ఏపీలో మే నెల మొదటి నుంచే తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాతావరణ కాస్త చల్లబడింది. రాబోయే మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్ధితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. పలు జిల్లాల్లో పగటి పూట ఎండ, సాయంత్రం పూట వర్షాలు కురుస్తున్నాయి.
పిడుగులతో కూడిన వర్షాలు..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక నేడు (మంగళవారం) ఉత్తరకోస్తాలోని పలు ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉండదని, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ,

డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. రాయల సీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం పడే అవకాశాలున్నట్లు తెలిపింది.
మే 19 వరకు ద్రోణి ప్రభావం..
ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణశాఖ కూడా చల్లని కబురు చెప్పింది. ఈ సంవత్సరం కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మే19నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. ఈ కారణంగా మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

పలు ప్రాంతాల్లో వర్షాపాతం ...
ఇక, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమయలో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ శాఖ సూచించింది. నిన్న (సోమవారం) పలు ప్రాంతాల్లో వర్షాపాతం నమోదయ్యిందని వెల్లడించారు.
సాయంత్రం 6 గంటల నాటికి అల్లూరి జిల్లా పాడేరులో 57.5మిల్లీ మీటర్లు, ప్రకాశం జిల్లా కనిగిరిలో 52.5 మిల్లీ మీటర్లు శ్రీసత్యసాయి జిల్లా సోమండేపల్లిలో 46.5మిల్లీ మీటర్లు, బాపట్ల జిల్లా అద్దంకిలో 38.5మిల్లీ మీటర్లు, ప్రకాశం చంద్రశేఖరపురంలో 38మిల్లీ మీటర్లు, అల్లూరి జిల్లా కొయ్యురులో 29.7మిల్లీ మీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. దాదాపు 27 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల క్రితం వరకు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాతావరణంలోని పలు మార్పులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు కాస్త చల్లబడ్డాయి.



Click it and Unblock the Notifications













