కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర పర్యాటకులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్క రైల్వే లైనుతో రెండు జిల్లాల్లోని ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించేందుకు అవకాశం కల్పించింది. అదే.. విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాసకు రైల్వే లైన్. ఈ లైన్ నిర్మాణ సర్వేకు సంబంధించి డీపీఆర్కు ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో దశాబ్దాల కల నెరవేరిందంటూ విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పర్యాకట అభివృద్ధికి అనువుగా..
ఈ ప్రతిపాదన ప్రకారం మొత్తం 142 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణం పట్టాలెక్కనుంది. ఇది విజయనగరం నుంచి రాజాం, పాలకొండ, కొత్తూరు, పర్లాకిమిడి, మెళియాపుట్టి మీదుగా పలాస ప్రధాన రైల్వే లైన్కు కలపబడుతుంది. ఇందుకు కోసం అవసరమైన సర్వేకు సంబంధించి డీపీఆర్ ఆమోదం పొందడంతో ఈ రైల్వేలైన్తో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతవాసులకూ ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా పర్యాకట అభివృద్ధికి ఇది ఎంతో సహాయపడుతుందని అంటున్నారు.

అలాగే, ప్రజా రవాణా, పారిశ్రామికాభివృద్ధి, గిరిజన ఉత్పత్తుల రవాణా ఇలా అన్ని రంగాల్లోనూ ఈ 142 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ఉపయోగకరంగా ఉండనుంది. నిజానికి, రాజాంలో దాదాపు 20 పరిశ్రమల వరకూ ఉండేవి. జూట్, సిమెంట్, ప్లాస్టిక్, సింథటిక్, విద్యుత్ వైర్లు, పైపులు వంటి పరిశ్రమలను రాజాంను కేంద్రంగా చెప్పుకునేవారు. ముఖ్యంగా జూట్ పరిశ్రమలు ఏడు వరకూ వినియోగంలో ఉండేవి. వీటి ద్వారా వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని పొందేవారు. ఇక్కడ రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడంతో పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో స్థానికులు ఉపాధి కోల్పోయారు. ఈ కొత్త రైల్వే లైను ప్రతిపాదనతో అలాంటి వారికి ఉపాధి దొరకనుంది. పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతవాసులు భావిస్తున్నారు.
పర్యాటక ప్రదేశాలకు నెలవు..
రాజాం, పాలకొండ ప్రాంతాల్లో ప్రకృతి అందాలకు కొదవ లేదు. పచ్చదనం కమ్మేసిన కొండలు, జాలువారే జలపాతాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. అయితే, ఈ ప్రదేశాల్లో పర్యాటక అందాలను చూడాలంటే రవాణా వ్యవస్థతో చాలా ఇబ్బందులు ఉండేవి. అంతేకాదు, రాజాం, పాలకొండ ప్రాంతీయులకు రైల్వే లైన్ అంటేనే అది ఊహలకందనిదిగా ఉండేది. అలాగే, ఈ ప్రాంత ప్రజలు చీపురుపల్లి లేదా శ్రీకాకుళం రోడ్డు వెళ్లి రైలు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన వారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించేవారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు రావాలన్నా..
ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి. ఈ కారణంగా అన్ని అవకాశాలూ ఉన్నప్పటికీ ఇక్కడి అటవీ అందాలను సందర్శకులు ఆస్వాదించలేకపోయేవారు. సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పేవికాదు. అలాగే, సీతంపేట అటవీ ప్రాంతం పర్యాటక ప్రదేశాలకు నెలవుగా ఉంటుంది. ఇక్కడి సుందర దృశ్యాలను మాటల్లో వర్ణించడం కష్టం. కానీ ఇక్కడకు చేరుకునేందుకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో కేవలం ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కొత్త రైల్వే లైన్ నిర్మాణం తెరమీదకు రావడంతో ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు పర్యాటక అభివృద్ధి దిశగా వెలతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications













