ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైన వాటిని శ్రీశైల మల్లిఖార్జున స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో కొలువైన మల్లికార్జున స్వామి దర్శనం నిమిత్తం భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. రెండుతెలుగు రాష్ట్రాల్లో గణపతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపు వినాయకచవితి సందర్భంగా శ్రీశైలం ఆలయంలో గణపతి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారం (సెప్టెంబర్ 07) నుంచి ఎంతో వైభవంగా ప్రారంభం కానున్నాయి.
ఈ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రత్నగర్భ గణపతికి, సాక్షి గణపతికి యాగశాలలోని పంచలోహమూర్తికి వ్రత కల్ప విశేషార్చనలు జరపనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులకు ఉచిత దర్శనం కల్పించనున్నారు. అయితే, ఆ ఉచితంగా పూజలు చేసుకునే అవకాశం అందరికీ వర్తించదు. అది కేవలం తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న భక్తులకు మాత్రమే.
సాక్షి గణపతి వద్ద మృత్తికా గణపతి విగ్రహాన్ని నెలకొల్పి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తున్న ఈ పూజల్లో తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా పూజలు నిర్వహిస్తామని అధికారులు వివరించారు. ఉచిత పూజలు చేసేందుకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని భక్తులకు సూచించారు. శ్రీశైల ఆలయంలో నిర్వహిస్తున్న ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 16వ తేదీతో ముగియనున్నాయి.

శతాబ్దాలుగా పూజలందుకుంటున్న గణనాథుడు...
శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి కుడివైపున గణపతి విగ్రహం కొలువై ఉంటుంది. ఈ వినాయకుని అందరూ రత్నగర్భ వినాయకుడు అని పిలుస్తుంటారు. గత కొన్ని శతాబ్దాలుగా ఈ రత్నాగర్భ వినాయకుడు నిత్యం పూజలు అందుకుంటున్నట్లు ఇక్కడివారు చెబుతున్నారు.
దేవాలయంలోకి ప్రవేశించగానే స్వామివారికి కుడివైపున ఈ రత్నగర్భ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఆ తర్వాతే ఆలయంలో శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. ఇక, ప్రతిఏటా ఇక్కడ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఇక్కడి గణనాథుడు భక్తుల చేత విశేష పూజలు అందుకుంటారు.
నంద్యాలలోని సాక్షి గణపతి ఆలయం..
నంద్యాల జిల్లా శ్రీశైలంలో సాక్షి గణపతి ఆలయాన్ని నిత్యం భక్తులకు దర్శించుకుంటారు. ఇక, వినాయక చవితి ఉత్సవాల్లో మాత్రం ఇక్కడికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ సాక్షి గణపతి ఆలయంలోని లంబోదరుడిని దర్శించుకున్నాకే శ్రీశైల మల్లికార్జున స్వామిని భక్తులు దర్శించుకుంటారు. ఇది ఇక్కడ పూర్వ కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న పద్ధతే. ఈ ఆలయం శ్రీశైలం కొండపై శ్రీశైలం ప్రధాణ ఆలయానికి, శ్రీశైలం ఆనకట్టకు మధ్య వెలసింది.
ద్వాపర యుగంలో పంచపాండవులు ద్రౌపదితో కలిసి ఈ క్షేత్రానికి వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. అయితే, వీరు మొదట శ్రీ సాక్షిగణపతిని దర్శించుకున్న తర్వాత ఆ శ్రీ మల్లికార్జున, భ్రమరాంబలను దర్శించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడికి వచ్చేవారు ముందుగా సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకున్నాకే మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు.



Click it and Unblock the Notifications













