బెజవాడ అందాలను గాంధీ హిల్ పైనుంచి చూడాల్సిందే!
నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో నగరవాసికి ఆహ్లదం కరువవుతోంది. కాలుష్యానికి దూరంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో సేదదీరేందుకు అనువైన ప్రదేశాల కోసం ఆన్వేషిస్తున్నారు. అలాంటివారికి ఆహ్వానం పలుకుతోంది విజయవాడలోని గాంధీ హిల్. నగరవాసులేకాదు.. దీని చరిత్ర తెలిసివారు ఎవ్వరైనా వారాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ వాలిపోవాల్సిందే. విజయవాడ నగర విహంగ వీక్షణాన్ని తలపించే అనుభూతి చేరువ చేసే గాంధీ హిల్ విశేషాలు తెలుసుకుందాం.
పెరుగుతోన్న కాలుష్యంతోపాటు మారుతున్న జీవన విధానం, పని ఒత్తిడిలో నిత్యం సతమతమవుతున్నారు నగరవాసులు. సాయంకాలం వేళల్లోనో.. లేక సెలవు రోజుల్లోనో కాస్త పిల్లలతో కలసి సరదాగా గడిపేందుకు గాంధీ హిల్ వేదిక అనే చెప్పాలి. బెజవాడ రైల్వే స్టేషన్, చిట్టినగర్, కాళేశ్వరరావుమార్కెట్, గాంధీనగర్కు దగ్గరగా ఉన్నందున ఆ ప్రాంతాలవారు ఎక్కువ మంది గాంధీ హిల్కు క్యూ కడుతున్నారు. పచ్చదనం పరచిన ఇక్కడి ప్రకృతి అందాలు సందర్శకుల మనసు దోచేస్తాయనే చెప్పాలి.
ఓర్ కొండ.. గాంధీ హిల్గా మారింది..
అంతేకాదు.. నిజానికి, గాంధీ హిల్ చారిత్రక నేపథ్యం తెలిసినవారు ఎవ్వరైనా విజయవాడ నగరానికి వస్తే తప్పకుండా చూడాల్సిన ప్రదేశంగా దీనిని భావిస్తారు. స్వరాజ్య నిధి సేకరణ కోసం దేశ పర్యటనకు శ్రీకారం చుట్టిన మహాత్మా గాంధీ బెజవాడలో తొలిసారిగా అడుగెడిన ప్రదేశంగా.. ఉద్యమ స్పూర్తిని రగిలించిన ప్రాంతమిది.. అందుకే అప్పటినుంచి గాంధీ హిల్గా ప్రసిద్ధి చెందింది. మహాత్ముడు నడియాడిన నేలను సందర్శించం అంటే జీవితంలో మర్చిపోలేని అనుభూతే కదా! అలనాటి పోరాట పఠిమకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ గాంధీ హిల్. 1852లో కృష్ణానదిపై తొలి బ్యారేజీని నిర్మించిన కెప్టెన్ చార్లెస్ ఓర్ ఈ కొండపై నుండే ఆనకట్ట నిర్మాణాన్ని పర్యవేక్షించేవాడు.
అప్పటి నుండి ఈ కొండకు ఓర్ కొండ అనే పేరు వచ్చింది. ఆ ఆనకట్ట వందేళ్ళ తరువాత 1952లో వచ్చిన వరదల్లో కొట్టుకొనిపోగా, దానికి కొద్దిగా ఎగువన ప్రస్తుతమున్న ప్రకాశం బ్యారేజీని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. గాంధీ స్మారక సంస్థ దేశంలో నెలకొల్పదలచిన 6 శాశ్వత స్మారక కేంద్రాల్లో విజయవాడను ఒకటిగా ఎంపిక చేసింది. అప్పట్లో ఓర్ కొండగా పిలిచే ఈ కొండను స్మారక కేంద్ర స్థలంగా ఎంపిక చేసారు. అప్పటి నుండి దీనికి గాంధీ హిల్ అనే పేరు వచ్చింది.
మాటల్లో వర్ణించలేని సుందర దృశ్యం..
విజయవాడ నగర అందాలు కొండపై నుంచి చూసినవారు ఎవ్వరైనా మంత్రముగ్దులు కావాల్సిందే. చిన్న చిన్న పిచ్చుకగూళ్ల మాదిరిగా కనిపించే ఆ సుందర దృశ్యాన్ని మాటల్లో వర్ణించడం కాస్త కష్టమే. అందుకే, ఆ అద్బుత అనుభూతి పొందేందుకు పర్యాటకులు ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. సముద్రమట్టానికి దాదాపు ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండ ప్రాంతం నగర వాసులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొండపైన 52 అడుగుల గాంధీ స్థూపం, పిల్లలు ఆడుకునేందుకు చిన్న ఉధ్యాన వనం, నగర అందాలను చూసేందుకు ఏర్పాటు చేసిన చిన్నపాటి రైలు ఇక్కడికి వచ్చేవారిని తిరుగు ప్రయాణం కాకుండా కట్టిపడేస్తాయి.
ఇక్కడున్న మహాత్మాగాంధీ మెమోరియల్ లైబ్రరీలో గాంధీజీ జీవిన ప్రయాణాన్ని కళ్లకుకట్టినట్లు చూపిస్తారు. ఒక వీడియో, ఆడియో రూప ప్రదర్శన, మరియు ఒక ప్లానెటోరియం కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. మరీ ముఖ్యంగా సాయంత్రపు సమయంలో సరదాగా గడిపేందుకు కుటుంబసభ్యులతో వచ్చేవారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది.