విజయవాడ వాసులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సీ ప్లేన్ సర్వీసులకు ఎట్టకేలకు ముహుర్తం ఖరారైంది. ఇందులో భాగంగానే కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. విజయవాడ నగరంలో సీ ప్లేన్ సర్వీసుల్ని ప్రారంభిస్తున్నట్లు గతంలోనే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించనుంది.
2019లోనే..
కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకాశం బ్యారేజీ ఎగువున సీ ప్లేన్ సర్వీసుల్ని నడిపేందుకు అనుమతులిచ్చింది. అయితే, అవి కార్యరూపం దాల్చలేదు. తాజాగా వీటి అమలుకు ఏపీ ప్రభుత్వం ముహుర్తం ఖారురు చేసింది. డిసెంబర్ 9వ తేది నుంచి కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 2019లోనే కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో అవి ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పడు సీప్లేన్ సర్వీసుల్ని ప్రయోగాత్మకంగా నడిపేందుకు ఏపీ టూరిజం శాఖ సిద్ధమైంది.
డిసెంబర్ 9న ప్రారంభం..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మరో సారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రకాశం బ్యారేజీలో మళ్లీ సీ ప్లేన్ అంశం బయటికొచ్చింది. విజయవాడ నుంచి శ్రీశైలం క్షేత్రానికి తొలి సీప్లేన్ సర్వీసులను తీసుకరానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9వ తేది నుంచి ఈ సర్వీసులను ప్రభుత్వం ప్రారంభించనుంది. భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో ఈ సర్వీసులను విస్తరించనున్నట్లు సమాచారం.
ప్రకాశం బ్యారేజీ ఎగువున విస్తరించిన కృష్ణా జలాల్లో సీ ప్లేన్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటు..
ఇక, ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం బ్యారేజీ దగ్గర వాటర్ ఏరోడ్రమ్ ను కూడా అధికారులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సీ ప్లేన్లోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ఇక్కడ వాటర్ వే కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటర్ ఏరో డ్రమ్ ఏర్పాటు కోసం ఇప్పటికే పౌర విమానయాన సంస్థ అధికారులు సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ వాటర్ డ్రోమ్ ను శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం దిగువున దుర్గాఘాట్ సమీపంలో ఫ్లైఓవర్ దిగువన ఉన్న స్థలంలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ సీప్లేన్ సర్వీసుల ద్వారా విజయవాడ - శ్రీశైలం పుణ్యక్షేత్రాలను దర్శన భక్తులకు ఈజీ కానుంది. విజయవాడలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకుని శ్రీ శైలంలోని శ్రీభ్రమరాంబ సమేత మల్లిఖార్జులను కూడా దర్శించుకునే అవకాశం లభించనుంది. ఈ సర్వీసు ద్వారా రెండు ప్రాంతాల మధ్యన టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు.

ల్యాండింగ్ కోసం వాటర్ వే..
ఈ సీ ప్లేన్ సర్వీసుల్లో భాగంగా సీ ప్లేన్ ల్యాండింగ్ కోసం ఒక వాటర్ వే ను కూడా ఏర్పాటు చేస్తారు. విమానం ల్యాండింగ్ అయ్యాక, టేకాఫ్ తీసుకునే ముందు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వాటర్ వే నిర్మాణం చేపట్టనున్నారు. వాటర్ వే కోసం ముందుగా జెట్టీల నిర్మాణం చేపడతారు. ఈ జెట్టీ సమీపంలోకి విమానం రావడం జరుగుతంది. ఇక, ప్రయాణికులు ఈ జెట్టీ ద్వారా బోటులోకి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.
విజయవాడ నుంచి బయలుదేరిన ఈ సీ ప్లేన్ నేరుగా శ్రీశైల పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ దగ్గర కృష్ణానదిలో ల్యాండ్ అవుతుంది. అయితే, సీప్లేన్ సర్వీసుల్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. విజయవాడ-శ్రీశైలం సర్వీస్ సక్సెస్ అయితే భవిష్యత్తులో హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్, విశాఖపట్నంలకు కూడా సీపేన్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.



Click it and Unblock the Notifications














