దేశంలో పలు చోట్ల వర్షాలు కురుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అక్కడక్కడా తేలికపాటి చినుకులు కురిసాయని సంబరపడే లోపే విపరీతమైన వేడి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నాడు. గత నాలుగైదు రోజులుగా ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీరం దాటడంతో వేసవి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగాయి. గడిచిన నాలుగురోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 43డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉదయం ఆరునుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. విపరీతమైన ఉక్కపోతతో జనం విలవిలలాడిపోతున్నారు.
ఇదిలా ఉండగా, రాబోయే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, దక్షిణ తమిళనాడు, పరిసరప్రాంతాల్లో ఆవర్తనం విస్తరించి ఉన్నట్టు ఐఎండి వెల్లడించింది. దీంతో ఏపీలోని పలుప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న ఏపీ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు..
నిన్న (బుధవారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోయారు. పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయి ప్రజలని ఉక్కిరిబిక్కిరి చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడికంటే విపరీతమైన ఉక్కపోతతోనే జనం అల్లాడిపోతున్నారు. నేడు (గురువారం) ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉండనుందని అధికారులు అంటున్నారు.
రేపు (శుక్రవారం) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. రేపు అంటే మే 31 లేదా జూన్ ఒకటో తేదీకల్లా రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గురువారం లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.

జూన్ 1న తేలికపాటి వర్షాలు..
జూన్ 1వ తేదీన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల మరియు వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక, ఆదివారం కూడా ఇదే పరిస్తితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలతోపాటు కర్నూలు, నంద్యాల, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్సాలు కురిసే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications













