భక్తులకు గమనిక.. తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది...
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువై వుంది. సామాన్య భక్తులు మొదలు విఐపీలు, వివిఐపీలు, అసాధారణ భధ్రతా ప్రముఖులు స్వామి వారి ఆశీస్సులు పొందటానికి తిరుమల వస్తుంటారు. ఇక్కడ ఎటుచూసినా గోవిందుడి నామస్మరణే. ఈ ఏడుకొండలవాడి దర్శనం కోసం పరితపిస్తుంటారు భక్తులు. అయితే, తిరుమల శ్రీ వారిని దర్శించుకోవాలనుకునేవారికి ఓ గమనిక. తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది.
ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల వరకు పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఆలయాన్ని మూసివేయనున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. గ్రహణ సమయానికి ఆరుగంటల ముందే తలుపులు మూసివేయడం ఆనవాయితీ. అందుకే 28 న అంటే శనివార రాత్రి 7.05 గంటల నుంచి ఆలయ తలుపులు మూసి వేయనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు ఎనిమిది గంటలపాటు ఈ ఆలయ తలుపులు మూసి వేసి ఉంచుతారు.

చంద్రగ్రహణం కారణంగా దర్శనాలు రద్దు..
చంద్రగ్రహణం కారణంగా భక్తులు గమనించాల్సిన కొన్ని విషయాల గురించి టీటీడీ పేర్కొంది. చంద్రగ్రహణం కారణంగా 28న జరిగే సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాల్సిందిగా కోరింది. ఆలయంతో పాటు అన్న ప్రసాద వితరణ కేంద్రాలు కూడా మూతపడనున్నట్లు ఈ సందర్భంగా టీటీడి పేర్కొంది.
చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఇవన్నీ మళ్లీ అందుబాటులోకి వస్తాయి. ఇక, చంద్రగ్రహణ అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు అక్టోబరు 29న తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత మళ్లీ ఆలయ తలుపులు తెరవడం ప్రారంభవుతుంది.

వివిధ దేవాలయాల మూసివేత..
తిరుపతిలోని వివిధ ఆలయాలను కూడా ఆ రోజు మూసివేయడం జరుగుతుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 28న సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు మూసివేసి, తిరిగి అక్టోబరు 29న తెల్లవారుజామున 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరవడం జరుగుతుంది. శుద్ధి అనంతరం ఉదయం ఏడు గంటల నుండి భక్తులు దర్శనం చేసుకునేలా వీలు కల్పిస్తారు.
ఈ ఆలయంతో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను కూడా అక్టోబరు 28న రాత్రి ఏడు గంటలకు ఆలయ తలుపులు మూసివేయడం జరుగుతుంది. తిరిగి అక్టోబరు 29న తెల్లవారుజామున 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం భక్తులకు దర్శన అవకాశం ఉంటుంది. గ్రహణం కారణంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పౌర్ణమి అష్టోత్తర శతకలశాభిషేకం, శ్రీనివాసమంగాపురంలో పౌర్ణమి గరుడసేవను కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు..

అన్నాభిషేకం కార్యక్రమం..
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 28న అన్నాభిషేకం కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగానే ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం చేసే అవకాశం కల్పిస్తారు. తిరిగి మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపట్టి భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది.
శుద్ధి అనంతరం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ తలుపులు మూసి వేసి, అక్టోబరు 29న ఉదయం 4 గంటలకు ఆలయ తలుపులు తెరవడం జరుగుతుంది. ఇక, శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం చేసుకునేలా వీలు కల్పిస్తారు.



Click it and Unblock the Notifications













