అరుదైన జీవులకు కొండంత అండ.. కంబాల కొండ!
పచ్చదనం పరచుకొన్న ఎత్తయిన కొండల మధ్య కనువిందు చేసే అందమైన జలాశయాలను చూస్తూ ప్రయాణం చేయడం మధురమైన అనుభూతి! ప్రకృతి ప్రేమికులను మైమరపించే ఆహ్లాదకర వాతావరణం.. మధ్య మధ్యలో సీతాకోకచిలుకల స్వాగతాలు.. ఆదరించే అరుదైన వృక్షాలు... చుక్కల జింకల సాక్షాత్కారాలు... అడవి పందులు, ముళ్ల పందుల ఆనవాళ్లు.. అంతేనా? దారిలో చిరుత పులి కూడా పలుకరించవచ్చు. ఇంతలా కనువిందు చేసే, మనసు ఉత్కంఠభరితం చేసే విహార అనుభవం ఎక్కడిదో తెలుసా? ఏ సుదూర అటవీ ప్రాంతంలోనో అనుకుంటే పొరపాటు. అది విశాఖ నగరానికి ఆనుకొని ఉన్న కంబాల కొండ విహార విశేషం...
విశాఖ సాగర తీరానికి అభిముఖంగా ఉంది ప్రకృతి రమణీయతకు మారుపేరుగా అందాల కొండ... 'కంబాల'కొండ. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు (ఐజిజెపి) సమీపంలోనే ఉంది. ఇటీవల కాలంలో ఎకో-టూరిజంగా అభివృద్ధి చేయడంతో మా ప్రయాణం కంబాల కొండవైపు సాగింది. మేం కంబాలకొండ ఆవరణలోకి అడుగుపెట్టగానే అదొక ప్రత్యేక ప్రపంచంలా కనిపించింది. పచ్చని చెట్లపై కూర్చొని రకరకాల పక్షులు వింత వింతగా సందడి, అరుపులు మమ్మల్ని ఒక్కసారిగా గ్రామీణ జీవనంలోకి నెట్టేసినట్లుగా అనిపించింది. విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా కొండలను తూర్పుకనుమలుగా పిలవడం తెలిసిందే.. కానీ ఇక్కడ నేడు అదృశ్యమవుతున్న అనేక పక్షి జాతులు, అరుదైన జంతువులూ ఈ కొండపై కొలువు తీరడం ఒక విశేషం. పశ్చిమ కనుమల నుంచి వచ్చే పక్షులు సైతం ఇక్కడ విడిదిని ఏర్పాటు చేసుకోవడం ఒక వింత. ఇందులో రాత్రిళ్లు సంచరించే 'బెల్లీడ్ సీ ఈగల్' (సముద్ర జాతి గద్ద) కూడా ఉంది. ఇది ఈ అడవుల్లో తిరుగుతూ రాత్రిపూట చేపలను వేటాడుతుంది.

అబ్బురపరచిన ప్రకృతి అందాలు..
కంబాల కొండ గేట్లోంచి లోపలకి కాసేపు నడవగానే అబ్బురపరిచే సహజ సిద్ధ కొండ వాగులు (లేక్లు) మమ్మల్ని ఎంతగానో ఆనందపరిచాయి. అలా రెండు అడుగులు వేశామోలేదో 'లివ్ ఇన్ అడ్వంచర్స్' అనే బోర్డు మమ్మల్ని ఆకట్టుకొంది. సాహసాలతో జీవనం అంటూ... 'స్కై వాక్.. గోట్ వాక్... టైర్ వాక్... వ్యాలీ క్రాసింగ్'లను ఏర్పాటు చేసి, పర్యాటకుల దృష్టిని అటువైపు మరల్చేలా చేశారు అటవీశాఖ అధికారులు. స్కై వాక్ అంటే ఈ చివర... ఆ చివర కలిపి ఒక వల లాంటి వంతెన ఏర్పాటు చేశారు. మధ్యలో చిన్న లోయ ప్రదేశం. పర్యాటకులు పడకుండా బెల్టులతో కట్టేస్తారు. వయసుమళ్లినవారికి కాస్త కష్టమే అనుకోండి! గోట్ వాక్ కూడా ఇంచుమించు అలాంటిదే.. రెండు చేతులతో రెండువైపులా తాడును పట్టుకుని కింద ఊయలలా కదిలే కర్రలపై నడవాలి.. ఇవన్నీ ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయి. సీతాకోకచిలుకలు వచ్చి ముచ్చట్లాడుకునే కొలను మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

అంతరించిపోతోన్న జంతువులు పదిలం
కంబాల కొండ ప్రాంతంలో చిరుత, కొండనక్కలు, ముళ్లపందులు, గురుడు పంది కూడా ఉన్నాయి. జంతువులు నడిచే దారిలో సిసి కెమెరాలను అమర్చారు. వీటి సాయంతో అంతరించిపోతున్న జాబితాలో రేసుకుక్కలున్నట్లు గుర్తించారు.. ప్రపంచంలో అతిచిన్న జింక జాతి 'మచ్చ జింకల గుంపు' కూడా ఇక్కడ ఉందని కొందరు చెప్పారు. ఈ కొండ జీవవైవిధ్యానికి నిలువుటద్దంగా మాకు తోచింది. చిరు కొండ మేకలు, ముళ్లపందులు, గురుడు పందులు, పాముల జాతులకు చెందిన పిట్ వైపర్స్, రసల్స్ వైపర్ కూడా ఇక్కడున్నాయట! పక్షుల్లో అరుదైనది సీ అవుల్ రాత్రిపూట తిరిగే గ్రద్ద పశ్చిమ కనుమల నుంచి ఇటువైపు వచ్చినవే!

వ్యూ పాయింట్ సరికొత్తగా...
ఎప్పటికప్పుడు వ్యూ పాయింట్ సరికొత్తగా ఉండేలా రూపకల్పన చేసుకొన్నారని స్థానికులు చెబుతున్నారు. ఏపీలోనే అందాల కొండగా దీనిని అభివర్ణిస్తారు. నడక దారిలో సీతాకోకచిలుకల కేంద్రం, ట్రెక్కింగ్ ప్రదేశాలను చూసుకుంటూ ప్రకృతిని అలా పరిశీలించుకుంటూ సాగిపోయాం. పెద్దగా ఖర్చు లేకుండా కుటుంబ సమేతంగా విహరించడానికి కంబాల కొండ సరైన ఎంపిక. పర్యాటకులకు గొప్ప అనుభూతిని, ఆహ్లాదాన్ని సమకూర్చే కంబాలకొండ ప్రకృతి అందాలను చూసేందుకు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.



Click it and Unblock the Notifications












