మూడువందల రూపాయలతో తిరుమల శ్రీవారి దర్శనం..!
భారతదేశంలో కెల్లా అత్యంత ధనిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం తిరుమల తిరుపతి దేవస్థానం అని మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన తిరుపతికి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి టూరిస్టులు నిత్యం అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. తిరుమల కొండపై కొలువైన శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు పరిసర ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తారు.
ఏడు కొండలపై ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన తిరుమల క్షేత్రం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు పర్యాటకంగానూ ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఏడాది పొడవునా నిత్యం పూజలతో, ఆరాధనలతో శ్రీవారి ఆలయం పండుగలా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పవిత్రతతో, సంపదతో కూడిన దేవాలయంగా శ్రీవారి ఆలయం ప్రసిద్ధిగాంచింది. సాధారణ రోజుల్లో ప్రతి రోజూ కనీసం 50 వేల మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.

నిత్యం రద్దీనే..
తిరుమల కొండపై నిత్యం రద్దీగా ఉంటుంది. కొన్నికొన్నిసార్లు భక్తుల సంఖ్యను బట్టి స్వామి వారి దర్శనానికి రోజుల కొద్ది సమయం పడుతుంది. అందుకే అత్యవసర పనులు ఉండేవారికోసం అర్జిత సేవలను ప్రవేశపెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. సామాన్య భక్తులకు అందుబాటులో ఉన్న అర్జిత సేవ రూ. 300 ప్రత్యేక దర్శనం. దీని ద్వారా స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఈ టిక్కెట్లు అంత త్వరగా లభించవు. ఆన్లైన్లో విడుదల చేసిన తర్వాత కేవలం పదిహేను నిమిషాల్లోనే బుకింగ్ ముగిసిపోతుంది. ఇంతకీ ఈ టిక్కట్లు ఎలా బుక్చేసుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం.
ప్రతినెలా చివరి వారంలో..
తిరుమల తిరుపతి దేవస్థానం జారీచేసే ప్రత్యేక దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు టిటిడి అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ టిక్కెట్లు సాధారణంగా ప్రతి నెలా చివరి వారంలో విడుదల చేస్తారు. 24, 25 తేదీల్లో విడుదల చేస్తుంటారు. టీటీడీ యాప్, వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నకిలీ వెబ్సైట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నంబెర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో స్లాట్ బుక్చేసుకోవాల్సి ఉంటుంది.

ఏ నెలలో ఎన్ని రోజుల వరకు దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. ఆకుపచ్చ రంగుల్లో ఉన్న తేదీలు టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని అర్థం. ఎరుపు రంగు తేదిలు గనుక ఉంటే టిక్కెట్లు అయిపోయాయని అర్థం. అదే పసుపు రంగులో ఉంటే మాత్రం వేగంగా అయిపోతున్నాయని అర్థం. ఇక, నీలరంగులో ఉంటే గనుక, అసలు ఆ రోజు టిక్కెట్లు విడుదల చేయలేదని అర్థం.
ఎంత సమయం పడుతుంది.
ఏ రోజున దర్శనం టిక్కెట్లు కావాలనుకుంటున్నామో ఆ రోజును క్లిక్ చేసి ఎన్ని టికెట్లు కావాలో ఎంటర్ చేయాలి. కన్పామ్ చేసుకోవడానికి క్యూలో ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఓ పది నిమిసాల సమయం పడుతుంది. ఇదే సైట్లో గదులు కూడా పొందొచ్చు. ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్లి Accommodation లోకి వెళ్లిన తర్వాత పేరు, లింగం, వయస్సు, ఫొటో, ఐడి ఫ్రూప్, ఐడి కార్డ్ నెంబర్ మొదలైన సమాచారాన్ని ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్లైన్ చెల్లింపుల ద్వారా అడిగిన అమౌంట్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతే, టిటిడి దర్శన టిక్కెట్ లేదా వసతి బుక్ అవుతుంది.



Click it and Unblock the Notifications













