ఏపీలోని రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ ఓ గుడ్న్యూస్ అందించింది. దీపావళితో పాటూ ఛత్ వంటి పండుగల సందర్భంగా పలు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమయ్యింది. పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ టు దానాపూర్ టు విశాఖ మధ్య పలు స్పెషల్ ట్రైన్స్, విశాఖ-భువనేశ్వర్-విశాఖ మధ్య అన్రిజర్వుడ్ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు తూర్పు కోస్తా రైల్వే ఓ ప్రకటనను కూడా జారీ చేసింది. ఆ ట్రైన్ల వివరాలను ఓ సారి చూసేద్దాం.
విశాఖ టు దానాపూర్ ఎక్స్ప్రెస్ ..
వచ్చే (నవంబరు) నెల 4వ తేదిన ఉదయం 9.10 గంటలకు 08520 అనే నెంబర్గల విశాఖ టు దానాపూర్ ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్ విశాఖలో బయలుదేరుతోంది. ఆ మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో నవంబరు 5వ తేదిన మధ్యాహ్నం 12.30 గంటలకు దానాపూర్ టు విశాఖ (08519) స్పెషల్ ట్రైన్ దానాపూర్లో బయలుదేరుతోంది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 2.42 గంటలకు విశాఖ స్టేషన్కు చేరుకుంటుంది. ఇక, ఈ ట్రైన్లో 3 థర్డ్ ఏసీ, 12 స్లీపర్, 5 జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్, 2 సెకండ్ క్లాస్ కమ్ దివ్యాంగజన్ బోగీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

విశాఖపట్నం టు భువనేశ్వర్..
08536 అనే నెంబర్గల విశాఖపట్నం టు భువనేశ్వర్ అన్రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్ నవంబరు 15వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు విశాఖలో బయలుదేరుతోంది. అదే రోజు రాత్రి 7.45గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 08535 అనే నెంబర్గల భువనేశ్వర్ టు విశాఖపట్నం అన్రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్ నవంబరు 15వ తేదీ వరకు ప్రతి రోజు రాత్రి 10.30 గంటలకు భువనేశ్వర్లో బయలుదేరుతోంది. మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు విశాఖపట్నం స్టేషన్కు వస్తుంది. ఈ ట్రైన్లో 10 జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్, 1 దివ్యాంగజన్, 1 మోటార్ కార్ బోగీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
26 స్పెషల్ ట్రైన్స్..
దక్షిణ మధ్య రైల్వే మొత్తం 26 స్పెషల్ ట్రైన్స్ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కాచిగూడ టు నిజాముద్దీన్, నాందేడ్ -పానిపట్, నాందేడ్-పాట్నా, ఛాప్రా-యశ్వంత్పూర్, చెన్నైటు అంబాలా కంటోన్మెంట్ మార్గాల్లో దీపావళి పండుగ స్పెషల్ ట్రైన్స్ను తీసుకొచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లతో పాటుగా పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో 14 అదనపు కౌంటర్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర స్టేషన్లలో అదనపు సిబ్బందిని కూడా అధికారులు నియమించారు.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా దీపావళి, ఛత్ పండగుల సమయంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ రైల్వే మరో ఏడువేల ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపింది. వీటితోపాటు రైల్వేస్టేషన్లలో పలు కొత్త విధానాలను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. రైళ్లలోని జనరల్ బోగీల్లో ఎక్కే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాంలపై క్యూలైన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.



Click it and Unblock the Notifications













