ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చార్ ధామ్ యాత్రకు మళ్లీ విఘాతం ఏర్పడింది. ఈ రోజు (సెప్టెంబర్ 6) ఉదయం గంగోత్రి, యమునోత్రి జాతీయ రహదారులపై కొత్తగా కొండచరియలు విరిగిపడటంతో మార్గాలు మూతపడ్డాయి. వాతావరణ శాఖ (IMD) సెప్టెంబర్ 6 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా రోడ్లను అధికారులు మూసివేశారు. దీంతో భక్తుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్న తర్వాతే ప్రయాణ ప్రణాళిక వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
యమునోత్రి మార్గంలో సిలై బెండ్, పాలిగాడ్, శ్యానాచట్టి, హనుమాన్ చట్టి, జంగిల్ చట్టి, రాణాచట్టి, ఝార్ఝార్ గాడ్ ప్రాంతాల్లో రవాణా దారుణంగా నిలిచిపోయింది. గంగోత్రి మార్గంలో నలుపానీ-భట్వాడీ ప్రాంతాల్లో వెంటవెంటే రోడ్లు మూసివేస్తున్నారు. శనివారం బద్రీనాథ్ వైపు పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, అక్కడ కూడా వాతావరణంపైనే ప్రయాణం ఆధారపడి ఉంది. రోడ్ల పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ, అకస్మాత్తుగా రాకపోకలు నిలిపివేయడం, చెక్పోస్టుల వద్ద కఠిన ఆంక్షలు విధించడం చేస్తున్నారు.

చార్ ధామ్ యాత్ర: సురక్షిత ప్రత్యామ్నాయ మార్గాలు.. ప్రమాదకర ప్రాంతాలు ఇవే!
కేదార్నాథ్ వెళ్లే భక్తులు ఉత్తరకాశీలోని ప్రమాదకర ప్రాంతాల వైపు కాకుండా హరిద్వార్-రిషికేష్-దేవప్రయాగ్-శ్రీనగర్-రుద్రప్రయాగ్-ఉఖిమత్-గుప్తకాశీ మార్గాన్ని ఎంచుకోవడం మంచిది. అధికారులు దారి తెరిచేవరకు ఇటే ప్రయాణించండి. ఇక నలుపానీ, సిలై బెండ్ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. పిడబ్ల్యూడీ (PWD) లేదా బిఆర్ఓ (BRO) క్లియరెన్స్ ఇచ్చాకే ఆ మార్గాల్లో ముందుకు వెళ్లండి. ఉత్తరకాశీ యంత్రాంగం రాత్రి ప్రయాణాలపై ఆంక్షలు, నడక దారుల్లో సమయ పరిమితులు విధించింది. జరిమానాలు, ఇబ్బందులు తప్పించుకోవడానికి ఈ నిబంధనలను తప్పక పాటించండి.
సెప్టెంబర్ 6-9 వరకు వాతావరణ హెచ్చరికలు: రహదారుల పునరుద్ధరణ ఎప్పుడు?
వాతావరణ శాఖ ఈ రోజు ఉదయం 4 నుంచి 7 గంటల మధ్య విడుదల చేసిన హెచ్చరికల ప్రకారం.. ఉత్తరకాశీ-గంగోత్రి, బార్కోట్-యమునోత్రి మార్గాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9 వరకు ఎల్లో అలర్ట్ అమలులో ఉన్నందున, మధ్యాహ్నం వేళల్లో వర్షం తగ్గినప్పుడు మాత్రమే రోడ్లపై పడిన మట్టి, రాళ్లను తొలగించే అవకాశం ఉంటుంది. అయితే మళ్లీ వర్షం పడితే కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వారం యాత్రకు వెళ్లేవారు తమ ప్లాన్లో అదనంగా కొన్ని రోజులు కేటాయించుకోవడం శ్రేయస్కరం.
దర్శనాల తాజా సమాచారం, క్యూ లైన్ల నియంత్రణ, ఆలయ వేళలు
దేవస్థానం బోర్డు డాష్బోర్డ్ ప్రకారం యాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. రోడ్లు తెరుచుకోవడంపై ఆధారపడి సెప్టెంబర్ 7 నుంచి ముందస్తు పూజల బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. కేదార్నాథ్ హెలికాప్టర్ టికెట్లు కేవలం అధికారిక IRCTC హెలిప్యాడ్ పోర్టల్లోనే లభిస్తాయి. రాకపోకలు పునరుద్ధరించిన తర్వాత భక్తుల రద్దీని బట్టి క్యూలైన్లను నియంత్రిస్తారు. అలాగే నడక ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తారు. బయలుదేరేముందు 'టూరిస్ట్ కేర్ పోర్టల్'లో వివరాలు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు.
IRCTC, ఆర్టీసీ, హోటల్ బుకింగ్స్ క్యాన్సిలేషన్: రీఫండ్ ఎలా పొందాలి?
రైళ్లు: రైలు రద్దయితే ఈ-టికెట్ల డబ్బులు IRCTC ఆటోమేటిక్గా రీఫండ్ చేస్తుంది. ఒకవేళ రైలు నడుస్తుంటే, చార్ట్ సిద్ధం చేయడానికి ముందే క్యాన్సిల్ చేసుకోవాలి లేదంటే TDR (టికెట్ డిపాజిట్ రిసీప్ట్) ఫైల్ చేయాల్సి ఉంటుంది. IRCTC టూర్ ప్యాకేజీల విషయంలో ప్రతికూల వాతావరణాన్ని అత్యవసర పరిస్థితిగా (ఫైర్మేజర్) పరిగణిస్తారు. అందువల్ల మీరు వినియోగించుకోని సేవలకు మాత్రమే రీఫండ్ లభిస్తుంది. ఉత్తరాఖండ్ ఆర్టీసీ (UTC) బస్సు టికెట్లను StarBus/Pathik యాప్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఆ డబ్బులు పాత ఖాతాకే జమవుతాయి. GMVN బుకింగ్లను వోచర్తో పాటు ఈమెయిల్ ద్వారా క్యాన్సిల్ చేయాలి. మీ PNR నంబర్లు, రశీదులు, ఎస్ఎమ్ఎస్ అలర్ట్లను భద్రంగా ఉంచుకోండి.
లైవ్ అప్డేట్స్, ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నంబర్లు ఇవే!
క్షేత్రస్థాయి సమాచారం కోసం అత్యవసర నంబర్లు: రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ - 1070 లేదా 0135-2710334; టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ - 1364 లేదా 0135-3520100. IMD చార్ ధామ్ వెదర్ నౌకాస్ట్, జిల్లాల హెచ్చరికలు, BKTC సూచనలు, ఉత్తరకాశీ యాత్ర కంట్రోల్ రూమ్ నోటీసులను నిరంతరం పరిశీలిస్తూ ఉండండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులు ఎలాంటి అయోమయం లేకుండా సురక్షితంగా ప్రయాణించేందుకు రైలు, హోటల్స్, ప్రయాణ వసతులతో కూడిన IRCTC ప్యాకేజీలను ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.



Click it and Unblock the Notifications











