అద్భుత కళాఖండాల నిర్మాణం.. కనపర్తి సొంతం..!
సాధారణంగా సెలవులు దొరికితే చాలు. ఎవరైనా ఏ ప్రదేశానికైనా వెళ్లి ప్రశాంతంగా గడపాలనుకుంటారు. ఇక, వర్షాకాలంలో అయితే చెప్పక్కర్లేదు. పచ్చని ప్రకృతి అందాల నడుమ సేదతీరాలనుకుంటారు. దానికోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసి పార్క్లకు బీచ్లకు వెళ్లడం చేస్తుంటారు. అయితే ఆ బీచ్లకు సమీపంలోనే, గుళ్లూ, చారిత్రక స్థలాలు కూడా ఉంటే ఎలా వుంటుంది? ప్రకృతి ఆహ్లాదంతో పాటు... ఆధ్యాత్మిక అనుభూతి కూడా పర్యాటకుల సొంతమవుతుంది కదూ! మరి అలాంటి ప్రదేశానికి వెళ్లాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదండి.
మన ఆంధ్రప్రదేశ్లోనే అటువంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ఒంగోలు జిల్లాలోని కనపర్తి. శాతవాహనుల కాలంలో ఎంతో పేరుగాంచించింది ఈప్రాంతం. ఇక్కడ అనేక పురాతన దేవాలయాలతో పాటు, అందమైన బీచ్లు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. విశిష్టతను సంతరించుకున్న ధారాలింగం, ఒక పురవాస్తు శాల వంటి ప్రాంతాలెన్నో ఇక్కడున్నాయి. మరెందుకాలస్యం ఆధ్యాత్మికతకు, విజ్ఞానానికి నెలవైన ఆ ప్రాంతాన్ని చుట్టేద్దాం..

కనపర్తి చరిత్ర..
శాతవాహన పాలకులు పరిపాలించిన కనపర్తిలో ఈనాటికీ అనేక బౌద్ధస్తూపాలు, శిల్పాలు దర్శనమిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో వెలసిన కనపర్తి క్రీస్తుపూర్వం నుంచి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకూ విజయనగర రాజుల ఆధీనంలోఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతం పవిత్ర పుణ్యక్షేత్రంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ప్రాచీన చరిత్రకు నిదర్శనంగా అక్కడి పురాతన విగ్రహాలు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. వివిధ ఆకృతుల్లో కనిపించే నంది, విఘ్నేశ్వర, దుర్గాదేవి విగ్రహాలు.. నాగబంధాలు, బిక్షాటన చేస్తున్నట్లుగా ఉండే భైరవుడు, నాగ భైరవుడు, లింగోద్భవమూర్తి, పరశురాముడు, సూర్య విగ్రహం, సరస్వతీ ప్రతిమ, ధారాలింగం, సప్తమాతృకలు మొదలైన అద్భుత కళాఖండాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా మనకు దర్శనమిస్తుంటాయి.

అబ్బురపరిచే బీచ్ అందాలు..
కనపర్తిలో ఎన్నో అబ్బురపరిచే బీచ్ అందాలు మరుగునపడి ఉన్నాయి. ఇక్కడి సముద్రతీరం మిగిలిన తీరాలకు భిన్నంగా ఫ్లాట్గా ఉంటుంది. దానికి కారణం ప్రాచీన కాలంలో బ్రహ్మకమండలినిగా పిలువబడి నేడు గుండ్లకమ్మగా ప్రాచుర్యంలో ఉన్న నది సాగరంలో సంగమించే పవిత్ర క్షేత్రం ఉంది. ఈ నదీసాగర సంగమ ప్రాంతంలో అద్భుతమైన ఐలాండ్ ఏర్పడింది... ఈ ఐలాండ్లో ఎక్కడి నుంచో వస్తున్న విదేశీపక్షులు సందడి చేస్తుంటాయి. కనపర్తి తీరంలో మాత్రం ఒయ్యారాలు ఒలకబోస్తున్నట్లుండే సముద్ర తీరపు ఒంపుసొంపులను దగ్గరి నుంచే చూడొచ్చు. ప్రాచీన వారసత్వ సంపదతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా కనపర్తి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక కనపర్తి గ్రామంలోని శైవ, వైష్ణవ ఆలయాలు ఆనాటి ప్రజల జీవన చిత్రాన్ని కళ్లకు కట్టేటట్లుగా ఉన్నాయి.

ఎలా చేరుకోవాలంటే..
ఒంగోలు నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనున్న కనపర్తికి చేరుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి బస్సులు అందుబాటులో కలవు. ఇక కనపర్తికి చేరుకోవాలంటే మాత్రం ఒంగోలు డిపోనుంచి ఉదయం ఐదు గంటలనుంచే ప్రతి రెండు గంటలకు ఒకసారి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. కనపర్తిలో మ్యూజియం, శివాలయం, సీతారామచంద్రుల ఆలయాలు కూడా దర్శనీయ స్థలాలే. మ్యూజియంలో ఎల్లప్పుడూ గైడ్ అందుబాటులో ఉంటారు. అక్కడి నుంచి సముద్ర తీరానికి చేరుకోవాలంటే మ్యూజియం నిర్వాహకులే వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రైవేటు వాహనాలలో కూడా కనపర్తి సముద్ర తీరానికి చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications













