రేపు (అక్టోబర్ 2) గాంధీ జయంతి. భారత జాతిపిత మహాత్మ గాంధీ పుట్టినరోజు. మహాత్ముడు అహింసావాది. స్వాతంత్ర్యోద్యమ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన గాంధీజీనీ అందరూ భగవంతునిగా కొలుస్తుంటారు. కొలవడమే కాదండోయ్ ఆయన కోసం ప్రత్యేకంగా దేవాలయాలను కూడా కట్టించారు. భారత్లో ప్రసిద్ధిచెందిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ, మహాత్మాగాంధీజీ దేవాలయాలు ఉన్నాయని మీకు తెలుసా..? అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దేశంలో ఉన్న బాపు దేవాలయాల గురించి ఓసారి తెలుసుకుందాం పదండి.
భారత జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. 1869 అక్టోబరు 2వ తేదిన జన్మించారు. స్వాతంత్ర్యం కోసం మహాత్మ గాంధీ బంగారు బాటలు వేశారు. తెల్లదొరల పాలన నుంచి మనల్ని విముక్తి చేసేందుకు ఆయన శాంతియుత పోరాటం చేశారు. అందుకే బాపును చాలామంది భగవంతుడిగా చూస్తుంటారు. అందుకు నిదర్శనమే భారతదేశంలోని బాపు ఆలయాలు..
భతారాలోని గాంధీ దేవాలయం..
భారతదేశంలో బాపుకి అంకితం చేసిన మొదటి ఆలయం ఇదే. ఈ ఆలయం ఒడిషాలో ఉంది. ఈ ఆలయంలో వెలసిన గాంధీ విగ్రహానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ ఆలయంలో ఆరు అడుగుల ఎత్తున్న గాంధీ విగ్రహం ఉంది. దానిని రాగితో తయారు చేసి ప్రతిష్టించారు. ఈ విగ్రహం రాష్ట్రంలోని సంబల్పూర్ జిల్లాలోని భతారా గ్రామంలో వెలసింది. ఈ ఆలయపు గర్భ గుడిలో బాపు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ పై భాగంలో మూడురంగుల మువ్వన్నెల జెండాను ఉంచారు. ఇక్కడి ఆలయ గోడలు కూడా ఎంతో ప్రత్యేకం.

ఎందుకంటే, ఇక్కడి గోడలపై ఎంతో మంది పోరాట యోధుల చిత్రాలు ఉన్నాయి. మహాత్ముని ఈ ఆలయాన్ని ప్రముఖ గాంధేయవాది అభిమన్యు నిర్మించినట్లు తెలుస్తోంది. 1974లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం లోపలి భాగాన్ని స్థానిక కళాకారుడు తృప్తభూషణ్ దాస్గుప్తా డిజైన్ చేశారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని గంజాంలోని ఖల్లికోటే ఆర్ట్ కళాశాలకు చెందిన ఓ కళాకారుడు చెక్కినట్లు సమాచారం.
కీర్తి మందిర్, పోర్బందర్..
దేశంలోని మరో ప్రసిద్ధిచెందిన బాపు ఆలయం.. కీర్తి మందిర్. ఇది గుజరాత్లోని పోర్బందర్లో ఉంటుంది. ఈ ఆలయం మోహన్దాస్ కరంచంద్ గాంధీ, కస్తూర్బా గాంధీ జ్ఞాపకార్థం స్థాపించబడిన ఒక స్మారక మందిరమని చెప్పుకోవాలి. మహాత్ముని కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇల్లు, కీర్తి మందిర్ పక్కనే వెలసింది. ఈ ఆలయంలో ఒక విశాలమైన ప్రాంగణం కూడా ఉంది. అందులో బాపూజీ జీవిత ప్రయాణాన్ని చిత్రించే ఫోటో ఎగ్జిబిట్ కూడా ఉంటుంది. గాంధీజి, కస్తూర్బాగాంధీతో పాటు కలిసి కొంతకాలం ఈ ఇంట్లోనే ఉన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ మందిరాన్ని సందర్శించేందుకు దేశంలోని అన్నీ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.

మంగళూరు
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో బాపు దేవాలయం వెలసింది. ఈ ఆలయాన్ని 1948లో నిర్మించారు. ఇది గరోడ్ శ్రీబ్రహ్మ బైదర్కాల ప్రాంతంలో ఉంటుంది. ఈ ఆలయంలో మహుత్ముని రోజుకు మూడు సార్లు పూజిస్తారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా ఆక్టోబరు 2, ఆగస్టు 15 తేదీల్లో మహాత్ముడికి విశేష పూజలు చేస్తారు. ఈ ఆలయంలోని మహాత్ముని విగ్రహాన్ని 2006లో పునర్నించారు.
నాలుగున్నర ఎకరాలలో గాంధీజీ గుడి..
దేశంలో మరొక ప్రసిద్ధిచెందిన గాంధీజీ ఆలయం తెలంగాణలోని నల్గొండలో వెలసింది. ఈ ఆలయాన్ని గాంధీజీ 149 వ జయంతి సందర్భంగా 2014లో నిర్మించారు. ఈ ఆలయాన్ని సుమారు నాలుగున్నర ఎకరాల స్థలంలో కట్టారు. రెండు అంతస్తుల భవనం పై అంతస్తులో గాంధీ మహాత్ముని ప్రధాన ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో గ్రంథాలయం కూడా ఉంది.



Click it and Unblock the Notifications












