నాడు అశేష భక్తజనం గిరి ప్రదక్షిణ చేసేందుకు బారులు తీరనున్నారు. లక్షలాదిగా హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
కొండ దిగువన తొలిపావంచా వద్ద నుంచి శనివారం సాయంత్రం 4గంటలకు స్వామి వారి నమూనా విగ్రహంతో పుష్పరథం గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. మొత్తం సింహగిరి వైశాల్యం 32 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. తొలిపావంచా నుంచి పాత అడివివరం, ముడసర్లోవ, హనుమంతవాక కూడలి, విశాలాక్షినగర్, అప్పుఘర్, ఎంవీపీ డబుల్ రోడ్డు మీదుగా వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్బీ కాలనీ, సీతమ్మధార, డీఎల్బీ క్వార్టర్స్, మాధవధార, ఆర్ అండ్ బీ కార్యాలయం మీదుగా ఎన్ఏడీ కూడలి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల కూడలి మీదుగా పుష్పరథం రాత్రి 10 గంటలకు తిరిగి తొలిపావంచా దగ్గరకు వస్తుంది. ఇప్పటికే భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని శనివారం ఉదయం 6గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6గంటల వరకు సింహాచలం, అడివివరం ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను సెబ్ అధికారులు మూసివేయించారు.
ఆలయ ప్రదక్షిణకు అనుమతి
అలాగే, శనివారం గిరి ప్రదక్షిణ చేయలేని వారు సింహగిరిపై ఆలయ ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పౌర్ణమి రోజు (ఆదివారం) వేకువజామున 3గంటల నుంచి భక్తులను ఆలయ ప్రదక్షిణకు అనుమతిని ఇస్తారు. ఆలయ ప్రధాన రాజగోపురం నుంచి ఆలయ ప్రాకారం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆదివారం సింహగిరికి తరలివచ్చే భక్త జనానికి ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిరంతరాయంగా కదంబం, ఇతర ప్రసాదాలను అందిస్తారు. అలాగే, భక్తులను కొండపైనుంచి కిందకు తీసుకువచ్చేందుకు ఆదివారం ఉదయం 4గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దేవస్ధానం బస్సులతో పాటు ఆర్టీసీకి చెందిన 45 బస్సులు ఉచిత సర్వీసులు అందించనున్నాయి.
ఉచిత బస్సుల సౌకర్యం..
భక్తుల కోసం తొలిపావంచా వద్ద 50క్యూలైన్లను ఇప్పటికే సిద్ధం చేశారు. కొబ్బరికాయలు కొట్టేందుకు వీలుగా 80 ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేశారు. అలాగే, హనుమంతవాక రోడ్డులో కొత్త ఘాట్ రోడ్ దగ్గర అప్పన్న స్వామి నమూనా ఆలయాన్ని రూపొందించి, అక్కడ కొబ్బరికాయలు కొట్టేందుకు వీలుగా గడ్డర్లను అమర్చారు. వీటితోపాటు కొండ దిగువన అడివివరంలో 29 ప్రదేశాల్లో పార్కింగ్ ప్రాంగణాలను ఏర్పాటు చేయడంతోపాటు కొండపైన కూడా మూడు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు సమాచారం, ఇతర అత్యవసర అవసరాల కోసం కొండ చుట్టూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పుణ్య స్నానాలు చేసే భక్తుల కోసం దుస్తులు మార్చుకునేందుకు మాధవధారలోని సహజ జలధార వద్ద ప్రత్యేక శిబిరాలు, 40 తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరం అందుబాటులోకి తెచ్చారు. అలాగే, సముద్ర స్నానాలు చేసే భక్తుల భద్రత నిమిత్తం 24 గంటలూ అందుబాటులో ఉండేలా గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు.



Click it and Unblock the Notifications












