శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వెళ్లాలనుకు భక్తులకు శుభవార్త. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి వేళ కూడా భక్తుల వాహనాలను అనుమతిస్తున్నట్టు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు భక్తులకు తెలిపారు. నేటి నుంచి మార్చి 11వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వీటిని వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం మార్చి 1 నుంచి 11 వరకు రాత్రి వేళల్లో కూడా వాహనాలను అనుమతిస్తున్నట్టు ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలున్నాయి. అందులో శ్రీశైల దేవస్థానం ఒకటి. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ శ్రీశైల పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇది పెద్దదోర్నాల-శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంటుంది. దీంతో, ఈ ఆలయానికి వెళ్లే భక్తులకు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఈ రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేసారు.
పెద్దదోర్నాల అటవీ శాఖ చెక్పోస్ట్ వద్దే వాహనాలను ఆపివేయడం జరుగుతుంది. అయితే, శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం వచ్చే భక్తుల కోసం తాజాగా ఈ నిబంధనకు తాత్కాలిక సడలింపు ఇచ్చారు అధికారులు. వాహనదారులు వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా, నిదానంగా వాహనాలను నడపాలని దోర్నాల క్షేత్రాధికారి భక్తులకు సూచించారు. ఈ రహదారిపై నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. అటవీశాఖ చెక్పోస్టుల వద్ద భక్తుల వాహనాల నుంచి ఎటువంటి డబ్బులు వసూలు చేయకూడదని కూడా అధికారులు ఆదేశించారు.

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబయిన ఆలయం...
శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైల పుణ్యక్షేత్రం ఎంతో అందంగా ముస్తాబైంది. ఇక, ఆలయంలో గోపురాలను విద్యుత్ దీపకాంతులతో అలంకరించడం జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసేందుకు దేవస్థాన యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలకు తుది మెరుగులు రూపుదిద్దుకుంటున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు మంచినీరు, భోజనం వసతి తదితర భారీ ఏర్పాట్ల పనులపై అధికారులు నిమగ్నమయ్యారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీశైల దేవస్థానం ఈవో వివరించారు. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని మిగిలిన పనులు మరో రెండు రోజులలో పూర్తి చేస్తామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.
భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 30 లక్షల లడ్డూలను విక్రయించేందుకు ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పుణ్యక్షేత్రంలోని గణేశ్ సదన్ ఎదురుగా రెండు తాత్కాలిక కౌంటర్లు, అన్నప్రసాద వితరణ కేంద్రం వద్ద నాలుగు కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. ఉచిత దర్శనం భక్తులకు రథశాల దగ్గర నుంచి క్యూలైన్ ద్వారా ఆలయ ప్రవేశం కల్పిస్తారు. శీఘ్ర దర్శనం కోసం 200రూపాయలు. అతిశీఘ్ర దర్శనం కోసం రూ.500 ఉంటుంది.
దర్శనం కోసం భక్తులకు క్యాంప్కోర్టు వద్ద ఉన్న క్యూలైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశం కల్పించనున్నారు. దీంతోపాటు పిల్లల తల్లులకు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లను కూడా ఏర్పాటు చేశారు. విరాళ కేంద్రం వద్ద ఉన్న మైక్ అనౌన్స్ గది దగ్గర నుంచి దివ్యాంగులను అనుమతిస్తారు.ఆలయ క్యూ కంపార్ట్మెంట్లలో భక్తులకు నిరంతరం మంచినీటితో పాటు అల్పాహార ప్రసాదాలు అందజేస్తారు. శివదీక్షా భక్తులను చంద్రావతి కల్యాణ మండపం వద్ద నుంచి క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.



Click it and Unblock the Notifications













