ఏపీలోని పర్యాటకులకు ప్రభుత్వం ఓ సూపర్ న్యూస్ అందించింది. ఈ నెల (అక్టోబర్) 26వ తేది నుంచి ఆధ్యాత్మిక యాత్రకు వన్డే టూర్ ప్యాకేజీనీ అమల్లోకి తెచ్చింది. ప్రకృతి అందాలను చూస్తు టూర్ ఆస్వాదించాలనుకునేవారికి ఇదొక సువర్ణవకాశం. ఈ వన్ డే టూర్ ప్యాకేజీ లో రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పుగోదావరి అందాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. వీటితోపాటు ఇక్కడి పర్యాటక ప్రాంతాలను, సందర్శనీయ ప్రదేశాలను, చారిత్రక కట్టాడాలను కూడా సందర్శించేయొచ్చు. ఇక, ఈ వన్డే టూర్ ప్యాకేజీ ఈ నెల (అక్టోబర్) 26వ తేది నుంచి ప్రారంభమవుతుందని, ఆసక్తి ఉన్న పర్యాటకులు సంప్రదించగలరని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రండీ ఈ వన్డే టూర్ ప్యాకేజీ వివరాలేంటో తెలుసుకుందాం. .
మొత్తం ఆరు ప్రదేశాలు..
ప్రస్తుతం ఈ వన్డే టూర్ ప్యాకేజీ శనివారం మాత్రమే సాగుతుందని, పర్యాటకుల డిమాండ్ను అనుసరించి ఆదివారం కూడా ఈ టూర్ను ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఓ ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు, పంచారామ క్షేత్రాలను కవర్ చేస్తూ వన్డే వీకెండ్ టూర్ ప్యాకేజీకి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.
మొత్తం ఆరు ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రాలతో ఈ ఆధ్యాత్మిక యాత్రను ప్రవేశపెట్టాలని నిర్ణయించామని పర్యాటక శాఖమంత్రి అన్నారు. ఈ వన్డే టూర్లో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను ప్రతి శనివారం సందర్శించొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ కోసం ఏపీ టూరిజం ప్రత్యేక బస్సులను కూడా నడుపతుంది.

ప్యాకేజీ ధరలు..
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ప్రతి శనివారం రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్ వద్ద టూరిజం శాఖ ఆఫీస్ నుంచి ఉదయం ఆరు గంటలకు బస్సులు బయలుదేరుతాయి. తిరిగి రాత్రి 7.30గంటలకు ఈ ప్రయాణం ముగుస్తుంది. అతి త్వరలోనే ఈ బస్సులు ప్రారంభం కానున్నాయి. ఈ టూర్ ప్యాకేజీలో పెద్దలకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. అదే చిన్నారులు మూడు నుంచి పదేళ్ల పిల్లలకు రూ.
800 టికెట్ ధరగా నిర్ణయించారు. ఆధ్యాత్మిక ప్రదేశాలతోపాటు ప్రకృతి అందాలను సందర్శిస్తూ సాగే ఈ టూర్ ప్యాకేజీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పర్యాటకులు గోదావరి నది హారతీని వీక్షించేలా కూడా ఏర్పాట్లు చేస్తారు. 18 మంది సీటింగ్ సామర్థ్యం కలిగిన బస్సులు అందుబాటులో ఉంటాయి.
టూర్ షెడ్యూల్ ఇదే..
ఈ వన్డే టూర్ ప్యాకేజీలో భాగంగా ముందుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన, పురాతన క్షేత్రం కోరుకొండ స్వయం భూ శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత రత్నగిరి కొండపై వెలసిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయానికి బయలుదేరుతారు. అక్కడి నుండి మీ ప్రయాణం పాదగయ తీర్థంగా పేరొందిన పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయానికి ఉంటుంది.
అక్కడ స్వామివారి దర్శనం అనంతరం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయానికి వెళతారు. అనంతరం అదే ఆలయంలో మధ్యాహ్నం అన్న ప్రసాదాలు తీసుకుంటారు.ఆ తర్వాత అక్కడి నుండి శైవ క్షేత్రం ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం కోనసీమ తిరుపతి, ఏడు శనివారాల వెంకన్న వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయాలను వీక్షిస్తారు. దీంతో ఈ వన్డే టూర్ప్యాకేజీ ముగుస్తోంది. అక్టోబర్ 26వ తేది నుంచి ఈ టూర్ బస్సులు పర్యాటకులకు అందుబాటులోకి వస్తాయి.



Click it and Unblock the Notifications












