దేశంలో పర్యాటక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సీప్లేన్ కార్యకలాపాలకు మరింత సహకారం అందించే దిశగా అడుగులు వేస్తోంది. సీప్లేన్ నీటిపై ల్యాండ్ అవ్వడంతోపాటు టేకాఫ్ జరిపే కార్యకలాపాలకు సంబంధించి నియమావళిని మరింత సరళతరం చేసినన్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. అంతేకాదు, షెడ్యూలేతర సంస్థలు కూడా సీప్లేన్ సేవలు అందించడానికి అనుమతిస్తూ, 'సరళీకృత సర్టిఫైడ్ ప్రక్రియ'ను పరిచయం చేసింది. ప్రాంతీయ విమాన అనుసంధాన పథకమైన ఉడాన్ కింద ఈ సీప్లేన్ కార్యకలాపాలను మరింత ప్రోత్సహించడం ద్వారా పర్యాటకాభివృద్ధితో మంచి ఫలితాలను రాబట్టొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.
వయబులిటీ గ్యాప్ నిధులతో..
పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చర్యల్లో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సడలించిన నిబంధనల ప్రకారం సీప్లేన్ కార్యకలాపాలకు వాటర్డ్రోమ్ లైసెన్సు అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే, తాజా వాణిజ్య పైలెట్ లైసెన్సు (సీపీఎల్) ఉన్న వారు నేరుగా సీప్లేన్ రేటింగ్స్కు అనుమతులుపొంది, సీప్లేన్లను విజయవంతంగా నిర్వహించుకోవచ్చని అన్నారు. నిజానికి మనదేశంలో అండమాన్ - నికోబార్, గుజరాత్లలో సీప్లేన్ కార్యకలాపాలు గతంలో నిర్వహించారు. అయితే ఆర్థికపరమైన పలు సమస్యల కారణంగా అవి మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలోనే వయబులిటీ గ్యాప్ నిధులను సీప్లేన్ కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అందించబోతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అంతేకాదు, మనదేశంలో విమానాలు, హెలికాప్టర్లు, సీప్లేన్ల డిజైన్, తయారీకి ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుందని స్పష్టం చేశారు.

విజయవాడలో సీప్లేన్ డెమో..
ఈ కార్యకలాపాలపై ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా విజయవాడ నుంచే ఈ ఏడాది అక్టోబరులో మొదలయ్యే సీప్లేన్ విమానాల డెమో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. అంతేకాదు, ఏపీతోపాటు అస్సాం, గోవా, అండమాన్ - నికోబార్, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్ లాంటి 18 ప్రాంతాల్లో వాటర్ ఏరోడ్రోమ్లు ఏర్పాటుకు ప్రణాళికలు వేసినట్లు కేంద్ర మంత్రి అన్నారు. వాటర్ ఏరోడ్రోమ్లలో సీప్లేన్ల టేకాఫ్, ల్యాండింగ్ కూడా సాధారణ విమానాశ్రయాల్లో ఎలాగైతే విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ఉంటుందో అలాగే ఉంటుంది. అయితే, ఇందుకోసం సాధారణ విమానాశ్రయాల మాదిరిగా రన్ వే అవసరం ఉండదు.

మూడేళ్లలో వంద మార్గాలే లక్ష్యం..
ప్రయాణికులకు, సంరద్శకులకు విమాన సేవలు మరింత చేరువ చేసేందుకు ఈ సీప్లేన్ కార్యకలాపాలు ఎంతో దోహద పడతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని రానున్న మూడు సంవత్సరాలలో సీప్లేన్ వంద మార్గాల్లో నడిచేలా ప్రణాళికలు వేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ స్థాయిలో సీప్లేన్లు అందుబాటులోకి వస్తే మాత్రం పర్యాటకం అభివృద్ధి పరుగులు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే, చిన్న చిన్న నగరాల మధ్య విమాన సేవల కోసం అమలు చేస్తున్న ఉడాన్ పథకం గడువు రెండేళ్లలో ముగియనుండడంతో దీనిని మరో పదేళ్ల వరకూ పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.



Click it and Unblock the Notifications













