పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ విశాఖ నగరం అంటారు. అలాంటి అందమైన ఈ నగరానికి సమీపంలోనే అనేక ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. గంటల వ్యవధి ప్రయాణంలోనే మీరు ఆ గమ్యస్థానాలను చేరుకోవచ్చు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయాలు ప్రశాంతతతోపాటు చరిత్రను పరిచయం చేస్తాయి. వీటి నిర్మాణ శైలి ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సజీవంగా కనిపించే రాతి శిలలు చూపరులను అబ్బురపరుస్తాయి. మరెందుకు ఆలస్యం విశాఖ నగరానికి చేరువలో ఉన్న కొన్ని ప్రఖ్యాత ఆధ్యాత్మిక ఆలయాలను చూసొద్దామా?!
సింహాచలం
సముద్రమాట్టానికి సుమారు 300 మీటర్ల ఎత్తులో సింహాచలం కొండలపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి అంకితం చేయబడిన ఆలయం ఉంది. నిత్యం వేలాదిగా సందర్శకులు ఇక్కడకు వెళ్లి, స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో వరాహ నరసింహ విగ్రహం అక్షయ తృతీయ నాడు తప్ప ఏడాది పొడవునా చందనంతో కప్పబడి ఉంటుంది. సింహాచలం సందర్శించడానికి క్యాబ్లు, బస్సులు నిత్యం అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయం విశాఖ రైల్వే స్టేషన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిటీ నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవడానికి కేవలం 40 నిమిషాల సమయం పడుతుంది.
అన్నవరం
వైజాగ్ నుండి కేవలం 123 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంది. తూర్పు కనుమల పచ్చదనంతో నిండిన ఈ ప్రాంతానికి చేరుకునేందుకు చేసే జర్నీ ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. అన్నవరంలో ఉన్న ఆలయం వీర వెంకట సత్యనారాయణ స్వామికి అంకితం చేయబడింది. నిత్యం పూజలు, వ్రతాలతో అన్నవరం ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా కనిపిస్తుంది. విశాఖ నుంచి రైలు లేదా బస్సులో కేవలం రెండు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అన్నవరం ప్రయాణానికి రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పొచ్చు.

ద్రాక్షారామం
అందాల విశాఖ తీరానికి సమీపంలోనే ద్రాక్షారామం అనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం ఉంది. ఈ ఆలయం భీమేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ అధ్బుత రాతి నిర్మాణం 9వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు చెబుతున్నారు. వైజాగ్ నుండి NH16 మీదుగా 186 కి.మీ దూరం ప్రయాణిస్తే ద్రాక్షారామం చేరుకోవచ్చు. ఇక్కడికి చేరుకునేందుకు నిత్యం APSRTC బస్సులు వైజాగ్ అందుబాటులో ఉంటాయి.
పిఠాపురం
తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో కుక్కుటేశ్వర ఆలయం ఎంతో పేరుగాంచింది. తీర్థయాత్రలకు వెళ్లేవారు వారి జాబితాలో ఈ పురాతన ఆలయాన్ని చేర్చుకుంటా ఉండరు. ఈ ఆలయం వైజాగ్ నుండి 139.2 కిమీ దూరంలో ఉంది. NH16 మీదుగా ప్రయాణించినట్లయితే ఇక్కడకు చేరుకోవడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది. ప్రత్యామ్నాయంగా అనేక రైలు, బస్సు మార్గాలు కూడా ఉన్నాయి.

పాలకొల్లు
పశ్చమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వశిష్ట గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ క్షీర రామ దేవాలయం శ్రీరామునికి అంకితం చేయబడిన దివ్య ప్రదేశం. ఇక్కడి ఆలయంలో కనిపించే శిల్పాల నిర్మాణ శైలి చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. వైజాగ్ నుండి రోడ్డు మార్గంలో దాదాపు ఐదున్నర గంటల దూరంలో పాలకొల్లు ఉంది. ఇది చాలా దూరంలో ఉన్నందున, ప్రజలు సాధారణంగా ఈ ఆలయానికి రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు, దీనికి 7-8 గంటల సమయం పడుతుంది.



Click it and Unblock the Notifications












