దట్టమైన అటవీప్రాంతంలో.. ఎత్తయిన కొండపైన కొలుపైన పురాతన పంచ ఆలయాలను మహాశివరాత్రి పురస్కరించుకుని సందర్శించేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. మందస మహేంద్రగిరులు శివపంచాక్షరీ జపంతో మార్మోగిపోతున్నాయి. ఇక్కడి శివనామస్మరణ కొండకోనలు దాటి తీరప్రాంతాలకు చేరుకుంటుందంటారు. మహాశివరాత్రిని పురుస్కరించుకుని ఆ మహేంద్రగిరుల్లో దాగిన పంచ ఆలయాల ఆధ్యాత్మికతను మనమూ స్మరిద్దాం!
ఈ నెల 8న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహేంద్రగిరుల యాత్ర ఘనంగా ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా మందస సమీపంలో తూర్పుకనుముల్లోని దండకారణ్యంలో ఈ మహేంద్రగిరి పర్వతం దర్శనమిస్తుంది. సరిగ్గా.. బారువ సముద్ర తీరానికి 48కిలోమీటర్లు దూరంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఈ కొండలు ఉన్నాయి.
సముద్ర మట్టానికి సుమారు 5400 మీటర్లు ఎత్తున గిరిపై ఉన్న పంచ ఆలయాలకు నిలయంగా నిలుస్తోంది. పాండవుల పేరుతో ఆలయాలు ఉన్నప్పటికీ శివలింగాష్టకం ప్రతిష్ఠించి ఉండడం ఈ గిరుల ప్రత్యేకతగా చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి నాడు ఈ ఆలయాలకు సూదూర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి చేరుకుంటారు. శివరాత్రికి రెండు రోజుల ముందు నుంచే కాలినడకన చేరుకుని, ఆలయ సందర్శన చేయడం ఆనవాయితీగా వస్తోంది.

చారిత్రక నేపథ్యం..
చారిత్రక ఆధారాలను బట్టీ.. పాండవులు అరణ్యవాసం సమయంలో ఈ కొండపై కొంతకాలం గడిపారని, వారి ఆరాధన కోసం ఈ ఆలయాలు నిర్మించారని చెబుతారు. అంతేకాదు, ఈ కొండను స్వాధీనం చేసుకునేందుకు సామంత రాజులు, జమీందారీల పాలనలో బడ్డి గజపతులు, రాయగడ, తుంబకోట, పర్లాఖిముడి, మందస రాజులు అనేక యుద్ధాలు చేసినట్లు చెబుతారు. ఈ కారణాలతోనే ఇక్కడ కొన్ని చారిత్రక కట్టడాలు శిథిలమయ్యాయని అంటారు. కాలక్రమేనా.. మందస రాజుల ఆధీనంలోకి వచ్చిన తర్వాత 1935లో ఈ ఆలయాలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టినట్లు శిలాశాసనాలు ద్వారా తెలుసుకోవచ్చు. అయితే, నేడు ఇవన్నీ ఒడిశా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోవడంతో అభివృద్ధి చెందడం లేదని భక్తులు వాపోతున్నారు.

ప్రకృతి రమణీయ దృశ్యాలు
పచ్చని మహేంద్రగిరులపై నుంచి చూస్తే.. ప్రకృతి రమణీయ దృశ్యాలు సందర్శకులను కనువిందు చేస్తాయనే చెప్పాలి. ఇక్కడి కొండ చివరిన ఉన్న ప్రధాన ఆలయంగా చెప్పుకునే ధర్మరాజు మందిరం ఉంటుంది. ఇది సుమారు 150 అడుగుల ఎత్తు ఉండి, దీని చుట్టూ సువిశాల ప్రాంతం ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. అంతేకాదు, ఈ గోపురం ఆగ్నేయ దిశకు కాస్త వాలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ ఆలయానికి కొద్దిదూరంలో సుమారు నాలుగు హెక్టార్ల వైశాల్యం గల రాతిబండపై అనేకచోట్ల శివలింగాలు చిన్న కుటీరాల్లా రాళ్లతో నిర్మితమై ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిస్తాయి.
ధర్మరాజు మందిరానికి దక్షిణదిశగా సహదేవుని ఆలయం, మరికొద్ది దూరంలో మరో శిథిల గోపురం (కర్ణాలయం) కనిపిస్తాయి. గుబురుగా పెరిగిన చెట్లమధ్యలో భీష్ముని ఆలయం సుమారు 30 అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది. ఇక్కడికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో 100 అడుగుల ఎత్తులో అర్జునాలయం, గిరి శిఖరాగ్ర భాగంలో మరో 50 అడుగుల ఎత్తులో భీముని ఆలయం కనిపిస్తాయి. దిగువ భాగంలోని వనవాస కాలంలో పాండవులు నిర్మించుకున్న వంటశాల, వినియోగించిన రాతి వస్తువులు చూడొచ్చు. ధర్మరాజు ఆలయానికి రెండు కిలోమీటర్లు దూరంలో సభావేదిక ఉంటుంది.



Click it and Unblock the Notifications












