ఆంధ్రా గోవాగా పేరు పొందిన సముద్రతీర ప్రాంతం సూర్యలంక బీచ్. దగ్గరకు వచ్చీరానట్టుగా ఉండే చిరు అలలతో పర్యాటకుల మనసుదోచే కెరటాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.
తీరాన్ని దాటుకుంటూ వచ్చే చల్లని పిల్లగాలుల హోయలు సందర్శకుల మనసును తేలియాడేలా చేస్తాయి. సీజన్తో సంబంధం లేకుండా అలల అందాలను వీక్షించేందుకు సూర్యలంక కేంద్రమనే చెప్పాలి.

అలల తీరపు నెలవంక.. సూర్యలంక!
దీనికి ఉప్పుచేపల రుచులు అధనం. తక్కువ బడ్జెట్తో కుటుంబ సమేతంగా ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు ఆహ్వానం పలుకుతున్న ఆ తీరప్రాంత అందాలను మనసారా ఆస్వాదిద్దాం పదండి.
ఎప్పుడూ పనులతో సతమతమయ్యే బిజీ లైఫ్కు కాస్త విరామం ఇచ్చేందుకు మా ఆఫీసులో టూర్ ప్లాన్ చేశారు. దాంతో మొత్తంగా వందమంది వరకూ సిబ్బంది కుటుంబసమేతంగా సరదాగా టూర్కి సిద్దమయ్యాం. ఉదయం ఏడయ్యే సరికే అందరం బస్సులో విజయవాడ నుంచి ప్రయాణం మొదలుపెట్టాం. గుంటూరు జిల్లాలోని బాపట్లకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రతీర గ్రామం సూర్యలంక మా గమ్యస్థానం. దారిపొడవునా అంత్యాక్షరిపాటలు, సినిమా డైలాగులు, పిల్లల కేరింతలతో బస్సు హోరెత్తిపోయింది. బస్సులోని పెద్దలకు, పిల్లలకు మధ్య హోరాహోరీగా సాగిన పాటలపోటీలో పిల్లలదే పైచేయి. వారి ఐక్యూ పవర్ చూసి భలే ముచ్చటేసింది. అలా బాపట్ల, పొన్నూరు మీదుగా పచ్చని పొలాల నడుమ హాయిగా సాగిపోయింది మా ప్రయాణం.

తీరం.. ఆత్మీయ ఆహ్వానం!
రెండున్నర గంటల ప్రయాణం తర్వాత సువిశాల ఇసుకతిన్నెలు పరుచుకుని ఉన్న సూర్యలంక బీచ్ ప్రత్యక్షమయ్యింది. కెరటాల తీవ్రత తక్కువగా ఉండటంతో ఈ బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. కాలుష్య కారక పరిశ్రమలు లేకపోవడం వల్ల ఇక్కడి సముద్ర జలాలు స్వచ్ఛంగా ఉంటాయి. వారాంతాల్లో, పండగ రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా కనిపిస్తుందని అక్కడివారు చెప్పారు. ఈ తీరంలో అప్పుడప్పుడు డాల్పిన్లు విన్యాశాలు చేస్తూ సందర్శకులకు కనువిందు చేస్తాయని చెప్పారు. మేం గమనించిన దానిని బట్టి సూర్యలంక తీరం అర్ధచంద్రాకారంలో వంపు తిరిగి ఉంది.
అందువల్ల ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటారు. అంతేకాదు, చుట్టూ రెండుకిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించి ఉన్నాయి. దీనివల్ల స్వచ్ఛమైన గాలులను మనసారా ఆస్వాదించవచ్చు. సముద్ర తీరానికి ఆనుకుని జీడి, సరివి, జామాయిల్ తోటలు విస్తారంగా కనిపించాయి. పచ్చని ప్రకృతి రమణీయతకు తీరం జోడిస్తే అది సూర్యలంక బీచ్ అనేలా ఉంది అక్కడి ప్రాంతం.

కట్టుదిట్టమైన భద్రతా చర్య
అంతేకాదండోయ్! ఏటా నవంబర్ సమయంలో డాల్ఫిన్స్ను ఇక్కడ తప్పకుండా చూడొచ్చని స్థానికులు గంటాపథంగా చెప్పారు. స్థానికంగా ఓ పెద్దాయన చెప్పిన దాన్ని బట్టీ ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో ఈ ప్రాంతం ఓ వెలుగు వెలిగిందట! సుమత్రా, జావా, ద్వీపాలకు ఇక్కడి నుంచే సరుకులు రవాణా చేసేవారంట. అప్పటి గోదాములు కొన్ని 1970 వరకు ఉండేవి.
ప్రస్తుతం ఇక్కడ సుమారు రెండువేల మత్స్యకార కుటుంబాలు చేపల వేట మీద ఆధారపడి బతుకుతున్నారని చెప్పాడు. ఇక్కడే ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటీసీ) వారిది ఓ అతిథి గృహం కూడా ఉంది. ఇక్కడికి కొంత దూరంగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఎయిర్బేస్ ఉంది. నిత్యం గస్తీకాసే సైనికులు మాకు అక్కడక్కడా తారసపడ్డారు. ఇటీవల కాలంలో సూర్యలంక తీరంలో పర్యాటకాభివృధ్దికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అక్కడి అధికారులు చెప్పుకొచ్చారు. ఇక్కడికి కుటుంబసమేతంగా వచ్చే సందర్శకుల భద్రత విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతంలో మద్యం సేవించే పోకిరీలకు భారీ జరిమానాలు విధిస్తున్నారట! సూర్యలంక తీరంలో మేం ఆస్వాదించిన మరిన్ని అనుభవాలను రెండో భాగంలో చూద్దాం.



Click it and Unblock the Notifications












