అమరావతిలో నేడు, రేపు అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. ఐదువేలకు పైగా డ్రోన్లతో మెగా షోను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అమరావతి డ్రోన్ సమ్మిట్- 2024 పేరుతో పున్నమి ఘాట్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్నీరకాల ఏర్పాట్లు చేశారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ డ్రోన్ సమ్మెట్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. ఈ డ్రోన్ సమ్మిట్ గురించిన పూర్తి వివరాలను ఇప్పడు తెలుసుకుందాం.
డ్రోన్ సమ్మిట్..
ఇందులో భాగంగానే నేడు, రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొనసాగనుంది. ఇక, ఈ అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024లో వ్యవసాయం, వైద్యారోగ్యం, అర్బన్ ప్లానింగ్, శాంతిభద్రతలు, తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగం విధాన రూపకల్పనపై దృష్టి పెట్టనున్నారు. డ్రోన్ సమ్మిట్ ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ కృష్ణా తీరంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకూ దేశంలో అత్యధికంగా రెండువేల డ్రోన్స్ తో డ్రోన్ షో నిర్వహించారు. అయితే, ఏపీ ప్రభుత్వం అంతకు మించి డ్రోన్స్ తో మెగాషో నిర్వహించి రికార్డు సృష్టించాలనే ఆలోచన చేస్తోంది. అందుకోసమే కార్యక్రమాలు, డ్రోన్ హ్యాకథాన్, ఐదువేలకుపైగా డ్రోన్స్ తో డ్రోన్ షో జరగబోతుంది.
ఐదు ప్రాంతాల్లో డిజిటల్ తెరలు..
ఈ డ్రోన్ షో సమ్మిట్ మొత్తం తొమ్మిది థీమ్స్పై జరగనుంది. ఇందులో సుమారు 400కిపైగా కంపెనీలు పాల్గొనబోతున్నాయి. మొత్తం 1800మంది డెలిగేట్స్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇందుకోసం నాలుగు కేటగిరీల్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. ఇందులో విజేతలుగా గెలిచినవారికి కేటగిరీల వారీగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తారు. నేటి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ డ్రోన్ షో జరగనుంది.

విజయవాడ నగరవాసులంతా తిలకించేందుకు వీలుగా అధికారులు నగరమంతా విస్తృత ఏర్పాట్లు చేస్తోన్నారు. అందుకోసం నగరంలోని ఐదు ప్రాంతాల్లో భారీ డిజిటల్ తెరలను కూడా సిద్ధంచేశారు. ఆ ప్రాంతాలు.. బెంజిసర్కిల్, రామవరప్పాడు, వారధి, బస్టాండ్, ప్రకాశం బ్యారేజీలు. ఇక, ఈ డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లలో భాగంగా అధికారులు మొత్తం 300 మంది సిబ్బందులను నియమించారు. 10 మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు కూడా అప్పగించారు.
పలు రంగాల్లో డ్రోన్ ఆవిష్కరణలు..
ఈ డ్రోన్ సమ్మిట్లో బుడమేరు వరదల సందర్భంగా డ్రోన్లను ఎలా వినియోగించామన్న విషయంపై ప్రజంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఈ డ్రోన్ షోలో పాల్గొనేందుకు డెలిగేట్స్ ఇప్పటికే అమరావతి చేరుకున్నారు. డ్రోన్ల పండగను తిలకించేందుకు తెలుగు ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డ్రోన్ల సాంకేతికత వినియోగంపై కీలకమైన నాలుగు ప్రజెంటేషన్లు, ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లు కూడా ఈ కార్యక్రమంలో ఉంటాయి. ఇక, ఈ వేదిక వద్ద దేశవ్యాప్తంగా డ్రోన్ తయారీదారుల ఉత్పత్తులకు సంబంధించిన 40 ప్రదర్శనశాలలను కూడా ఏర్పాటు చేశారు. ఇక, ఇందులో ప్రజాభద్రత, విపత్తుల నిర్వహణ, డ్రోన్ సాంకేతికత అప్లికేషన్ల వినియోగం, టూరిజం, ఎంటరైన్మెంట్ రంగాల్లో డ్రోన్ల ఆవిష్కరణలు తదితర అంశాలపైనా కూడా చర్చలు ఉంటాయి.



Click it and Unblock the Notifications













