ప్రయాణికులకు శుభవార్త. ఇకనుంచి శంషాబాద్ టు వైజాగ్కు కేవలం నాలుగు గంటల్లోనే చేరుకోవచ్చు. సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్ వచ్చేసింది. ఈ ట్రైన్ గంటలకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లుతోంది. సెమీ హైస్పీడ్ ట్రైన్ విజయవాడ మీదుగా వైజాగ్ చేరుకుంటుంది. ఈ మార్గంలో మొత్తం పన్నెండు స్టేషన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సర్వే చివరి దశకు చేరగా నవంబర్లో రైల్వేబోర్డుకు సమర్పించనున్నారు. దీంతో పాటు వైజాగ్ నుంచి సూర్యపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్ మీదుగా కర్నూలుకు మరో కారిడార్ను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.
220 కిలో మీటర్ల వేగంతో...
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్ కారిడార్ ఇదే కావడం విశేషం. ఈ రూట్లో శంషాబాద్, రాజమండ్రి ఎయిర్ పోర్టులను అనుసంధానించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్ రైళ్లలో స్వస్థలాలకు త్వరతగతిన చేరుకునేలా రైల్వేశాఖ అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. గంటకు 220 కిలో మీటర్ల వేగంతో ఈ ట్రైన్స్ ప్రయాణించేలా సెమీ హైస్పీడ్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు గనుక పూర్తైతే.. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విశాఖపట్నానికి కేవలం నాలుగు గంటల్లోపే చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి సుమారు పన్నెండు గంటల సమయం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే, వందేభారత్ ఎక్స్ప్రెస్లో అయితే, 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటున్నారు.

రెండు మార్గాల్లో ..
సికింద్రాబాద్ నుంచి వైజాగ్కు ప్రస్తుతం రెండు మార్గాల్లో ట్రైన్స్ నడుస్తున్నాయి. మొదటిది వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గం కాగా, రెండోది నల్గొండ, గుంటూరు, విజయవాడ మార్గాల్లో ప్రయాణిస్తోంది. ఈ రూట్లలో ట్రైన్ల గరిష్ఠ వేగం గంటకు 110-130 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ రెండింటితో పోలిస్తే ఇప్పడు కొత్తగా రానున్న శంషాబాద్ టు విశాఖపట్నం మార్గం ప్రయాణికులకు మరింత దగ్గరవుతుంది. ఈ మార్గంలో ప్రయాణ సమయం సగానికంటే తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు.

వైజాగ్ టు కర్నూలు..
వైజాగ్ టు శంషాబాద్ సెమీ హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదిత మార్గంతో పాటు మరో కీలకాంశం కూడా ఉంది. వైజాగ్ నుంచి కర్నూలు వరకు అనుసంధానం మార్గాన్ని సూర్యాపేట మీదుగా ప్రతిపాదించారు. ఈ రూట్లో మొత్తం ఎనిమిది రైల్వే స్టేషన్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. శంషాబాద్ టు వైజాగ్ సెమీ హైస్పీడ్ కారిడార్ని గనుకు ఒకసారి పరిశీలిస్తే, ఈ రూట్ హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి మార్గానికి కాస్త అటూఇటూగానే ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు రైలు కూత వినిపించని అనేక పట్టణాలు, జిల్లాలు ఈ కొత్త కారిడార్తో రైల్వే నెట్వర్క్లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నార్కట్పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ వంటి పట్టణాలకు ఇప్పటికీ ట్రైన్ మార్గం లేదు. దీంతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి, వనపర్తి, నాగర్కర్నూల్ పట్టణాలకూ కూడా రైలు మార్గం లేదు. ఈ ప్రాంతాల మీదుగా ఇప్పుడు ఏకంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సెమీహైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications












