సిక్కోలు గ్రామీణ పండుగల విశేషాలు..
మన దేశం సంప్రదాయక వేడుకలకు పుట్టినిళ్లు. గ్రామీణ పండగలు నిత్యం ఏదో ఒక చోట తారసపడుతూ ఉంటాయి. పురాతన కాలంనాటి ఎన్నో జ్ఞాపకాలను ఈ పండగలు గుర్తు చేస్తూ ఉంటాయి. అసిరితల్లి, నీలవేలి దుర్గమ్మ, అప్పన్నమ్మతల్లి, చెవిటమ్మతల్లి.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కొలువుదీరే ఈ దేవతలను కుటుంబ సమేతంగా పూజిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. అలా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కొలువుదీరిన గ్రామీణ దేవతల ఉత్సవాల విశేషాలను తెలుసుకుందాం రండి.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కృష్ణాపురం గ్రామంలో చెవిటమ్మ తల్లి పండగలు మూడు రోజులపాటు ఘనంగా జరిగాయి. ఆ గ్రామ శివారులో ఉన్న కిల్లివాని చెరువు గట్టుపై కొలువు దీరిన చెవిటమ్మ తల్లిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాలనుంచి సైతం భక్తులు పోటెత్తారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర కన్నుల పండుగగా జరిగింది. సాంస్కృతిక కార్య్రకమాలతో పాటు ఆధ్యాత్మిక శ్లోకాలతో గ్రామ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఈ రెండు రోజులు పూజలందుకున్నచెవిటమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఎండావానలను లెక్కచేయకుండా భక్తి పారవశ్యంతో ఆలయ ప్రాంగణం ఆహ్లదభరితంగా మారిపోయింది. ఇలాంటి వాతావరణంలో కుటుంబసమేతంగా గడిపే ప్రతిక్షణం జీవితంలో మర్చిపోలేని ఎన్నో అనుభూతులను చేరువ చేస్తుంది.

గ్రామ కమిటీదే కీలక బాధ్యత..
ముందుగా గ్రామస్థులంతా సమావేశం ఏర్పాటు చేసుకుని పండగ ఏర్పాట్లను చూసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. పండగ మూడురోజుల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ ఎలాంటి ఆధిపత్య ధోరణికి అవకాశం ఉండదు. అంతా ఒక్క మాటపై నిలబడి తమ బాధ్యతలను నిర్వర్తిస్తారు. మొదటి రోజు వీధివీధిన పండగకు సంబంధించి సమాచారాన్ని దండోరా వేసి గ్రామస్థులందరికీ తెలియపరిచారు. పండగ ఎక్కడ మొదలై ఎక్కడ పూర్తవుతుందనే సమాచారం ప్రజలందరికీ తెలియజేసిన అనంతరం గ్రామంలో అవసరమైన విద్యుత్ అలంకరణలను పూర్తిచేశారు. రాత్రి సమయంలో ఈ విద్యుత్ వెలుగులు చూపరులను ఎంతో ఆకర్షించాయి. గ్రామం మొత్తం విద్యుత్ వెలుగులతో మిరుమిట్లు గొలిపాయి.

జంతుబలితో మొక్కులు..
పండగరోజున గ్రామపెద్ద ఇంటినుంచి మొదలుపెట్టి, కాలినడకన మహిళలు, పిల్లలు అనే తారతమ్యం లేకుండా చెవిటమ్మతల్లి ఆలయానికి చేరుకున్నారు. తలపైనా ముర్రాట్లతో మహిళలు భక్తిశ్రద్దలతో ఆ దేవిని ఆరాధించారు. మేకపోతులు, గొర్రెపోతులు, కోళ్లను అమ్మవారి ఆలయం వద్దే బలిచ్చి వారి వారి మొక్కులు తీర్చకున్నారు. బంధుమిత్రులను ఆహ్వనించి విందు భోజనాలను ఏర్పాటు చేశారు. అమ్మవారికి బలిచ్చిన జంతుమాంసాన్నిప్రసాద రూపంలో విందు భోజనాల్లో అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తరహా సంప్రదాయాలను మనదేశంలో అరుదుగా కనిపిస్తాయి.
సంప్రదాయాలకు పుట్టినిళ్లు..
ఇలా గ్రామీణ స్థాయిలో జరిగే జాతరలు మనదేశ సంప్రదాయాలను, ప్రజల మధ్య ఐక్యతను చాటిచెప్పేందుకు ఉదాహరణలుగా నిలుస్తాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య సాగే అప్యాయ పలకరింపులు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. ఉపాధి నిమిత్తం దూరప్రాంతాలకు వలసవెళ్లే వాళ్లు ఇలాంటి పండుగ సమయంలో పుట్టి పెరిగిన ఊరిలో అడుగు పెట్టేందుకు ఎంతో ఉత్సుకత చూపుతారు. నేటి హైటెక్ సమాజంలోనూ ఇలాంటి పురాతన సంప్రదాయాలను పాటిస్తోన్న భారతదేశ ప్రజలను అభినందించాల్సిందే. అందుకే అంటారు.. మనదేశం సంస్కృతి సంప్రదాయాల పుట్టినిళ్లు అని.



Click it and Unblock the Notifications












