శ్రీరామనవమి మహోత్సవానికి భద్రాచలం సిద్ధమైంది
హిందువులందరూ కలిసికట్టుగా ఎంతో అంగరంగ వైభవం గా జరుపుకునే పండుగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ఎక్కడ చూసిన శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. సీతారాములుకు పెళ్లి చేసి ఎంతో సంబరపడి పోతూ ఉంటారు ప్రతి ఒక్కరు. శ్రీరామ నవమి వేడుకలు అటు భద్రాచలంలో కన్నులపండుగగా జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను చూసేందుకు భద్రాచలం తరలి వెళుతుంటారు. ఆ విశేషాలను తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి అనగానే మనకు ముందు గర్తొచ్చే పుణ్య క్షేత్రం తెలంగాణలోని భద్రాచలం. ఇక్కడ శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతారు. స్థలపురాణం ప్రకారం రాములవారు సీతమ్మను వెతుక్కుంటూ ఇక్కడ భద్ర అనే మహర్షిని కలుసుకున్నారని పూర్వీకులు చెబుతుంటారు. శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలంలో రాములవారి ఆలయం వెలుగులు జిమ్ముతూ.. విద్యుత్ దీపాల మధ్య భద్రాద్రి ఆలయం మెరిసిపోతోంది. భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల ఎదుర్కోలు ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు.

కలియుగ వైకుంఠం భద్రాచలం
ఈ ఏడాది భద్రాచలం శ్రీరామ మందిరంలో మార్చి 22వ తేది నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సన్నిధిలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కలియుగ వైకుంఠం భద్రాచలంలో రామయ్య కళ్యాణోత్సవానికి మార్చి 22వ తేది నుంచి ఏప్రిల్ 5వ తేది వరకూ శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలను వైభవంగా ఆలయ అధికారులు నిర్వహించనున్నారు. పురాతన హిందూ కాలమానం ప్రకారం చైత్ర శుద్ధ నవమినాడు శ్రీరాముడి వివాహం జరిగిందనీ, ఆ రోజే ఆయన పట్టాభిషేకం జరిగిందని పలు గ్రంథాలు పేర్కొంటున్నాయి.

పెళ్లికి ముహూర్తం ఖరారు..
శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. చిత్ర శుద్ధ నవమి రోజున కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చిందని కూడా పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. మానవ రూపంలో ఆ భగవంతుడు వెలసిన ఈరోజున రాముడిని భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే, ఈ రోజు సీతారాముల కళ్యాణం సైతం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే శ్రీరామ నవమిని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
మార్చి 22న ఉగాది పండగను పురస్కరించుకుని నూతన పంచాంగ శ్రవణం ఆలయంలో నిర్వహించనున్నారు. భద్రాచల రామయ్య పెండ్లికి మార్చి 30వ తేదిన ముహూర్తం ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 5వ తేది వరకూ శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలను వేడుకగా జరిపేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

కళ్యాణ తలంబ్రాల ప్రత్యేకత..
సీతారాముల కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుకను, వసంతోత్సవాన్ని, డోలోత్సవాన్ని ఘనం జరిపేందుకు ఆలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. సీతారాముల కళ్యాణానికి 150 క్వింటాళ్లకు పైగా బియ్యం, ఒక క్వింటాకు పైగా ముత్యాలతో తలంబ్రాలను సిద్ధం చేశారు. పండితుల వేద మంత్రాల నడుమ సీతారామచంద్రుల వివాహం వైభవోపేతంగా జరుపుతారు.
ఆ తర్వాత వరుడు తరఫున ఒకరు, వధువు తరఫున మరొకరు పండితులు ముత్యాల తలంబ్రాలు తీసుకుని సీతారాముల శిరస్సుపై పోస్తారు. చరిత్రను కాపాడే లక్ష్యంతో ఐదు రకాల ద్రవ్యాలతో ఈ తలంబ్రాలు తయారు చేస్తారు. ఇందులో బియ్యం, ఆవునెయ్యి, పసుపు, కుంకుమ, గులాం పౌడరులతో కూడిన ద్రవ్యాలను తలంబ్రాలకు ఉపయోగిస్తారు. ఉత్సవాలు, కళ్యాణం, పట్టాభిషేకానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.



Click it and Unblock the Notifications












