నగరానికి చేరువలో సరికొత్త పిక్నిక్ స్పాట్.. కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్!
సెలవులు దొరికితే చాలు ఊటీ, కొడైకెనాల్, బెంగళూరు లేదా మరే ఇతర ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లాలని ఎవరికైనా ఉంటుంది. అయితే, అన్నివర్గాల ప్రజలకు అది సాధ్యపడదు. 'అంత దూరం కుటుంబసభ్యులతో వెళ్లాలంటే సెలవులు దొరకొద్దూ..! అనేవారు కొందరైతే, సరదాగా తిరగడానికి అంత ఖర్చు అవసరమా?!' అని ప్రశ్నించేవారు మరికొందరు. అదే అందరికీ అందుబాటులో, పెద్దగా ఖర్చేమీ లేకుండా ఊటీ కొడైకెనాల్కు వెళ్లినంత ఫీలింగ్ వచ్చే ప్రాంతం ఉందంటే ఏమనిపిస్తుంది? వెంటనే వెళ్లాలనిపిస్తుంది కదూ! మరెందుకు ఆలస్యం.. విజయవాడకు అతి సమీపంలో ఉన్న కొత్తూరు రిజర్వ్ ఫారెస్టుకు బయలుదేరదాం పదండి! ఇక్కడి సహజసిద్ధమైన ప్రకృతి వాతావరణంలో సేద తీరవచ్చు.
విజయవాడ నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కొత్తూరు తాడేపల్లి అటవీ ప్రాంతం ఉంది. అక్కడికి చేరుకునేందుకు విజయవాడ - విస్సన్నపేట ఆర్ అండ్ బీ రోడ్డు మార్గంలో సుమారు 15 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి ఉంటుంది. అలా కొత్తూరు గ్రామం చేరుకుంటాం. అక్కడ నుంచి కుడివైపునకు రోడ్డు మార్గంలో పోలవరం కాలువ వస్తుంది. దానిని దాటి అవతల వైపు ఉన్న ప్రాంతమే కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్. ఈ బెజవాడ ఊటీ కొత్తూరు నుంచి కేవలం నాలుగు కిలో మీటర్ల దూరంలోనే ఉంది. చుట్టూ ఎత్తయిన కొండలు, మధ్యలో మైదాన ప్రదేశం ఇక్కడి ప్రత్యేకత. చల్లని నీడనిచ్చే గుబురు గుబురుగా ఉన్న వెదురు చెట్లు, చుట్టూ ఏపుగా పెరిగిన జామాయిల్ చెట్లు, అక్కడక్కడా వేప, నేరేడు, గానుగచెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఇంతటి ప్రశాంత వాతావరణం విజయవాడ నగరానికి అతి సమీపంలోనే ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. మైదాన ప్రదేశానికి వెళ్లే దారి పొడవునా చల్లని పిల్లగాలులతో డొంకకు రెండువైపులా ఉన్న చెట్లు స్వాగతం పలుకుతాయి. ఆ డొంకల గుండా నడుస్తుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది.

వన సంరక్షణ సమితులతో అభివృద్ధి
రెండు దశాబ్ధాల క్రితం ప్రభుత్వం అడవులను సంరక్షించాలనే ఉద్దేశంతో వన సంరక్షణ సమితులను (విఎస్ఎస్) తెరమీదకు తెచ్చింది. అందులో భాగంగానే విజయవాడకు సమీపంలోని కొత్తూరు తాడేపల్లి, నున్న గ్రామాలలో ఏర్పాటు చేసింది. అటవీశాఖ వీరికి నేరేడు, వేప, వెదురు, జామాయిల్, మామిడి తదితర మొక్కలను సరఫరా చేశాయి. అలా అప్పుడు నాటిన మొక్కలే దశాబ్దంన్నర కాలానికి వృక్షాలుగా దర్శనమిస్తూ, అడవి అందాలను మరింతగా పెంచాయి.
భవిష్యత్తులో పర్యాటక ప్రదేశంగా కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ మరింత అభివృద్ధి చెందుతోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఒకప్పుడు అక్కడకు వెళ్లాలంటే రాళ్లు రప్పల్లో వెళ్లాల్సి వచ్చేది. అయితే, అటవీశాఖ అధికారులు రహదారులను, డొంకను అభివృద్ధి చేశారు. సుమారు 20 ఎకరాలకు పైగానే ఉన్న మైదాన ప్రాంతానికి ఓ కొత్తరూపాన్ని ఇచ్చారు. ప్రకృతి మలచిన అందమైన శిల్పంలా ఇక్కడి ప్రదేశాలు సందర్శకులను రా.. రమ్మని ఆహ్వానం పలుకుతాయి.

