టీ సిటీ ఆఫ్ ఇండియా దిబ్రూఘర్ గురించి మీకు తెలుసా!
గౌహతి మరియు తేజ్పూర్ తర్వాత అస్సాంలోని అత్యంత ముఖ్యమైన నగరాల్లో దిబ్రూఘర్ ఒకటి. దిబ్రూఘర్ జిల్లా ప్రధాన కార్యాలయం. ఈ నగరాన్ని "టీ సిటీ ఆఫ్ ఇండియా" అని కూడా పిలుస్తారు. కనువిందే చేసే టీ ఎస్టేట్లు ఇక్కడికి వచ్చే సందర్శకులకు అదనపు ఆకర్షణగా మాత్రం చెప్పొచ్చు. అస్సాం పారిశ్రామిక మరియు వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఈ నగరాన్ని 1826లో బ్రిటిష్ వారు ఇక్కడికి వచ్చినప్పుడు పరిపాలనా కార్యకలాపాలకు కేంద్రంగా ప్రకటించారు. ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా పేరొందిన దిబ్రూఘర్ పర్యాట అందాలకు చిరునామాగా కూడా నిలుస్తోంది.
దిబ్రూఘర్ జాతీయ పార్కుల నిలయంగా కూడా పేరుగాంచింది. ఈ పట్టణ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తాయి. ఈ నగరం సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు వాణిజ్య మరియు పారిశ్రామిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కుటుంబసమేతంగా విడిది చేసేందుకు పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

ఈ పర్యటన ద్వారా విభిన్న సంస్కృతిని తెలుసుకోవడంతోపాటు మరియు ఈశాన్య వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క గొప్పతనాన్ని దగ్గరగా చూసే అవకాశం దొరుకుతుంది. ఈ నగరం ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అయితే వర్షాలు కురుస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో విహారం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఏటా ఇక్కడ అధిక వర్షపాతం నమోదువుతుంది. అంచేత ఈ సీజన్లో ఇక్కడి విహార యాత్ర అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు.

డిబ్రూ-సైఖోవా నేషనల్ పార్క్
చాలా అరుదుగా కనిపించే తెల్లటి రెక్కల కలప బాతులకు నిలయంగా పిలువబడే డిబ్రూ-సైఖోవా జాతీయ ఉద్యానవనం పక్షులను వీక్షించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ సీజన్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ కనువిందు చేసే రంగురంగుల పక్షుల కిలకిలారావాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.
ఈ ఉద్యానవనం నీటి గేదె, అడవి గుర్రం మరియు లంగూర్స్ వంటి జంతువులకు ఆవాసం. మరీ ముఖ్యంగా పక్షి ప్రేమికులు తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రాంతం డిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్. ఈ పార్క్ ప్రధాన నగరం నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకునేందుకు ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలు నిత్యం అందుబాటులో ఉంటాయి.

జోకై బొటానికల్ గార్డెన్
జోకై బొటానికల్ గార్డెన్ పట్టణం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరుదైన జాతుల వృక్షజాలం మరియు జంతుజాలాన్ని కలిగి ఉంది. గార్డెన్లో ఆర్కిడ్లు, ఔషధ మొక్కలతో పాటు సుగంధ మొక్కలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ తోటలో బోటింగ్ రైడ్ కోసం పర్యాటకులను ఆకర్షిస్తున్న చెరువు కూడా ఉంది. పర్యాటకులు ఏనుగుల సవారీ ద్వారా గార్డెన్ అందాలను మనసారా ఆస్వాదించవచ్చు.
ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చే వలస పక్షులకు ప్రసిద్ధి చెందిన జోకై రిజర్వ్ ఫారెస్ట్ ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. పచ్చని మొక్కలతో నిండిన ఇక్కడి ఆహ్లాదకమైన వాతావరణం పర్యాటకులకు ప్రశాంతమైన క్షణాలు చేరువచేస్తాయి. కుటుంబసమేతంగా స్థానికులతోపాటు దూర ప్రాంతాలనుంచి వచ్చే సందర్శకులతో జోకౌ బొటానికల్ గార్డెన్ కళకళలాడతూ ఉంటుంది.



Click it and Unblock the Notifications













