రాముడు నడియాడిన నేల.. రామతీర్థం విశేషాలు!!
పురాతన ఆలయాలు ఎన్నో అద్భుతాలు, ఆవిష్కరణలకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇలాంటి ప్రతి ఆలయ నిర్మాణం అంతుచిక్కని అపురూప శైలిలో దర్శనమిస్తాయి. ఉత్తరాంధ్రలోని ప్రముఖ క్షేత్రం రామతీర్థం కూడా అందుకు మినహాయింపు కాదు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది రామతీర్థం. రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది. ఈ ఆలయానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల పొడవూ 600 మీటర్లు ఎత్తున్న ఏకశిలా పర్వతం కనిపిస్తుంది.
దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు. రామాలయం పక్కనే ఉన్న కోనేరులోని నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోవని అంటారు. ఆ నీటి మడుగు నుంచి పశ్చిమం వైపు వెళ్తే భీముని బుర్ర, గాడీ పొయ్యి, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాయి, పాండవుల పంచలు, సీతమ్మ పురిటి మంచం తాలూకు చిహ్నాలు చూడొచ్చు.

చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయం
పదహారవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి సీతారామచంద్ర మహారాజుకు రాముడు కలలో కనిపించి ద్వాపరయుగంలో పాండవులకు ఇచ్చిన విగ్రహాలు ఇక్కడి బోడికొండపైన ఉన్న నీటి మడుగులో ఉన్నట్లు చెప్పాడట. ఆ రాజు విగ్రహాలను వెలికితీయించి ఆలయం నిర్మించాడట. తీర్థంలో దొరికిన విగ్రహాలు కావడం వల్లే ఈ క్షేత్రానికి రామతీర్థం అనే పేరు వచ్చిందని, ఇది అతిపురాతనమైన దేవాలయంగానే కాక..
మరో భద్రాద్రిగానూ గుర్తింపు పొందిందనీ చరిత్ర చెబుతోంది. 1880 ప్రాంతంలో విశాఖపట్నం చరిత్రను రాసిన కార్మైకల్ దొర ఈ క్షేత్రం గురించి అందులో ప్రస్తావించడం విశేషం. రాముడు, ఆంజనేయస్వామి అడుగులుగా భావించే పాద ముద్రికలు ఈ కొండపై ఇప్పటికీ కనిపిస్తాయి.

మనసుదోచే రాతి నిర్మాణాలు..
ఈ ప్రాంగణానికి ఉత్తరాన నీలాచలం, పశ్చిమాన జైన మందిరం ఉంది. రాతినిర్మిత కట్టడాలు చూపరుల మనసును దోచేలా దర్శనమిస్తాయి. ఇక్కడ ఉండే ఇతర ఉపాలయాల్లో వైకుంఠనాథస్వామి, వేణుగోపాలస్వామి, లక్ష్మీదేవి, మాధవస్వామి, వరాహాలక్ష్మి, నరసింహస్వామి, ఆంజనేయస్వామి, ఆళ్వారుల సన్నిధి, ఉమా సదాశివస్వామిలను దర్శించుకోవచ్చు.
అలాగే, రామతీర్థం చూసేందుకు వచ్చే భక్తులు తప్పకుండా భీముని గృహాన్ని కూడా సందర్శించొచ్చు. అంతేకాదు, ఈ ప్రాంతంలో జైనులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడి కొండల్లోని గురుభక్తకొండ, దుర్గకొండ అనే కొండలపై ప్రాచీనమైన బౌద్ధాలయాలు ఉన్నట్టుగా, వాటికి చారిత్రక ప్రాధాన్యం ఉందని చరిత్రకారులు పేర్కొన్నారు.

శివక్షేత్రంగానూ రామతీర్థం..
ఈ క్షేత్రంలో సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మాఘశుద్ధ ఏకాదశి రోజున రాముడికి కల్యాణం నిర్వహించి పౌర్ణమి వరకూ ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను రోజుకొక వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తారు. అలాగే, దసరా సమయంలో పదిరోజుల పాటు వెంకటేశ్వరస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఉంటాయి.
విజయదశమి నాడు స్వామి ఆశ్వవాహనంపైన నీలాచలం వద్దకు చేరి జమ్మి వృక్ష పూజ, ఆయుధ పూజ నిర్వహించడం కన్నుల పండువగా ఉంటుంది. ఈ ఆలయంలో ఏడాదికోసారి జ్యేష్టాభిషేకాలూ నిర్వహించి, స్వామికి సహస్ర ఘటాభిషేకం చేస్తారు.
ఆ రోజున రాముడి నిజరూపాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. ధనుర్మాసంలోనూ నెలరోజులు విశేష పూజలు జరుగుతాయి. రామతీర్థాన్ని శివక్షేత్రంగానూ భావించే భక్తులు మహాశివరాత్రి రోజున ఇక్కడ వైభవంగా జరిగే జాతరను చూసేందుకు సుదూర ప్రాంతాలనుంచి ఇక్కడకు వస్తుంటారు.

ఎలా చేరుకోవాలి..
రామతీర్థం విజయనగరం జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గంలో చేరుకునేవారు విజయనగరం రైల్వేస్టేషన్ లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఆటోలు, బస్సుల్లో రామతీర్థం చేరుకోవచ్చు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి జాతీయ రహదారిపై వచ్చేవారు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్సులు తిరుగుతాయి. విమానాల్లో వచ్చేవారు విశాఖలో దిగి అక్కడి నుంచి విజయనగరం వెళ్లాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications












