సెప్టెంబర్ 11 నుంచి అరుణాచలేశ్వర ఆలయంలోకి మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించారు. భక్తులు తమ ఫోన్లను కేటాయించిన కౌంటర్లలో రూ.5 టోకెన్ రుసుము చెల్లించి జమ చేయాల్సి ఉంటుంది. అయితే గర్భిణులు, వయోవృద్ధులు, దివ్యాంగులు, వారికి సాయంగా వచ్చేవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు వరుస సెలవులు ఉండటంతో ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశముంది. కాబట్టి క్యూలైన్లు, దర్శన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోండి. అలాగే లగేజీ తక్కువగా తెచ్చుకోవడం, డిపాజిట్ల కోసం చిల్లర డబ్బులు దగ్గర ఉంచుకోవడం మంచిది.
ప్రస్తుతం ఆలయం వద్ద ఐదు డిపాజిట్ కౌంటర్లు నడుస్తున్నాయి. తూర్పు రాజగోపురం వద్ద రెండు, అమ్మణి అమ్మన్ గోపురం వద్ద రెండు, తిరుమంజన గోపురం వద్ద ఒకటి ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఫోన్లను తిరిగి తీసుకోవడానికి దాదాపు రెండు గంటల వరకు సమయం పట్టింది. దీంతో సిబ్బంది సంఖ్యను పెంచుతున్నారు. రూ.5 రుసుముపై కూడా సమీక్ష జరిపే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి వచ్చే భక్తులు దర్శనం తర్వాత కలవడానికి ఏదైనా ఒక కౌంటర్ను పాయింట్గా ముందుగానే అనుకోవడం మంచిది. లేదంటే గందరగోళం ఏర్పడే ప్రమాదముంది.

అరుణాచలేశ్వర ఆలయంలో మొబైల్ ఫోన్లపై నిషేధం
ఆలయంలో ఉదయం 5:30 నుంచి రాత్రి 8:00 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. వారంతాల్లో రాత్రి 7:30 గంటలకే ఎంట్రీ నిలిపివేస్తారు. ఉదయం 8:00 గంటల పూజ కంటే ముందు లేదా సాయంత్రం 6:00 గంటల పూజ తర్వాత దర్శనానికి వెళ్తే రద్దీ తక్కువగా ఉంటుంది. ఈ వీకెండ్లో పౌర్ణమి గిరిప్రదక్షిణ లేదు, తదుపరి పౌర్ణమి సెప్టెంబర్ 26 శనివారం నాడు ఉంది. అయినప్పటికీ వరుస సెలవుల వల్ల భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఆలయం తెరిచిన తొలి గంటలోనే దర్శనానికి చేరుకోవడానికి ప్రయత్నించండి.
ఈ వీకెండ్ తిరువణ్ణామలై దర్శనం వేళలు ఇవే..
ఉత్సవాలు జరిగే సమయంలో మాడ వీధుల్లోకి వాహనాలకు అనుమతి ఉండదు. రోడ్డు పక్కన బండ్లు నిలిపేయకుండా, కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలనే ఉపయోగించండి. తిరుమంజన గోపురం వెస్ట్, తిరువూడల్ స్ట్రీట్ సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలాల వివరాలు అధికారిక మ్యాప్లలో ఉన్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు పార్కింగ్ ఏరియా నుంచి తూర్పు రాజగోపురం ప్రవేశ మార్గం వరకు నడిచి వెళ్లడమే నయం. పార్కింగ్ ఫీజుల పేరిట మోసం చేసే అనధికార ప్రైవేట్ వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
చెన్నై, బెంగళూరు నుంచి తిరువణ్ణామలైకి వేగవంతమైన మార్గాలు
చెన్నై నుంచి తిరువణ్ణామలై దాదాపు 190-195 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైవేపై కార్లో వెళ్తే సుమారు 4 గంటలు పడుతుంది. నగర ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఉదయం 5:30 నుంచి 6:00 గంటల మధ్య బయలుదేరడం మంచిది. చెన్నై కిలాంబాక్కమ్ (KCBT) ప్లాట్ఫారమ్ 7 నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు నుంచి హోసూర్-కృష్ణగిరి-చెంగమ్ మీదుగా NH44-NH77 రూట్లో వెళ్తే 4.5 నుంచి 5.5 గంటల సమయం పడుతుంది. ఇందుకోసం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు జర్నీ స్టార్ట్ చేయండి. వేలూరు నుంచి కూడా తరచూ బస్సులు, రోజుకు మూడు రైళ్లు ఉన్నాయి.
హైదరాబాద్, విజయవాడ భక్తులకు మార్గాలు, వసతి, జాగ్రత్తలు
హైదరాబాద్ లేదా విజయవాడ నుంచి వచ్చే భక్తులకు రాత్రిపూట కాట్పాడి వరకు రైలులో వచ్చి, అక్కడ నుంచి తిరువణ్ణామలై ప్యాసింజర్ లేదా బస్సు ఎక్కడమే సులువైన మార్గం. కాట్పాడి నుంచి రోజూ అనేక సర్వీసులు ఉంటాయి. ఇక వసతి విషయానికి వస్తే శ్రీ రమణాశ్రమంలో సాధారణ గదులు లభిస్తాయి. బైపాస్ రోడ్డులోని బడ్జెట్ హోటళ్లలోనూ రూమ్లు దొరికే అవకాశముంది. చెప్పులను స్టాండ్లలోనే ఉంచాలి, ఆలయం వద్ద సెక్యూరిటీ చెకింగ్స్ ఉంటాయని గుర్తుంచుకోండి.
మొత్తానికి ఈ వీకెండ్ ప్రశాంతమైన దర్శనం కోసం ఇవి పాటించండి: ఫోన్లను అధికారిక కౌంటర్లలో డిపాజిట్ చేయండి, వేకువజామున లేదా సూర్యాస్తమయం తర్వాత దర్శనానికి ప్లాన్ చేసుకోండి, కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయండి. గిరిప్రదక్షిణ చేయాలనుకునే వారు సెప్టెంబర్ 26 శనివారం నాటికి ప్లాన్ చేసుకోవచ్చు. చెన్నై లేదా బెంగళూరు నుంచి డ్రైవింగ్ చేసేవారు తెల్లవారుజామునే పయనమై, లాకర్లు, ఆటోల కోసం చిన్న నోట్లు (చిల్లర) దగ్గర ఉంచుకోవడం ముఖ్యం. సరైన సమయానికి వెళ్తే అరుణాచలేశ్వరుని దివ్య దర్శనం సులభంగా లభిస్తుంది.



Click it and Unblock the Notifications











