ఉత్సవాలకు ముస్తాబయిన గుణదల మేరీ మాత చర్చి!
మనదేశంలోనే అతి పెద్ద క్యాథలిక్ చర్చిల్లో రెండో చర్చిగా పేరుగాంచింది విజయవాడ గుణదల మేరీ మాత చర్చి. ఇక ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా లక్షల మంది సందర్శకులు హాజరవుతారు. ఫ్రాన్సులోని లూర్థు నగరం సహజమైన గుహలో ఉన్న మేరీమాత చర్చ్ను పోలినట్టుగా ఉన్నట్లే గుణదలలోనూ సహజమైన గుహలో మేరీ మాత విగ్రహం ఉన్నందున ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది. ఏటా జరిగే ఈ మేరీ మాత ఉత్సవాల సమయం రానేవచ్చింది. ఆ విశేషాలు తెలుసుకుందాం.
తమిళనాడు వేళాంగిణి మాత చర్చ్ తర్వాత మేరీ మాత చర్చ్ అనగానే గుణదలే గుర్తుకు వస్తుంది. క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రోజున పెద్ద స్థాయిలో సందర్శకులు ఇక్కడికి తరలి వస్తారు. సాధారణ రోజుల్లో శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ ఉంటుంది. ఏటా ఫిబ్రవరిలోనే ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం వెనుక పెద్ద కథే ఉంది. ఫ్రాన్సులోని లూర్థు నగరం దాపున ఉన్న కొండ అడవిలో బెర్నాడెట్ సోబిరస్ అనే పధ్నాలుగేళ్ల బాలిక వంట కలప కోసం వెళ్లగా అక్కడ మేరీ మాతను పోలిన స్త్రీ కనిపించి మాట్లాడిందని ఆ అమ్మాయి వచ్చి తల్లికి చెప్పింది.

ఆ తేదీ ఫిబ్రవరి 11. ఆ తేదీన మరియమాత భక్తులకు కనిపించినందువల్ల అక్కడ ఉత్సవాలు జరుగుతాయి కనుక గుణదలలో కూడా ఫిబ్రవరి 11న ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి జనవరి 31న నవదిన ప్రార్థనలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పూర్వం ఫిబ్రవరి 11న ఒక్కరోజే ఉత్సవాలు జరిగేవి. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగాలని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది.
నిర్మానం వెనుక చారిత్రక నేపథ్యం
ఈ చర్చి నిర్మాణం వెనుక ఎంతో చారిత్ర నేపథ్యం ఉంది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1924లో గుణదలలో సెయింట్ జోసఫ్స్ ఇనిస్టిట్యూట్ పేరున ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. దానికి రెక్టర్గా ఇటలీకి చెందిన ఫాదర్ పి. అర్లాటి ఉండేవారు. ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందడంతో 1971లో పూర్తిస్థాయి చర్చి నిర్మితం అయ్యింది.

గుడి అంకురార్పణ జరిగిన నాటి నుంచి అనాథబాలలు, క్రైస్తవ మత కన్యలు, కథోలికులు (క్యాథలిక్స్) ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మరియమ్మ (మేరీ మాత) ఉత్సవాలు నిర్వహించు కునేవారు. 1933లో ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలోనే ఈ కొండ శిఖరాగ్రాన ఓ శిలువ ప్రతిష్ఠితమైంది. 1947లో విజయవాడ నగరంలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన కథోలికులు, ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలో కొండపై ఆరోగ్యమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, గుహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు.
క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే..
గుణదల కొండపై సహజసిద్ధంగా ఏర్పడిన గుహ నుంచి కొండపైన శిలువ వరకు చెదురుమదురు కాలిబాటలు ఉండేవి. అయితే 1951లో గుహకు ఇరువైపులా ఆర్చిలను నిర్చించి, శిలువ వరకు మెట్లమార్గం ఏర్పాటు చేశారు. ఈ కాలిబాటలో క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 14 స్థలాల విశిష్టత వివరించేలా, జపమాల పవిత్రతను తెలుసుకునేలా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు.
మేరీ మాత ఉత్సవాలు జరిగే ఈ మూడు రోజులూ క్రైస్తవులంతా భక్తిప్రపత్తులతో హాజరై మొక్కులను తీర్చుకుంటారు. నవంబర్లో జరిగే ప్రత్యేక ఆరాధనలకు, నవంబర్ నుంచి డిసెంబర్ వరకు సాగే ప్రత్యేక ప్రార్థనలకు కూడా రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు రావడం ఆనవాయితీగా వస్తోంది.



Click it and Unblock the Notifications













