ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు తమ ప్రయాణాలను మొదలుపెడతారు. అలాగే భారత్లో కూడా అనేక వింతలు, విచిత్రాలు కలిగిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి అనంతపురంలోని తిమ్మమ్మ మర్రిమాను. ఈ చెట్టులో ఏముంది అనుకుంటున్నారా..? ఈ చెట్టు ప్రపంచప్రఖ్యాతిని సొంతం చేసుకుంది. ఈ చెట్టు ఎన్నో వందల యేళ్ల క్రితంది. ఈ చెట్టుకు అనేక ప్రత్యేకతలున్నాయి. రండి వాటి గురించి తెలుసుకుందాం.
ఈ చెట్టు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వృక్షంగా పేరుగాంచింది. ఇది అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణానికి సుమారు 35 కిలో మీటర్ల దూరంలో గూటిబయలు గ్రామంలో వెలసింది. ఈ తిమ్మమ్మ మర్రిమాను సుమారు ఐదు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి వుంది. 1989లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించుకుంది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అనే మహిళ పేరు పెట్టారు. దీని వెనక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ చెట్టు కింద ప్రస్తుతం తిమ్మమ్మ అనే మహిళ గుర్తుగా చిన్న గుడిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడొక శిలా ఫలకం కూడా ఉంటుంది. దాని మీద తిమ్మమ్మ 1394లో శెట్టి బలిజ శెన్నాక్క వెంకటప్ప, మంగమ్మలకు జన్మించింది. 1434లో ఆమె సతీ సహగమనం చేసింది అని రాసి ఉంటుంది.
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం...
ఈ చెట్టుగురించి అనేక కథలు ఉన్నాయి. అందులో ఒకటి... 14వ శతాబ్ధంలో కొక్కంటి తుమ్మల, ఎద్దులోల్ల బురుజు లాంటి ప్రాంతాలు సామంతరాజుల పరిపాలనలో ఉండేవి. బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతులకు తిమ్మమాంబ అనే కుమార్తె ఉంది. గూటిబైలుకు చెందిన బాలవీరయ్యతో తిమ్మమాంబకు పెళ్లి జరిపించారు. అయితే, వీళ్ల సంసార జీవితం చాలా యేళ్ల వరకు చాలా సాఫీగా సాగిపోయింది. కొంతకాలం తర్వాత వీరయ్య చనిపోయాడు. అయితే, అప్పట్లో సతీసహాగమనం ఆచారం ఉండేదట. ఇక, భర్తమరణంతో తిమ్మమాంబ కూడా వారి ఆచారం ప్రకారం సతీసహగమనానికి సిద్ధమైంది. చితిలోకి దూకేందుకు ఎత్తుకోసం నాలుగు ఎండిన మర్రి గుంజలను నాటారు.

అయితే, అందులో ఈశాన్య దిశలో నాటిన మర్రి గుంజ చిగురించింది. అది కాస్తా మహావటవృక్షంగా పెరిగింది. అప్పటి నుంచి ఈ చెట్టుకు తిమ్మమ్మ మర్రిమాను అనే పేరు వచ్చిందని అంటుంటారు. 1989లో సత్యనారాయణ అరియర్స్ అనే వ్యక్తి ఈ చెట్టు కోసం ఎంతో కృషిచేశారట. దాంతో ఈ తిమ్మమ్మ మర్రిమాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. ఈ మర్రిచెట్టుకు సుమారు 660 సంవత్సరాలకంటే ఎక్కువే వయసు ఉంటుందని చరిత్ర చెబుతోంది.
అనేక ప్రత్యేకతలు..
ఈ చెట్టుకు చాలా ప్రత్యేకతలున్నాయని స్థానికులు అంటుంటారు. పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజ చెయ్యడం వల్ల పిల్లలు కలుగుతారని చాలామంది నమ్మకం. ఈ చెట్టు దగ్గర ప్రతి శివరాత్రికి పెద్ద జాతర నిర్వహిస్తారు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటటే.. ఈ చెట్టుపై ఏ పక్షీ మల విసర్జన చెయ్యదని చెబుతుంటారు. సాయంత్రం ఆరుదాటాక.. ఈ మహావృక్షంపై పక్షులేవీ ఉండవని ఇక్కడివారు చెబుతుంటారు. ఈ చెట్టు కాలక్రమేణా పర్యాటక ప్రదేశంగా మారిపోయింది.
ఇక్కడ పర్యాటకుల కోసం విశ్రాంతి కుటీరాలు, భవనాలను కూడా నిర్మించారు. తిమ్మమాంబ ఘాట్లో నిర్మించిన గదులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ మహావృక్షాన్ని వీక్షించేందుకు కేవలం రెండు తెలుగురాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పాటు విదేశీయులు కూడా తరలి వస్తుంటారు.



Click it and Unblock the Notifications












