ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బ్రిటీష్ కాలంనాటి వంతెనపై నేడు పర్యాటక శోభ సంతరించుకోనుంది. శతాబ్ద కాలంగా కొవ్వూరు-రాజమహేంద్రవరం మధ్య గోదావరి నదిపై నిర్విరామంగా తన సేవలను అందించిన హేవలాక్ వంతెన ఇప్పుడు పర్యాటక సందర్శనీయ ప్రాంతంగా రూపుదిద్దుకోనుంది. రాష్ట్రంలో కొలువుదీరిన నూతన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఆలోచనలు కార్యరూపం దాల్చితే మాత్రం రాష్ట్రానికే హేవలాక్ వంతెన పర్యాటక మణిహారంగా మారుతుందనడంలో సందేహమే లేదు.
కొవ్వూరు-రాజమహేంద్రవరం మధ్య గోదావరి నదిపై ఉన్న హేవలాక్ వంతెన అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. నిజానికి, 2015 పుష్కరాలకు ముందే ఈ వంతెనను పర్యాటక శాఖ ద్వారా కాలిబాట వారధిగా, మధ్యలో వాణిజ్య సముదాయంగా తీర్చిదిద్ది, టూరిస్ట్ హాట్స్పాట్గా మార్చేందుకు ప్రణాళికలు వేశారు. అప్పటి పర్యాటక మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈపీసీ విధానంలో ఈ ప్రాజెక్టుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
ఈ నిర్ణయం పట్ల ఉభయ గోదావరి జిల్లాల ప్రజలతోపాటు పర్యాటక ప్రేమికులు సైతం హర్షం వ్యక్తం చేశారు. అప్పట్లోనే హేవలాక్ వంతెనను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.110 కోట్లతో ప్రణాళికలు వేశారు. పాదచారులతో పాటు యోగ, వ్యాయామం చేసుకునేలా, వంతెనపై సాయంత్రం నుంచి రాత్రి వరకు మార్కెట్, అఖండ గోదావరి ప్రాజెక్టులో లంకలను అనుసంధానం చేసి అతిథి భవనాలు నిర్మించాలని రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అడుగులు ముందుకు పడలేదు. దీంతో దశాబ్ద కాలంగా హేవలాక్ వంతెన ప్రణాళిక కలగానే మిగిలిపోవడం జరిగింది.

శతాబ్దకాలం సేవలందించి...
హేవలాక్ వంతెన నిర్మాణ పనులు 1887లో సర్ ఆర్థర్ కాటన్ పర్యవేక్షణలో ప్రారంభించారు. అలా మూడేళ్లకు అంటే, 1890 ఆగస్టు 30 నాటికి 2.95 కిలోమీటర్ల పొడవుతో 56 స్తంభాలతో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అప్పటి ఇంజినీర్ ఎఫ్.టి.జి.వాల్టన్ పనులను పర్యవేక్షించగా బ్రిటిష్ మేజర్ హేవలాక్ వంతెనగా పేరు పెట్టారు. ఈ వంతెన నిర్మాణానికి రూ.50,40,057 అంచనా వ్యయంగా నిర్ణయించారు. 1997 నాటికి వంతెన నిర్మించి వందేళ్లు పూర్తికావడంతో దీని మీదుగా అదే ఏడాది కొవ్వూరు-రాజమహేంద్రవరం మధ్య రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించారు.

పర్యాటక రంగానికి ఆదరణ...
తాజాగా రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడడంతో హేవలాక్ ఆధునికీకరణ, అభివృద్ధి దిశగా మళ్లీ అడుగులు పడుతున్నాయి. నిజానికి, వంతెనను నిరుపయోగంగా వదిలేయడంతో రైౖల్వే శాఖ ఇనుమును వేలం వేయాలని చేసిన ప్రయత్నాలను గోదావరి జిల్లా ప్రజలు వ్యతిరేకించారు. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేశారు. దీంతో, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో వంతెన రాష్ట్ర పర్యాటక శాఖ పరిధిలోకి తీసుకువచ్చారు.
అంతేకాదు, పురాణ ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక శోభ కొవ్వూరు, రాజమహేంద్రవరం సొంతమనే చెప్పాలి. అలాగే, గోదావరి పుష్కరాలంటే గుర్తొచ్చేది ఈ రెండు ప్రాంతాలేనని అందరికీ తెలుసు. పశ్చిమ, తూర్పు జిల్లాల సాంస్కృతిక, వ్యాపారాభివృద్ధితోపాటు పర్యాటక రంగానికి కూడా ఇక్కడ మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో వంతెన పర్యాటకంగా అభివృద్ధి చెందితే పర్యాటక ప్రేమికులు ఆనందానికి అవదులు ఉండవు.



Click it and Unblock the Notifications












