ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిచెందిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. ఇక్కడ దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అయితే, ఇంద్రకీలాద్రీపై దసరా ఉత్సవాలు ముగిసాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రెండురోజులు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం అమ్మవారి ఆలయ హుండీకి భారీ ఆదాయం సమకూరింది. ఒక్కరోజే అమ్మవారి హుండీకి భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా రూ.84లక్షలకుపైగా ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. దర్శన టికెట్లు, లడ్డూల విక్రయం, సేవల టికెట్లు కలిపి ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఒక్కరోజే ఏకంగా..
ఒక్కరోజే ఏకంగా రూ.84,02,775 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజు 4,149 మంది భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా రూ.20,74,500 ఆదాయం వచ్చినట్లు వివరించారు. అలాగే 1,847 మంది భక్తులు రూ. 300 టికెట్లు కొనుగోలు చేయగా రూ.5,54, 100 ఆదాయం సమకూరింది. రూ.100 టికెట్ కొనుగోలు చేసిన భక్తులు 4,686 మంది దర్శించుకున్నారు. రూ. 100 టిక్కెట్ కొనుగోలుతో రూ. 46, 86,000 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వివరించారు. అలాగే, మొత్తం 26,584 లడ్డూలను విక్రయించారు. ఇవి మొత్తం రూ.3,98,760 ఆదాయం సమకూరింది. రూ.100 చొప్పున మొత్తం ఆరు లడ్డూలున్న ప్యాకింగ్ లను విక్రయించగా రూ.44,06,600 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. అయితే ఆలయంలో మొత్తం 2,64,396 లడ్డూలను విక్రయించినట్లు అధికారులు వివరించారు.

మొక్కుల రూపంలో..
వీటితో పాటు అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు పరోక్ష ప్రత్యేక కుంకుమార్చనుకు రూ. 3000 టికెట్లను 18 మంది కొనుగోలు చేయగా, రూ.54వేల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇక, పరోక్ష ప్రత్యేక చండీ హోమానికి నాలుగువేల రూపాయల టిక్కెట్లను ఏడుగురు కోనుగోలు చేశారు. దీనికి మొత్తం రూ. 28వేల ఆదాయం సమకూరింది. వీటితోపాటు శ్రీచక్ర నవావరణార్చన కోసం రూ.3,000 టికెట్ను ఇద్దరు భక్తులు కొనుగోలు చేశారు. వీటికి రూ.6వేలు ఆదాయం సమకూరింది. అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పబ్లికేషన్లు, ఫొటోలు, క్యాలెండర్ల ద్వారా రూ.10,230 ఆదాయం అందింది. మిగిలిన ఆదాయం రూ.20, 545, రూ.40 టికెట్ ద్వారా వచ్చింది. ఆలయానికి వచ్చిన 9,536 మంది భక్తులు అమ్మవారికి మొక్కుల రూపంలో తలనీలాలు సమర్పించగా రూ.3,81,440 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రముఖుల దర్శనం..
ఇదిలా ఉండగా, అమ్మవారిని పలువురు సినీ సెలబ్రిటీలు దర్శించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. అలాగే నటుడు పృధ్వీ కూడా అమ్మవారి సేవలో పాలు పంచుకున్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో నిన్న (విజయదశమి రోజున) శ్రీరాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం నుంచి ఆలయానికి విచ్చేసే భవానీ భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ లక్ష మందికిపైగా భక్తులు దర్శనానికి వచ్చారు. నిన్న సాయంత్రం వేళ కృష్ణా నదిలో తెప్పోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది.



Click it and Unblock the Notifications













