కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు భారీగా కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమృత భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తిరుపతితోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ జిల్లానుంచి ఏకంగా పది రైల్వే స్టేషన్లను అమృత భారత్ పథకంతో ఆధునీకరంచేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ జిల్లాలోని పది రైల్వే స్టేషన్లు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అగుపెట్టాలనుకునే భక్తులకు మాత్రం ఇదో గొప్ప కానుకనే చెప్పాలి.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు కేంద్రం తీపి కబురు తెలిపింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ రెండు జిల్లాల పరిధిలో మొత్తంగా పది రైల్వే స్టేషన్లను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఇందులో తిరుపతి, రేణిగుంట, పాకాల , చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె రోడ్డు, పీలేరు, కుప్పం,గూడూరు, సూళ్ళూరుపేట స్టేషన్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ స్టేషన్లలో పలు సమస్యలు తిష్టవేశాయి. ఈసారి కేంద్రం ప్రకటనతో గొప్ప అవకాశం దక్కించుకున్నట్లయిందని జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో అమృత భారత్ పథకం కింద జిల్లాలోని పది రైల్వే స్టేషన్లు ఎంపిక కావడం మంచి పరిణామంగా భక్తులు భావిస్తున్నారు.

మొత్తం 73 రైల్వే స్టేషన్లు..
అలాగే, రాష్ట్రవ్యాప్తంగా అమృత్ భారత్లో భాగంగా మొత్తం 73 రైల్వే స్టేషన్లను కేంద్రం ఎంపిక చేసింది. ఇందులో ఒకే ప్రాంతానికి చెందిన పది స్టేషన్లు వుండడం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడున్న రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద సరికొత్తగా తీర్చిదిద్దనున్నారు. వీటిని అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, హంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అవకాశముందని అధికారులు చెబున్నారు. అయితే ఈ స్టేషన్ల అభివృద్ధికి ఎంత నిధులు కేటాయించారన్న వివరాలను ఇంకా వెల్లడించలేదు. అంతేకాదు, కొన్నేళ్ళ కిందటే ఈ ప్రాంతంలోని రైల్వే స్టేషన్లను ఆధునికీకరించారు. అయినప్పటికీ తాజాగా కేంద్రం అమృత్ పథకం కిందకు వీటిని చేర్చడం ఈ ప్రాంతం అభివృద్ధి పరంగా ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
కేటగిరీల ప్రకారం..
ఈ జాబితాలో ఎంపికైన స్టేషన్ల విషయానికి వస్తే.. తిరుపతితోపాటు శ్రీకాళహస్తి స్టేషన్లు పుణ్యక్షేత్రాల కేటగిరీలో ఉన్నాయి. అలాగే, గూడూరు, రేణిగుంట, పాకాల స్టేషన్లు ప్రధాన జంక్షన్ కేంద్రాల జాబితాలో, సూళ్ళూరుపేట తమిళనాడు సరిహద్దుల్లోనూ, కుప్పం కర్ణాటక సరిహద్దుల్లోనూ కీలక స్టేషన్లుగా గుర్తించబడ్డాయి. అలాగే, చిత్తూరు జిల్లా కేంద్రంతో పాటు తమిళనాడు సరిహద్దుల్లో కీలక స్టేషన్ అని తెలిసిందే. దీంతోపాటు పీలేరు ఉమ్మడి చిత్తూరు జిల్లా నడిబొడ్డున ముఖ్యమైన స్టేషన్గా గుర్తింపు పొందింది. ఇలా కేటగిరీ ప్రకారం.. వాటి ప్రాధాన్యత ఆధారంగా అమృత్ పథకం పరిధిలోకి వీటిని కేంద్ర ప్రభుత్వం చేర్చినట్టు సమాచారం. ఏది ఏమైనా ఆధ్యాత్మిక నగరం తిరుమలను దర్శించుకోదలచిన భక్తులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.



Click it and Unblock the Notifications













