ఆహ్లాదకరమైన వాతావరణంలో గోదావరి నది అందాలను తిలకిస్తూ పసందైన రుచుల విందును ఆరగించాలనుకునేవారికి ఏపీ టూరిజం శాక శుభవార్తను అందించింది. నదిలో తేలియాడుతూ వైరేటీ వంటకాలను ఆస్వాదించేలా ఫ్లోటింగ్ రెస్టారెంట్ పర్యాటకుల కోసం ప్రారంభమయ్యింది. ఏపీ పర్యాటక శాఖ సౌజన్యంతో ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో రాష్ట్రంలోని గోదావరిపై మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో పర్యాటకుల కోసం దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు.
వేడుకల కోసం..
రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఉమా మార్కండేయస్వామి ఆలయం సమీపంలోని లాంచీల రేవు నుంచి ఏపీ టూరిజం శాఖ వారి బోట్ల ద్వారా ప్రయాణించి ఫ్లోటింగ్ రెస్టారెంట్కు చేరుకునేలా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం ఈ నెల (అక్టోబర్) 27వ తేదిన (ఆదివారం) ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతులమీదుగా ప్రారంభమయ్యింది.
ఇక, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ కేవలం రుచులను ఆస్వాదించడమే కాకుండా కిట్టీ పార్టీలు, పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునేందుకు సైతం అనువుగా ఉంటుందని యాజమాన్యం తెలిపింది.

170 మంది వరకు కూర్చునేలా..
ఏపీ పర్యాటక శాఖ సౌజన్యంతో గోదావరి మధ్యలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ను అధికారులు ప్రారంభించారు. రాజమహేంద్రవరం ఇసుక తిన్నెల్లో ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ రెస్టారెంట్ని నిర్వహిస్తున్నారు. పర్యాటకులు గోదావరి రుచులు ఆస్వాదించేలా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా గోదావరి మధ్యలోని ఇసుక తిప్పలను ఆనుకుని నీటిలో తేలియాడుతున్న ఈ రెస్టారెంట్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ అందుబాటులో ఉంటుంది.
ఇక్కడ వెజ్, నాన్వెజ్ వంటి అన్నీ రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. రెస్టారెంట్లో 170 మంది వరకు కూర్చునేలా సిట్టింగ్ సామర్థ్యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ను సిల్వర్ స్పూన్, ఆహ్వానం కిచెన్ ప్రాంచైజీస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ అండ్ మెయింట్నెన్స్ విధానంలో నిర్వహిస్తున్నారు. దీని కోసం టూరిజం శాఖకు ఏడాదికి రూ.6.5 లక్షల ఆదాయం ఇవ్వనున్నట్లు సమాచారం.

హేవలాక్ బ్రిడ్జి సమీపంలో..
గోదావరి నదీ తీరాన ఆహ్లాదరకమైన వాతావరణంలో ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ని తీర్చిదిద్దారు. గతంలో కూడా ఈ విధంగా చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది మరుగునపడింది. అయితే, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ల నుంచే ఈ విషయంపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. త్వరలో హేవలాక్ బ్రిడ్జి సమీపంలో కూడా పలు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నాటికి నదీ తీరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతామని అధికారులు వివరించారు.
ఇతర విశేషాలు..
పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన బోట్లలో మాత్రమే టూరిస్టులు ఫ్లోటింగ్ రెస్టారెంట్ దగ్గరకి చేరుకోవాల్సి ఉంటుంది.
ఉదయం 10 గంటల నుంచీ రాత్రి 10 గంటల వరకూ ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది.
లైవ్ కిచెన్లో అన్నీ వేడివేడిగా అప్పటికప్పుడే కుక్ చేసి వండిస్తారు. ఇక్కడ బర్త్డే పార్టీలు, కిట్టీ పార్టీలకు 100 మంది వరకూ సెలబ్రేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. దీని ద్వారా 70 మంది వరకూ ఉపాధి పొందుతారు. ఇందులోని వంటకాల ధరలు కూడా సాధారణంగానే ఉంటాయి. ఏడాదిలో 11 నెలల పాటు ఇది అందుబాటులో ఉంటుంది. వరదల సమయంలో మాత్రం దీనిని ఒడ్డుకి తీసుకునివస్తారు.



Click it and Unblock the Notifications












