బెజవాడ రైల్వేస్టేషన్లో..శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మెషిన్
భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికులకు ఎప్పటికప్పుడు ఆధునాతన సౌకర్యాలు కల్పంచేందుకు కృషి చేస్తూనే ఉంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రతి రైల్వేస్టేషన్లోనూ సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తుంది. ఇప్పుడు అలాంటి ఆధునాతన సౌకర్యాన్నే దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వేస్టేషన్లో కల్పిచింది. కాయిన్ ఆపరేటెడ్ శానిటరీ నేప్కిన్స్ మెషిన్ పేరుతో మహిళల ఆత్మగౌరవాన్ని తమ బాధ్యతగా తీసుకుని, వారిని గౌరవిస్తూ తమ వంతు పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగానే కాయిన్ ఆపరేటెడ్ శానిటరీ నేప్కిన్స్ మెషిన్ను విజయవాడ రైల్వేస్టేషన్లో పరిచయం చేసింది. ఆ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

విజయవాడ జంక్షన్ కీలకం..
విజయవాడ రైల్వే స్టేషన్ లో కాయిన్ అపరేటడ్ శానిటరీ నేప్కిన్స్ మెషిన్ అందుబాటులోకి వచ్చింది. ఒకటో నెంబర్ ప్లాట్ ఫార్మ్ లోని స్వర్ణ జయంతి వెయిటింగ్ హాల్లో ఈ మెషిన్ ను ప్రారంభించారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఈ మెషిన్ ను ప్రారంభించింది. తమ ఆర్గనైజేషన్ ద్వారా కొనుగోలు చేసిన ఈ మెషిన్ ను సంస్థ చైర్పర్సన్ జయామోహన్ ప్రారంభించారు. దక్షిణాదిని ఉత్తరాది రాష్ట్రాలకు కలిపే రైల్వే స్టేషన్లలో విజయవాడ జంక్షన్ కీలకమైంది.ఈ స్టేషన్ గుండా వందలాది దూర ప్రాంత రైళ్లు ప్రయాణిస్తుంటాయి. రోజుల తరబడి ప్రయాణాలు చేసే మహిళలకు, స్టేషన్ సిబ్బందికి ఈ నేప్కిన్స్ మెషిన్ ఉపయోగపడుతుంది. ఐదు, రెండు రూపాయల కాయిన్ల ను ఈ వెండింగ్ మెషిన్ లో వేయడం ద్వారా శానిటరీ నేప్కిన్ ఆటోమేటిక్ గా బయటికి వస్తుంది. నెలసరి సమయంలో మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేలా స్టేషన్ సిబ్బంది ద్వారా దీనిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అన్ని ప్లాట్ ఫారంలలో మెషిన్ కు సంబందించిన సమాచారం అందుబాటులో ఉంచుతున్నారు రైల్వే సిబ్బంది.
'ఇది ఏ కార్యాలయంలోనైనా అత్యంత అవసరమైన సదుపాయం. నెలసరిలో ఉన్న మహిళలు చురుగ్గా ఉండటానికి, రోజువారీ కార్యకలాపాలలో ఉత్సాహంగా పాల్గొనడానికి కాయిన్ అపరేటడ్ శానిటరీ నేప్కిన్స్ మెషిన్ సహకరిస్తుంది' అని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.

మొదటగా భోపాల్లో..
ఈ మెషిన్ ఇండియాలో మొదటగా, భోపాల్ ప్రధాన రైల్వే స్టేషన్-భోపాల్ జంక్షన్-లో ఆటోమేటెడ్ శానిటరీ ప్యాడ్ డిస్పెన్సర్ను ఏర్పాటు చేశారు. దీనికి హ్యాపీ నారీ అని పేరును కూడా పెట్టారు. ఈ యంత్రాన్ని 1 జనవరి, 2018న ఏర్పాటు చేశారు. స్టేషన్లో మహిళలకు పరిశుభ్రత ఉత్పత్తులను అందించాల్సిన అవసరాన్ని గుర్తించి, భోపాల్లోని రైల్వే మహిళా సంక్షేమ సంఘం స్థానిక ఎన్జిఓ అరుషితో చేతులు కలిపి ఈ మెషిన్ను ప్రారంభించింది. మహిళలకు అనువుగా దగ్గరలో ఉండేలా సులభంగా తీసుకునేందుకు మహిళలు వేచి ఉండే గది సమీపంలోనే ప్లాట్ ఫారమ్ వన్లో ఈ మెషిన్ను ఏర్పాటు చేశారు. రెండు శానిటరీ న్యాప్కిన్లను తీసుకోవాలంటే ఐదురూపాయల కాయిన్ వేసి తీసుకునేలా ఏర్పాటు చేశారు.
ఇలా అన్ని చోట్లా..
కేవలం ఈ మెషిన్ భోపాల్లోని కాకుండా, హైదరబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్లో నాగ్పూర్, ఢిల్లీ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్, భువనేశ్వర్ రైల్వేస్టేషన్, మహారాష్ట్ర రైల్వేస్టేషన్, ముంబయి, కేరళ రైల్వేస్టేషన్ ఇలా ఇండియాలోని చాలా రైల్వేస్టేషన్లలో మహిళా ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు ఈ వెసులుబాటు కల్పించారు. దీని ఖర్చంతా రైల్వేస్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషనే భరిస్తుంది. మహిళల వెయిటింగ్ రూమ్లో ఉపయోగించిన శానిటరీ న్యాప్కిన్లను సురక్షితంగా , పరిశుభ్రంగా పారవేయడం కోసం ఇన్సినరేటర్ను కూడా ఏర్పాటు చేయడానికి కొన్ని స్టేషన్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.



Click it and Unblock the Notifications













