నిన్న మొన్నటి వరకు తీవ్రమైన ఎండలు ఉక్కపోతతో ఏపీ ప్రజలు అల్లాడిపోయారు. తాజాగా రుతుపవనాల రాకతో ఏపీలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో రుతుపవనాల రాకపై ఐఎండీ అంచనాలు ఫలించాయి. వాతవరణ శాఖ సూచనల ప్రకారం నైరుతి రుతుపవనాలు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి ఇప్పటికే ప్రవేశించాయి. మరో రెండుమూడురోజుల్లో ఏపీ అంతటా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఏపీలో ఆదివారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
నేటి నుంచి రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఇక నిన్నటి (ఆదివారం) రాత్రి రాష్ట్రంలోని 43 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో 64.5-115.5మిల్లిమీటర్ల వర్షపాత కురిసింది. అత్యధికంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 125.7మిల్లిమీటర్లు, నంద్యాల జిల్లా పాణ్యంలో 113.2మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 106.2మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. 205 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో 15.6-64.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పలు జాగ్రత్తలు అవసరం..
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. సోమవారం ఓ వైపు మోస్తరు వర్షాలు, మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులు సూచించారు. రుతుపవనాలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుంది. జూన్ నెలలో సాధరణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందుకు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు..
నేడు (సోమవారం) రుతుపవనాల ప్రభావం రాష్ట్రంలోని ఈ ప్రాంతాల్లో ఉంటుంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వీటితో పాటు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మంగళవారం పలు ప్రాంతాల్లో వర్షం ప్రభావం..
మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.



Click it and Unblock the Notifications













