చరిత్ర ప్రేమికుల ప్రత్యేక ఆకర్షణ.. ఖిలా ముబారక్ ఫోర్ట్!
పంజాబ్లోని అమృత్సర్కు దక్షిణంగా మూడు గంటల ప్రయాణాంతరం బథిండా చేరుకోవచ్చు. ఈ నగరంలోని అద్భుత నిర్మాణమే ఖిలా ముబారక్ ఫోర్ట్. దశాబ్దాలుగా ఇది చరిత్ర ప్రేమికులను ఆకర్షిస్తోంది. ఈ పురాతన కోట భారతదేశంలోని మనుగడలో ఉన్న చారిత్రక నిర్మాణాలలో ఒకటి ప్రసిద్ధికెక్కింది. పురాతన సింధు లోయ నాగరికతకు చెందిన మట్టి ఇటుకలు ఇక్కడ నిర్మాణంలో వినియోగించబడ్డాయని నానుడి. 18వ శతాబ్దానికి చెందిన పాటియాలా పాలకులతో సహా ఒకటవ శతాబ్దం నుండి వివిధ పాలకులు కోటను సుస్తిరపరచారు. కోట లోపల ఒక గురుద్వారా ఉంది. ఇది పదవ సిక్కు గురువు గోవింద్ సింగ్ గౌరవార్థం ఏర్పాటు చేయబడింది. గోవింద్ సింగ్ 18వ శతాబ్దం ప్రారంభంలో కోట నుండి దెయ్యాన్ని తరిమికొట్టాడని చెబుతారు. 13వ శతాబ్దంలో ఢిల్లీకి మొదటి మహిళా పాలకురాలు, ఎంప్రెస్ రజియా సుల్తానా ఈ కోటలో ఖైదు చేయబడిన కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
నేటికీ ఖిలా ముబారక్ గొప్ప చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా పంజాబ్ రాష్ట్ర సిగలో నిలుస్తోంది. కోట యొక్క గంభీరమైన వాస్తుశైలి చుట్టుపక్కల ఉన్న ఎడారి ప్రాంతంతో సంపూర్ణంగా కలిసిపోతుంది. సహజసిద్ధ ఇసుక మేటలా దర్శనమిచ్చే ఈ కోట నిర్మాణ శైలి చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే ఖిలా ముబారక్ ఇప్పటి వరకు పంజాబ్లో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది. ఇక్కడికి దగ్గరలోనే హెరిటేజ్ హోటల్గా మార్చబడిన మరొక పురాతన కోటను కూడా సందర్శించే అవకాశం ఉంది. దీనిని బహియా కోటగా పిలుస్తారు. ఈ కోటను 1930లో నిర్మించారు. పాటియాలా పాలకుడు మహారాజా భూపిందర్ సింగ్ సైన్యానికి ఇక్కడే వసతి కల్పించబడింది.

ఖిలా ముబారక్ చారిత్రక నేపథ్యం..
ఖిలా ముబారక్ ఓ సంపన్నమైన కోటగా వాయువ్య దిశలో కొలువుదీరిన కారణంగా దీనిని తబర్-ఎ-హింద్ లేదా భారతదేశానికి గేట్వే అని కూడా పిలుస్తారు. బలమైన నిర్మాణం కారణంగా, ఇది పంజాబ్ యొక్క రక్షణ వ్యూహాలలో ముఖ్యమైన పాత్రను అందించింది. ఢిల్లీ సుల్తానేట్ల ప్రథమ మహిళా పాలకురాలు రజియా సుల్తానా ఓడిపోయి సింహాసనాన్ని తొలగించిన తర్వాత ఈ కోటలో బంధించబడింది. చారిత్రక నేపథ్యమున్న ఖిలా ముబారక్ను ప్రత్యేకించి చరిత్ర ప్రేమికులకు ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంది. అంతేకాకుండా, కొంతమంది ఈ సైట్ను కుటుంబసమేతంగా విజిట్ చేసే పిక్నిక్ స్పాట్గా కూడా ఎంచుకుంటారు. కోట యొక్క ప్రశాంతమైన మరియు నిర్మలమైన వాతావరణం కారణంగా బథిండాలో చరిత్రను తిలకించడానికి అవకాశం కల్పించిన గొప్ప ప్రదేశంగా పేరుగాంచింది.

ఖిలా ముబారక్ నిర్మాణం
గంభీరమైన పాత-కాలపు ద్వారం ఖిలా ముబారక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడికి వచ్చే సందర్శకులకు రాచరికపు అనుభూతిని చేరువ చేస్తుంది. చిన్న చిన్న ఇటుకలతో నిర్మించిన ఎత్తయిన కోటలలో ఖిలా ముబారక్ కూడా ఒకటిగా నిలుస్తోంది. దాని ఎత్తు కారణంగా, కోటపై భాగం నుంచి బథిండా పట్టణం మొత్తాన్ని సందర్శకులు కనులారా వీక్షించే అవకాశం ఉంటుంది. అదోక సుందర దృశ్యంగా భావించవచ్చు. ఇది ప్రధాన మందిరం లోపల రెండు గురుద్వారాలను కూడా కలిగి ఉంటుంది. రజియా సుల్తాన్ను ఖైదు చేయడానికి నిర్మించిన మంత్రముగ్ధమైన కోటలోని జైలు పర్యాటకులలో సరికొత్త ఆసక్తిని కలిగిస్తుంది. ఖిలా ముబారక్ గోడల వెంట నడవవచ్చు. అయితే, అందుకు ఉదయం 6:00 నుండి 8:00 వరకు మాత్రమే అనుమతించబడుతుంది.

ఖిలా ముబారక్ను సందర్శించేందుకు..
ఖిలా ముబారక్ చేరుకోవడానికి రైలు, విమానం లేదా బస్సు ద్వారా బథిండా నగరానికి చేరుకోవాలి. సమీప విమానాశ్రయం చండీగఢ్లో ఉంది. అక్కడి నుంచి బస్సు లేదా రైలులో ప్రయాణించాలి. బథిండా రైల్వే జంక్షన్ భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది.



Click it and Unblock the Notifications













