తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటికే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో పలు మార్పులు చేపట్టిన టీటీడీ సర్వదర్శన టోకెన్ల సంఖ్యను భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు ప్రాధాన్యత కల్పించడం వల్ల సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించి, వారికి ప్రాధాన్యత కల్పించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఏ ఒక్క భక్తుడు స్వామివారిని దర్శించుకోకుండా వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండబోదని చెబుతోంది.
4 లక్షల నుంచి 6 లక్షలకు పెంపు..
ఇప్పటికే శ్రీవారిని దర్శించుకొనేందుకు వస్తోన్న సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల సంఖ్యను గణనీయంగా తగ్గించనుంది. ఇదే సమయంలో సర్వదర్శన టోకెన్లను భారీగా పెంచేందుకు ప్రణాళికలు చేసింది. గతంలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు అపరిమితం ఉండేవి. దానిని అదిగమిస్తూ.. ఇప్పుడు రోజుకు వెయ్యి టికెట్లను జారీ చేస్తున్నారు. దీంతో సాధారణ భక్తులకు దర్శన సమయం ఎక్కువ అందుబాటులోకి రావడంతో అందుకు తగిన రీతిలో సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల సంఖ్యను పెంచుకుంటూ వచ్చారు. నెల వరకు 4 లక్షల సర్వదర్శన టోకెన్ల నుంచి ఇప్పుడు ఆ సంఖ్యను 6 లక్షలకు పెంచడంతో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

పర్యవేక్షణకు ప్రాధాన్యత..
అంతేకాదు, సర్వదర్శన టోకెన్ల సంఖ్య పెంచడంతోపాటు భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపరచడంపై టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు గతంలో అన్న ప్రసాదాలు తగిన రీతిలో అందేవికాదనే విమర్శలు ఉన్నాయి. దీంతో వాటిని అదిగమించేందుకు చర్యులు చేపట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు అందచేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
అలాగే, నిరంతరం పర్యవేక్షించేలా ఈ అధికారులను నియమించినట్లు టీటీడీ చెబుతోంది. భక్తుల సమాచారం కోసం తిరుమలలో ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్తో సహా మొత్తం ఐదు భాషల్లో ప్రకటనలు చేస్తున్నారు. ఇకనుండి తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్లతో పాటు శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా కూడా భక్తుల సమాచార నిమిత్తం ప్రకటనలు ఇవ్వనున్నారు. దీంతోపాటు భక్తులు క్యూ లైన్ల వెలుపల వేచి ఉండకుండా, తిరుపతిలోని స్థానిక ఆలయాల సందర్శన లేదా తిరుమలలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించుకునే అవకాశాన్ని కల్పించారు.
తిరుమలకు వచ్చే భక్తులు ఎస్ఈడీ టికెట్స్, ఎస్ఎస్డీ టోకెన్లపై కేటాయించిన సమయాన్ని పాటించకుండా ముందే వచ్చి, అనవసరంగా వేచి ఉంటున్నారని, అలాకాకుండా టోకెన్లపై వారికి కేటాయించిన సమయానికే రావాలని అధికారులు కోరుతున్నారు. ఏది ఏమైనా సామాన్య భక్తుల కోసం టీటీడీ తీసుకుంటున్న ఈ తరహా నిర్ణయాల పల్ల భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం తిరుమల శ్రీవారి దర్శనానికి మీ జర్నీ మొదలుపెట్టండి!



Click it and Unblock the Notifications