మంచి పిక్నిక్ స్పాట్..
సందర్శకులు మైదాన ప్రదేశానికి వెళ్లి, సేద తీరేందుకు విఎస్ఎస్ నిర్వాహకులు చిన్న షెడ్ను కూడా ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం అక్కడే బావి ఒకటి తవ్వారు. అందులోని నీళ్లు నిత్యం చల్లగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ఆ బావి నీరు కృష్ణా, గోదావరి నదుల్లోని నీటి కంటే రుచిగా ఉంటాయనేది ఆ నీళ్ళు తాగినవారి అభిప్రాయం.
ఇక్కడి ప్రకృతి అందాలను గుర్తించిన స్థానికులు గత రెండుమూడేళ్ల నుంచి ఏటా కుటుంబ సమేతంగా పిక్నిక్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. దగ్గరలోనే అన్ని సదుపాయాలు ఉండటంతో ఆ ప్రాంతం గురించి తెలిసిన వారు అక్కడకు వెళుతున్నారు. ఒక్క పిక్నిక్ కాదండోయ్ స్థానికులు తరచూ చిన్న చిన్న విందు కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటుంటారు. నిజమే! నిత్యం రణగణ ధ్వనులతో సతమవుతున్న నగర వాసులు ఇలాంటి ప్రశాంత వాతావరణానికి వెళ్ళి, కొన్ని గంటలైనా విశ్రాంతి తీసుకొంటే ఆ రిలీఫే వేరు.

కొండ కోనల మధ్యలో
ఈ పర్యాటక ప్రదేశం కొండ కోనల మధ్యలో చూడచక్కగా ఉంటుంది. చుట్టూ కొండలు, ఏటవాలుగా ఉన్న ప్రదేశంలో ఎత్తయిన జామాయిల్ చెట్లు ఏపుగా పెరిగి ఉంటాయి. ఇవి. చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. అభయారణ్యమే అయినప్పటికీ, ప్రస్తుతం దాని స్వరూపం పూర్తిగా మారిపోయింది. నాలుగైదుగ్రామాలకు వెళ్లేందుకు మార్గం కూడా ఏర్పాటైంది. మొక్కలను పెంచేందుకు వన సంరక్షణ సమితులు ప్రత్యేకంగా చెక్ డ్యామ్లను ఏర్పాటు చేశాయి. వర్షాకాలంలో కొండల నుంచి జాలువారే నీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా కుంటలను కూడా ఏర్పాటు చేశారు. కొండకు దగ్గరలో కనిపించే చిన్న చిన్న వాగులు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.
ఇక్కడకు చేరుకునే యువత ఫోటోలకు ఫోజులచ్చేందుకు ఈ స్పాట్లు ఎంతగానో ఉపకరిస్తాయి. కొండలపైకి చేరుకునేందుకు బైక్ రైట్ ఎంతో సాహస క్రీడలను తలపిస్తుంది. కొత్తవారు ఈ ప్రాంతంలో కాస్త కఫ్యూజ్ అవుతారు. అందుకే ఇక్కడి ప్రదేశాలపై అవగాహన ఉన్నవారి సహకారం తీసుకోవాలి. ఎందుకంటే, ఇక్కడ జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది.

వన దేవత వద్ద సేద దీరేందుకు..
అడవిలోకి ప్రవేశించగానే వన దేవతగా పేరొందిన సత్తెమ్మ తల్లి ఆలయం కనిపిస్తుంది. అక్కడి నల్ల నేరేడు చెట్టు కింద వనదేవత వెలిసిందని స్థానికుల విశ్వాసం. వారి విశ్వాసాలు ఎలా ఉన్నా కొత్తూరు, తాడేపల్లి గ్రామాలకు చెందిన మేకలు, పుసువులను మేపేందుకు అడవికి వెళ్ళేవారు ఆ చెట్టు కిందే సేద తీరతారు. అలా అడవికి వచ్చే కాపర్లు సేద తీరేందుకు అక్కడ తాటాకులతో పందిరి కూడా వేశారు.
గుబురుగా పెరిగిన చెట్ల మధ్య సూర్యక్రాంతికి సైతం చోటివ్వని ఈ స్పాట్ మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తుందనే చెప్పాలి. ప్రభుత్వోద్యోగం పొందిన ఒక వ్యక్తి అడవికి వచ్చే పర్యాటకుల దాహార్తిని గుర్తించి, వారి కోసం ప్రత్యేకంగా బోరింగ్ ఏర్పాటు చేశారు. దీంతో సందర్శకులతో పాటు పశువులకూ తాగునీటి కొరత తీరిందనే చెప్పాలి. మరెందుకు ఆలస్యం నగరానికి చేరువగా ఉన్న ఈ ప్రకృతి అందాలను మీరూ మనసారా ఆస్వాదించండి.



Click it and Unblock the Notifications













