రాజసం ఉట్టిపడే కళాత్మక నిర్మాణం.. లక్ష్మీ విలాస్ ప్యాలెస్
వడోదర రైల్వే స్టేషన్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది లక్ష్మీ విలాస్. ఈ ప్యాలెస్ గుజరాత్లోని వడోదరలో ఉన్న ఒక సంపన్నమైన రాజభవనం. జవహర్లాల్ నెహ్రూ రోడ్లో ఉన్న ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధిచెందిన ప్యాలెస్లలో ఒకటి మరియు వడోదరలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది.
మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III చేత నిర్మించబడిన లక్ష్మీ విలాస్ ప్యాలెస్ 1890లో సుమారు రూ.27,00,000 ఖర్చుతో నిర్మించబడింది. మేజర్ చార్లెస్ మాంట్చే రూపకల్పన చేయబడింది. ఇది ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద ప్రైవేట్ నివాసంగా మరియు బకింగ్హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా పేరుపొందింది. నిర్మాణ సమయంలోనే ఎలివేటర్లు వంటి అత్యంత ఆధునిక సౌకర్యాలను కలిగి ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. దీని లోపలి భాగం ఒక పెద్ద యూరోపియన్ కంట్రీ హౌస్ను గుర్తు చేస్తుంది. ఇది వడోదర రాజకుటుంబమైన గైక్వాడ్స్ నివాసంగా ఉంది.

ఏడు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఇండో-సార్సెనిక్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ప్యాలెస్ ప్రవేశ ద్వారంలో ఏర్పాటు చేసిన ఫౌంటెన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 170 గదులు ఉన్నాయి. ఇవి కేవలం మహారాజు, మహారాణి కోసం నిర్మించబడింది. మొజాయిక్ అంతస్తులు, పీరియడ్ ఫర్నీచర్, వెనీషియన్ షాన్డిలియర్స్ మరియు బెల్జియన్ స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలతో అలంకరించబడిన ఈ దర్బార్ హాల్ ప్యాలెస్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ గదిలో కాంస్య, పాలరాయి మరియు టెర్రకోటతో చేసిన కొన్ని అద్భుత శిల్పాలు ఉన్నాయి. ఇది తరచుగా సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సంగీత కచేరీలకు వేదికగా ఉపయోగించబడుతుంది.
ఇక్కడి ప్యాలెస్ కాంప్లెక్స్లో అనేక భవనాలు ఉన్నాయి. ప్రత్యేకించి LVP విందులు & సమావేశాలు మందిరాలు, మోతీ బాగ్ ప్యాలెస్, గోల్ఫ్ కోర్స్, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం భవనం మరియు ఒక చిన్న జూ మ్యూజియం భవనం, మహారాజా పిల్లల కోసం ఒక పాఠశాలగా నిర్మించబడింది. సందర్శకులు మ్యూజియంలో పెద్ద సంఖ్యలో రాజ కుటుంబానికి చెందిన కళాఖండాలు ప్రదర్శించబడటం చూడవచ్చు . వీటిలో అత్యంత విశేషమైనది అప్పటి బరోడా మహారాజుచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాజా రవివర్మ యొక్క అద్భుతమైన చిత్రాలు. ఈ సేకరణలో రాజా రవివర్మ ప్రసిద్ధి చెందిన హిందూ పురాణాల ఆధారంగా చిత్రలేఖనాలతో పాటు రాజకుటుంబానికి సంబంధించిన చిత్రాలు ఉన్నాయి.

1930లలో మహారాజా ప్రతాప్సింహ తన యూరోపియన్ అతిథుల కోసం దాని ప్రాంగణంలో గోల్ఫ్ కోర్స్ను ఏర్పాటు చేశాడు. దీనిని 1990లలో అతని మనవడు సమత్జిత్సిన్హా పునర్నిర్మించి ప్రజలను అనుమతించారు. రాజ కుటుంబానికి చెందిన పిల్లలను పాఠశాల నుండి ప్రధాన లక్ష్మీ విలాస్ ప్యాలెస్కు తీసుకెళ్లడానికి ప్యాలెస్ కాంపౌండ్లోని మామిడి తోటను చుట్టుముట్టే చిన్న రైల్వే లైన్ కూడా ఉంది. రైలు ఇంజన్ను ఇటీవలే రంజిత్సిన్హ్ ప్రతాప్సిన్హ్ గైక్వాడ్ పునరుద్ధరించారు. దీనిని మ్యూజియం ప్రవేశద్వారం వద్ద చూడవచ్చు. అద్భుతమైన ఈ ప్యాలెస్లో అనేక తోటలు ఉన్నాయి. వీటిని ప్రసిద్ధ వృక్షశాస్త్రజ్ఞుడు సర్ విలియం గోల్డ్రింగ్ రూపొందించారు. అతను లండన్లోని ప్రసిద్ధ క్యూ బొటానికల్ గార్డెన్లను కూడా రూపొందించాడు. రాజ కుటుంబం ఇప్పటికీ ఈ అద్భుతమైన ప్యాలెస్లో నివసిస్తున్నప్పటికీ, ప్యాలెస్లో కొంత భాగం సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ మరియు మరాఠీలో ఒక గంట ఆడియో టూర్ అందుబాటులో ఉంది. ప్యాలెస్ లోపల ఫోటోగ్రఫీ పూర్తిగా నిషేధించబడింది.
సమయాలు: 10 AM - 5 PM, సోమవారం మరియూ ముఖ్యమైన సెలవు రోజుల్లో మూసివేయబడుతుంది.
ప్యాలెస్ ప్రవేశం: రూ. భారతీయులకు రూ. 225, విదేశీయులకు 500 (ఆడియో గైడ్తో సహా), 10 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా మ్యూజియం ప్రవేశం ఉంటుంది.



Click it and Unblock the Notifications












