కలియుగదైవంగా పేరొందిన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా 300 రూపాయలతో దర్శన టికెట్లు, వసతి గదులు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించడంపై ప్రకటన విడుదల చేసింది. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణంతోపాటు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోటా టోకెన్ల విడుదలకు టీడీడీ అధికారులు సర్వం సిద్ధం చేశారు.
దీంతోపాటు భక్తుల కోసం 300 రూపాయలతో ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదులు, శ్రీవారి సేవ కోటా టోకెన్లను కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ టికెట్ల కేటాయింపులు జరిగే తేదీలను, ఆ సమయంలో అందుబాటులో ఉండే సేవలపై అధికారులు భక్తులకు పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు. మే నెలకు సంబంధించిన టోకెన్ల కోటపై కూడా ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.

నేటి నుంచి అంగప్రదక్షిణం టోకెన్లు..
భక్తుల సౌకర్యార్థం అంగప్రదక్షిణం టోకెన్లను ఫిబ్రవరి 23 అంటే నేటి నుంచి విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం పది గంటలకు మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. అలాగే, వీటితోపాటు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చెసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టికెట్లు కొనుగోలు విషయంలో గతంలో ఎదరైన పలు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

శ్రీవారి సేవ కోటా ఈ నెల 27న విడుదల...
అలాగే, ఫిబ్రవరి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదలపైనా టీటీడి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల, తిరుపతిలలో మే నెల గదుల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అలాగే, ఈ నెల 27న శ్రీవారి సేవ కోటా విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఫిబ్రవరి 27న ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ కోటాలను కూడా టీటీడి ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ సేవల విషయంలో ఇప్పటికే గందగోళంలో ఉన్నవారు తాజా ప్రకటనతో ఊపిరిపీల్చుకున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి వసతి గదులను, అలాగే ప్రత్యేక దర్శన టికెట్లను ముందుగానే శ్రీవారి అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. మరెందుకు ఆలస్యం కుటుంబసమేతంగా ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు ఇప్పుడే ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోండి.



Click it and Unblock the Notifications













